Ayurveda Tips: ఆయుర్వేదం ప్రకారం శీతాకాలంలో ఈ ఐదు ఆహారాలను తిన్నారంటే.. ఏ జబ్బూ మిమ్మల్ని తాకలేదు!
Ayurveda Tips: శీతాకాలంలో చలి కారణంగా జలుబు, దగ్గు, జ్వరం, దురద వంటి వ్యాధులు సర్వసాధారణం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఈ వ్యాధులు సులభంగా దాడి చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం శీతాకాలంలో ఎలాంటి జబ్బు బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఐదు ఆహారాలను తప్పకుండా తినాలి.
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం వల్ల చాలా మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. జలుబు, దగ్గు, జ్వరంతో పాటు దురద వంటి అనేక రకాల వ్యాధులు శీతాకాలంలో వచ్చే సాధారణ వ్యాధులు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఏ వ్యాధి అయినా త్వరగా దాడి చేస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మారుతున్న రుతువులకు అనుగుణంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు ఆయుర్వేదం ఉత్తమ మార్గం.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
హిందుస్తాన్ టైమ్స్ లైఫ్స్టైల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ హెర్బల్, ఆయుర్వేద ప్రొడక్షన్ హెడ్ డాక్టర్ ప్రదీప్ శ్రీవాస్తవ శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తప్పకుండా తినాల్సిన ఆహర పదార్థాల గురించి వివరంగా తెలిపారు. ఆయుర్వేదం ప్రకారం ఈ ఆహారాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, చలికాలంలో ఎలాంటి జబ్బు దరిచేరకుండా ఉంటుంది. అవి ఏంటో చూసేద్దామా..
1. వేరుశనగలు (పల్లీలు)
పల్లీ లేదా వేరుశనగ అని పిలిచే ఈ గింజలను తినడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, సూక్ష్మ స్థూల పోషకాల అందుతాయి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచి, అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
2. అంజీర్తో పాటు పాలు
అంజీర్ పండు తినడం వల్ల శరీరానికి శక్తి సమకూరుతుంది. బరువు తగ్గించుకోవాలనే వారు ఇవి తీసుకోవడం వల్ల ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుచేస్తుంది. ఇది శరీరాన్ని వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ అంజీర్ పండ్లను (రెండు నుండి మూడు) వరకూ పాలలో మరిగించి తీసుకోవడం వల్ల మీ లోపల ఉండే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఫలితంగా మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంది.
3. బెల్లం
బెల్లంలో అందరికీ తెలిసినట్లుగానే ఐరన్తో పాటు మరిన్ని ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దానిలోని ఉష్ణ గుణాల కారణంగా, ముఖ్యంగా శీతాకాలంలో తీసుకోవడం చాలా ఉత్తమం. దీన్ని క్రమంగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరం వెచ్చగా ఉండేందుకు దోహదపడుతుంది. అదే సమయంలో బెల్లంను ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.
4. ఉసిరికాయ
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరం. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. జుట్టు రాలడాన్ని నివారించడానికి, చర్మంపై మచ్చలు, మొటిమలను నయం చేయడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. అందువల్ల శీతాకాలంలో ప్రతిరోజూ ఒక ఉసిరికాయను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
5. చ్యవనప్రాశ్
ఇది 20 నుండి 40 ఆయుర్వేద పదార్థాలు, మూలికల మిశ్రమంతో తయారుచేస్తారు. ఇందులో అద్భుతమైన రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. చ్యవనప్రాశ్ లేహ్యం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి, కాలానుగుణ వ్యాధులను నివారించడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అందువల్ల భోజనం తర్వాత ఒక టీస్పూన్ చ్యవనప్రాశ్ తీసుకొంటే రోగనిరోధక శక్తి మెరుగు అవుతుంది.
సంబంధిత కథనం