ఆఫీసు డెడ్లైన్లు, కుటుంబ బాధ్యతలు, ఫిట్నెస్ లక్ష్యాలు... ఇలా ఎన్నో సమస్యలు పురుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎంత చేసినా విశ్రాంతి తీసుకోవడానికి తీరిక లేకుండా పోతోంది. ఆరోగ్యం గురించి చాలా చర్చ జరుగుతున్నా, పురుషులు లోలోపల బాధపడుతున్న దీర్ఘకాలిక ఒత్తిడి, తక్కువ స్టామినా, అలసట, టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోవడం లాంటి సమస్యలను చాలా మంది పట్టించుకోవడం లేదు.
ఈ విషయమై కపివా చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ గోవిందరాజన్ HT లైఫ్స్టైల్తో మాట్లాడారు. "ఈ ఫాస్ట్ఫుడ్ యుగంలో, వేగవంతమైన పనులు, డిజిటల్ ప్రపంచం.. ఇలాంటి వాటి మధ్య మనకు కేవలం ప్రొటీన్ షేక్లు, ఎనర్జీ షాట్లు సరిపోవు. దీర్ఘకాలం పాటు మనల్ని నిలబెట్టే పరిష్కారాలు కావాలి. మన భారతదేశపు 5,000 సంవత్సరాల పురాతన జీవన శాస్త్రం ఆయుర్వేదం అలాంటి సమగ్ర, నివారణ మార్గాన్ని అందిస్తుంది. ఇది ఆధునిక పురుషులు ఎదుర్కొంటున్న సవాళ్లకు సరైన పరిష్కారం" అని ఆయన చెప్పారు.
2021 సర్వే ప్రకారం, 46% మంది భారతీయ పురుషులు అనారోగ్యంతో ఉన్నారని తేలింది. గుండె జబ్బులు, మధుమేహం, జీవనశైలి సంబంధిత సమస్యలతో వాళ్ళు పోరాడుతున్నారు. ఇది కేవలం వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలు మాత్రమే కాదు, పురుషుల సంతానోత్పత్తి కూడా తగ్గిపోతోంది. గత నలభై ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా స్పెర్మ్ కౌంట్ 50% కంటే ఎక్కువ పడిపోయింది. నాణ్యత కూడా తగ్గింది. ఇది ఆలోచించాల్సిన విషయమే!
"ఒత్తిడి, జీవన పోరాటంలో వైఫల్యాలు, సరైన పోషకాహారం లేకపోవడం, వాతావరణ కాలుష్యం, నిద్రలేమి... ఇవన్నీ ఈ క్షీణతకు కారణం. దీని ప్రభావం కేవలం పనితీరు తగ్గడం మాత్రమే కాదు.. ఇది దీర్ఘకాలిక శక్తిని బలహీనపరుస్తుంది" అని డాక్టర్ గోవిందరాజన్ వెల్లడించారు.
ఇక్కడే ఆయుర్వేదం రంగ ప్రవేశం చేస్తుంది. కేవలం సమస్యలకు స్పందించడం కాదు, వాటిని సరిచేయడం. "ఆయుర్వేదం కేవలం లక్షణాలను వెంటాడదు. అది శరీరం, మనస్సు, శక్తి... మొత్తాన్ని సమతుల్యం చేస్తుంది. పురుషులకు ఇది కష్టాలను తట్టుకునే శక్తి), బలం, ఒత్తిడి నుండి కోలుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. సింథటిక్ స్టిమ్యులెంట్స్ (రసాయన ఉత్ప్రేరకాలు) లాగా వ్యతిరేకంగా కాకుండా, ఆయుర్వేద మూలికలు శరీరానికి సహకరిస్తాయి," అని డాక్టర్ గోవిందరాజన్ చెప్పారు. ఈ మార్పుకు కారణమైన రెండు శక్తివంతమైన మూలికలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు:
ఆయుర్వేద గ్రంథాల్లో "బలహీనతను నాశనం చేసేది"గా పేరు పొందిన శిలాజిత్, హిమాలయ పర్వతాల నుండి ఊరే ఖనిజాలు నిండిన ఒక జిగురు లాంటి పదార్థం. శాస్త్రీయ పరిశోధనల్లో కూడా తేలిందేంటంటే ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. శక్తిని, స్టామినాను, జీవక్రియను పెంచుతుంది. కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది. 'ఆండ్రోలాజియా'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 90 రోజుల పాటు శుద్ధి చేసిన శిలాజిత్ను తీసుకున్న పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు 23.5 శాతం పెరిగాయని తేలింది. ఈ రోజుల్లోని నిశ్చలమైన, ఒత్తిడితో కూడిన దినచర్యలలో, శిలాజిత్ ఒక శక్తివంతమైన అడాప్టోజెన్గా పనిచేస్తుంది, శరీరాన్ని అతిగా ఉత్తేజపరచకుండా స్టామినాను మెరుగుపరుస్తుంది. అలసటను తగ్గిస్తుంది.
ఆధునిక ఒత్తిడి కేవలం మానసికమైనది కాదు.. అది హార్మోన్ల సంబంధమైనది కూడా. ఆయుర్వేదంలో ప్రముఖ అడాప్టోజెన్ అయిన అశ్వగంధ, శరీరంలోని ప్రధాన ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. 'జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీ'లో ప్రచురితమైన 2021 క్లినికల్ అధ్యయనం ప్రకారం, అశ్వగంధను రోజూ ఎనిమిది వారాల పాటు వాడటం వల్ల ఒత్తిడి గణనీయంగా తగ్గి, నిద్ర నాణ్యత మెరుగుపడిందని తేలింది. ఎక్కువ శక్తి లభిస్తుంది. ఆందోళన తగ్గుతుంది. గాఢ నిద్ర లభిస్తుంది. అలసట ఉండదు.
"ఆయుర్వేదం నిజమైన ఆరోగ్యం. పురుషులలో చిన్న వయసులోనే అలసట, హార్మోన్ల అసమతుల్యత పెరిగిపోతున్న ఈ రోజుల్లో సమస్య వచ్చాక స్పందించడం కాకుండా, ముందుగానే నివారించే దిశగా మనం మారాలి" అని డాక్టర్ గోవిందరాజన్ అన్నారు.
"ఈ రోజుల్లో మనిషి ఆశలు, ఆందోళనల మధ్య జీవిస్తున్నాడు. కానీ బలం కోసం సమతుల్యతను కోల్పోనవసరం లేదు. శిలాజిత్, అశ్వగంధ వంటి మూలికలతో, పురుషులు సహజంగా, స్వచ్ఛమైన, స్థిరమైన శక్తిని పొందవచ్చు.." అని ముగించారు.
(పాఠకులకు ముఖ్య గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలపై మీకు ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్ను సంప్రదించండి.)