Terror attack | నాన్ లోకల్స్పై మళ్లీ ఉగ్రవాదుల ఘాతుకం
జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో స్థానికేతరులైన కూలీలపై గ్రెనేడ్ దాడి చేశారు.
జమ్మూకశ్మీర్లో కశ్మీరీ పండిట్లు, నాన్ లోకల్స్పై ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, గురువారం స్థానికేతరులైన కూలీలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.
ట్రెండింగ్ వార్తలు
Terror attack | పుల్వామా జిల్లాలో..
కశ్మీర్ లోయలోని పుల్వామా జిల్లాలోని గడూర గ్రామంలో గురువారం ఉగ్రదాడి జరిగింది. స్థానికేతర కూలీలపై గ్రెనేడ్పై దాడి చేయడంతో ఒక కార్మికుడు చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వ్యక్తిని మొహమ్మద్ ముంతాజ్గా గుర్తించారు. ఇతడు బిహార్లోని సాక్వా పార్సాకు చెందిన వాడు. గాయపడిన వారిని మొహమ్మద్ ఆరిఫ్, మొహమ్మద్ మజ్బూల్గా గుర్తించారు. వీరిద్దరు బిహార్లోని రాంపూర్కు చెందినవారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గ్రెనేడ్ దాడి సమాచారం తెలియగానే ఆ ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలింపు ప్రారంభించాయి.
Terror attack | రెండు నెలల తరువాత..
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి స్థానికేతరులపై, స్థానిక పోలీసులపై, కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదులు లక్షిత దాడులు చేస్తున్నారు. అయితే, గత రెండు నెలలుగా ఇటువంటి ఘటన జరగలేదు. మళ్లీ గురువారం ఇలా స్థానికేతర కూలీలపై ఉగ్రదాడికి పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని నాలుగేళ్ల క్రితం ఆగస్ట్ 5వ తేదీననే రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ రద్దు కు నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కశ్మీర్లో ఉగ్రదాడులకు అవకాశం ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి.