చాలా మందికి పులిసిన ఆహారం మీద ఇష్టం ఉంటుంది. కానీ అలాంటి ఆహారాన్ని రాత్రి పూట తినడం సరైందా కాదా అనే ప్రశ్న కూడా చాలా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచి, రోగ నిరోధక శక్తిని పెంచడంలో పులిసిన ఆహారం సాయపడుతుంది. కొన్ని సర్వేల ప్రకారం పులిసిన ఆహారం తినడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని తేలింది. కానీ నిద్రపోయే ముందు పులిసిన ఆహారం తినడం సరైందా కాదా అనే విషయం మాత్రం తెలుసుకోవాలి.
పరాటా లోకి పెరుగు, కొన్ని ప్రాంతాల్లో ఊరబెట్టిన చేపలు కూడా ఆహారంలో తీసుకుంటారు. మనం కూడా ఇడ్లీలు, దోశలు.. ఇలా చాలా రకాలుగా పులిసిన ఆహారం తీసుకుంటాం. బియ్యం, పప్పులు నానబెట్టి, మిక్సీ పట్టి పులిసిన పిండిని చాలా రకాల అల్పాహారాల్లోకి వాడతాం. పులియబెట్టిన ఆహారంలో ప్రొబయాటిక్స్ ఉంటాయి. వీటిలో బతికున్న బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
నిపుణుల సలహా ప్రకారం ఉదయం లేదా మధ్యాహ్నం పూట మాత్రమే పులియబెట్టిన ఆహార పదార్థాలు తినడం మంచిది. రాత్రి పూట తినడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య రావచ్చు. పులిసిన ఆహారం తిన్న వెంటనే కడుపులో వేడి పెరుగుతుంది. ఇది రాత్రి వేళల్లో మంచిది కాదు. నిద్రను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కొంతమందిలో కడుపులో అసౌకర్యం, బ్లోటింగ్ లాంటి సమస్యలు వస్తాయి. అందుకే నిద్రపోయే ముందు ఎక్కువ మొత్తంలో ఇలాంటి ఆహారాలు తీసుకోకపోవడం మంచిది.
పులియబెట్టిన ఆహారం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నా కూడా కొంతమంది వాటికి దూరంగా ఉండటమే మేలు.
కొన్ని రకాల పులిసిన ఆహారాలు అందరికీ పడకపోవచ్చు. కొంతమందిలో కొన్ని రియాక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఆహారాలేమైనా ఉంటే గుర్తించి వాటికి దూరంగా ఉండాలి.
పులిసిన ఊరగాయల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. మీరు తక్కువ సోడియం ఉన్న ఆహారం తీసుకోవాలనుకున్నా, లేదా హైపర్ టెన్షన్ లాంటి ఆరోగ్య సమస్యలున్నా కాస్త జాగ్రత్తగా ఉండాలి.
పులిసిన ఆహారం తిన్న వెంటనే కడుపునొప్పి లాంటి సమస్యలుంటే కాస్త ఆలోచించాలి. అది మీరు తిన్న ఆహారం వల్లనేమో అని నిర్ణయించుకోవాలి. కొన్ని రకాల ఉదర సంబంధిత సమస్యలున్న వాళ్లలో కడుపునొప్పి పులిసిన ఆహారం పడట్లేదనడానికి సూచన.