11 dead in Delhi fire: ఉత్తర ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయాయని, మృతులను ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని తెలిపారు.
దయాళ్ మార్కెట్ కు సమీపంలోని నెహ్రూ ఎన్ క్లేవ్ లోని పెయింట్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం 5:25 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన పెయింట్ ఫ్యాక్టరీని ఆనుకుని ఉన్న అనేక ఇతర నివాస భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాద సమాచారం తెలియగానే 22 అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పంపించామని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. అలీపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పెయింట్ ఫ్యాక్టరీని ఆనుకుని ఉన్న భవనాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసకువచ్చారు. ప్రమాదం జరిగిన భవనం సమీపంలో ఉన్న ఒక డీ అడిక్షన్ సెంటర్ కు కూడా మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురిని సాహసోపేతంగా రక్షించిన ఒక కానిస్టేబుల్ పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ కానిస్టేబుల్ కరం వీర్ మంటలు వ్యాపించిన భవనంలోనికి ధైర్యంగా వెళ్లి బాధితులను రక్షించారు. డీ అడిక్షన్ సెంటర్ భవనంలో మంటలు చెలరేగుతున్న సమయంలో.. ఆ భవనం వైర్లపై చెక్క చార్పోయ్ పెట్టి, మంటల్లో చిక్కుకున్న వారిని అవతలి వైపుకు వచ్చేలా చేశాడు. ఈ సమయంలో కరమ్ వీర్ కు కూడా కాలిన గాయాలయ్యాయని, అతడిని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని డీసీపీ రవికేఆర్ సింగ్ తెలిపారు.
అగ్ని మాపక సిబ్బంది, స్థానిక అధికారుల కృషితో మూడు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలను ఆర్పివేసిన తరువాత, అగ్నిమాపక అధికారులు లోపలికి వెళ్లి 11 మృతదేహాలను వెలికితీశారు. అవి ఫ్యాక్టరీలోని కార్మికులవిగా అనుమానిస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని ఇంకా గుర్తించలేకపోయారు. వాటిని మార్చురీకి పంపించామని, గురువారం సాయంత్రం పెయింట్ ఫ్యాక్టరీ లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. పక్క భవనాలకు చెందిన ముగ్గురికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 304 కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫ్యాక్టరీని సోనిపట్ కు చెందిన అఖిల్ జైన్ నిర్వహిస్తున్నాడని, ఈ ప్లాట్ నెహ్రూ ఎన్ క్లేవ్ నివాసి రాజ్ రాణికి చెందినదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
టాపిక్