100 మందికి పైగా ఉగ్రవాదులు హతం, పాక్ సైన్యంలో 35 నుంచి 40 మరణాలు : భారత్-100 plus terrorists killed in 9 terror targets in pak pok and pakistan army lost around 35 40 personnel on loc ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  100 మందికి పైగా ఉగ్రవాదులు హతం, పాక్ సైన్యంలో 35 నుంచి 40 మరణాలు : భారత్

100 మందికి పైగా ఉగ్రవాదులు హతం, పాక్ సైన్యంలో 35 నుంచి 40 మరణాలు : భారత్

Anand Sai HT Telugu

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని భారత సైన్యం ఒక పత్రికా సమావేశంలో తెలిపింది. అంతేకాదు పాక్ ఎల్ఓసీలో కొంతమంది సైన్యాన్ని కూడా పాక్ కోల్పోయిందని వెల్లడించింది.

వివరాలు వెల్లడిస్తున్న అధికారులు

ఆపరేషన్ సిందూర్ కింద క్షుణ్ణంగా చర్చించిన తర్వాత తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలను గుర్తించామని భారత సైన్యం తెలిపింది. మే 7న జరిగిన ఆపరేషన్‌లో 9 ఉగ్రవాద స్థావరాల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఆదివారం తెలిపారు. ఈ దాడుల్లో యూసుఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ వంటి వారు కూడా హతమయ్యారు.

లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారద ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. పలు కీలక విషయాలు వెల్లడించారు. గత నెలలో జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసేందుకు మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించామని అధికారులు చెప్పారు.

పాక్ సైన్యంలో మరణాలు

నియంత్రణ రేఖ వద్ద మే 7 నుంచి మే 10 వరకు జరిగిన కాల్పుల్లో పాక్ సైన్యం సుమారు 35 నుంచి 40 మంది సిబ్బందిని కోల్పోయిందని భారత సైన్యం ప్రకటించింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్లలో సైనిక సిబ్బంది, పౌరులతో సహా భారతదేశానికి ఐదు మరణాలు సంభవించాయని అధికారులు తెలియజేశారు.

నివాళులు

'సాయుధ దళాలకు చెందిన ఐదుగురు సహోద్యోగులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఆపరేషన్లలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన పౌరులకు కూడా నివాళులు. మృతుల కుటుంబాలకు ధైర్యంగా ఉండాలి. ఈ క్లిష్ట సమయంలో వీరుల త్యాగాలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది.' అని ఒక అధికారి అన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.