అల్పాహారం కోసం ఆరోగ్యకరమైన ఏదైనా చేయాలని ప్రయత్నిస్తుంటే ఈ మెంతి రైస్ ప్రయత్నించండి. ఉదయం అల్పాహారం చేయడానికి బయటకు వెళ్లాలని మీకు అనిపించదు. మెంతి ఆకుల రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతికూరలోని ఆరోగ్యకరమైన కంటెంట్ మరింత రుచిని ఇస్తుంది.
మెంతుల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతకు ముఖ్యమైన ఔషధంగా ఉపయోగిస్తారు. రక్తహీనత ఉన్నవారు హేమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి మెంతి ఆహారం, ఇతర కూరగాయలతో పాటు పచ్చి మెంతి ఆకుకూరలను సలాడ్ రూపంలో తినవచ్చు.
ఈ మెంతి రైస్ తయారీకి తక్కువ సమయం పడుతుంది. తక్కువ పదార్థాలు సరిపోతాయి. ఈ రెసిపీని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. దీని ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా వారంలో రెండు మూడు సార్లు చేసుకుని తినవచ్చు. మనం మెంతి రైస్ ఎలా చేయాలి? ఆ రెసిపీ ఏంటో చూద్దాం.
మెంతి ఆకులు - 1 కట్ట, బియ్యం - 1 గిన్నె, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, బంగాళదుంపలు - 1, ఆకుపచ్చ బటానీలు, పసుపు, మిరియాలు, కొబ్బరి తురుము, కొత్తిమీర, ఉప్పు, నూనె
ముందుగా ఒక పాత్రను స్టౌ మీద పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఇంగువ వేయాలి. దీని తరువాత బంగాళాదుంపను కట్ చేసి వేయించాలి.
అనంతరం పచ్చి బఠానీలు వేసి 3 నుండి 4 నిమిషాలు ఉడికించాలి. దీని తర్వాత మెంతి ఆకులు వేయాలి. ఈ సమయంలో నీటిని జోడించవద్దు, ఆకుకూరలు 3 నిమిషాలు బాగా ఉడికించాలి. తర్వాత పసుపు పొడి వేసి కలపాలి.
మరోవైపు తురిమిన కొబ్బరిని తీసుకుని మిక్సీ జార్లో వేయాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి. నీరు కలపకుండా రుబ్బుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి స్టవ్ మీద ఉంచిన పాత్రలో వేసి కలపాలి. సరిపడేంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
తర్వాత ఉడికించిన అన్నాన్ని పైన చెప్పిన మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే వేడి వేడిగా మెంతి రైస్ రెడీ. మీరు కావాలి అనుకుంటే పచ్చి మిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు. కారంగా తినాలి అనుకునేవారు వీటిని ఎక్కువగా జోడించవచ్చు.
మెంతి రైస్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు ఈ రైస్ తినడం వలన అనేక ప్రయోజనాలు పొందుతారు.