IED blast by Maoists in Chhattisgarh: చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరో ఘాతుకానికి తలబడ్డారు. రాష్ట్రంలోని మావోల ప్రాబల్యం అధికంగా ఉండే దంతెవాడ జిల్లాలో శక్తిమంతమైన ఐఈడీ ( improvised explosive device IED) ని పేల్చి, 10 మంది పోలీసుల ప్రాణాలు తీశారు.
చత్తీస్ గఢ్ లోని దంతేవాడ జిల్లాలోని ఆరన్ఫూర్ పోలీస్ స్టేషన్ పరిథిలోని అటవీ ప్రాంతంలో చత్తీస్ గఢ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (District Reserve Guard DRG) పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని బుధవారం మావోలు శక్తిమంతమైన బాంబుతో (improvised explosive device IED) పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, ఒక సివిలియన్ డ్రైవర్ మృతి చెందారు. మావోల దాడిలో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడంపై చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. మావోలతో యుద్ధం చివరి దశలో ఉందని, ఈ దారుణానికి పాల్పడిన నక్సలైట్లు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు చత్తీస్ గఢ్ రాష్ట్ర డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (District Reserve Guard DRG) దళానికి చెందిన వారు. ఈ డీఆర్ జీ లో అత్యధికులు ముఖ్యంగా మావోలతో పోరాటానికి సుశిక్షితులైన స్థానిక గిరిజన యువకులే ఉంటారు. మావోల కదలికలపై అందిన నిఘా సమాచారం అధారంగా కూంబింగ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా మావోలు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ (IED) తో పేల్చేశారు.