ఒక పెద్ద నగరంలో ఒక వ్యాపారవేత్త కుటుంబంతో నివసిస్తున్నాడు. ఖరీదైన బట్టలు, విలాసవంతమైన బంగ్లా, ఇంట్లో పదిమంది పని మనుషులు, బంగారం, డబ్బు... అతనికి అన్నీ ఉన్నాయి. కానీ అతని మనసు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి వెతుకుతూనే ఉంటుంది. ఆ వెతుకులాట మనశాంతి కోసమే. ఆ మనస్శాంతి దొరకక ఆయన ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చేవాడు.
నిరంతరం వ్యాపార పర్యటనలు, వ్యాపార పోటీ, లాభనష్టాలు, బిజీ జీవితం.. అతనిని మానసికంగా కుంగిపోయేలాగా, అలసిపోయేలాగా చేశాయి. జీవితంలో అన్నీ ఉన్న అసంపూర్ణంగా అనిపించేది. తనకు కావాల్సింది ఇంకా ఏదో ఉందని అతను అనుకునేవాడు. తన జీవితంలో అసంపూర్ణత ఎందుకు ఏర్పడిందో తెలుసుకోవాలని తపించిపోయేవాడు.
ఒకరోజు గ్రామంలో నుంచి వెళుతూ ఉండగా ఊరి చివరన అతనికి ఒక ఆశ్రమం కనబడింది. ఆశ్రమంలో ఒక సాధువు ప్రశాంతమైన చిత్తంతో ధ్యానం చేసుకుంటూ కనిపించాడు. అతడిని చూడగానే తనకు అలాంటి మనశ్శాంతి తనకెందుకులేదో అనిపించింది. ఒకసారి సాధువుతో మాట్లాడి తన మనసును ప్రశాంత పరచుకోవాలనుకున్నాడు. వెంటనే సాధువు వద్దకు వెళ్లాడు.
వ్యాపారవేత్త అతనికి నమస్కరించాడు. సాధువు కళ్ళు తెరిచి ఏం కావాలని అడిగాడు. తనకు అన్నీ ఉన్నాయని కానీ మనసుకు ప్రశాంతత లేదని చెప్పాడు. దానికి సాధువు చిన్నగా నవ్వి నీకు శాంతి కావాలనిపిస్తే నాలాగే కాసేపు ధ్యానంలో కూర్చో అని చెప్పాడు.
వ్యాపారవేత్త సాధువులాగే కూర్చుని కళ్ళు మూసుకొని గాఢంగా ఊపిరి పీల్చుతూ ధ్యానం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అతని మనసులో సముద్రపు అలల్లాగా ఆలోచనలు ఎగిరి పడుతూనే ఉన్నాయి. ఆ ఆలోచనల్లో కొన్నిసార్లు వ్యాపారం గురించి, ఇంట్లో ఉన్న మనుషుల గురించి, వ్యాపార నష్టం గురించి ఇలా వస్తూ ఉన్నాయి. తన ధ్యానాన్ని ఆ ఆలోచనలు ఆపుతూనే ఉన్నాయి.
ఆ నిరంతల ఆలోచనల వల్ల వ్యాపారవేత్త ఐదు నిమిషాల కన్నా ఎక్కువ సేపు ధ్యానం చేయలేకపోయాడు. వెంటనే కళ్ళు తెరిచి ‘స్వామీ.. నేను ధ్యానం చేయలేను. నాకు మనసు చంచలంగా ఉంది. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి’ అని చెప్పాడు
అప్పుడు సాధువు లేచి ‘ఈ ఆశ్రమం చుట్టూ కాసేపు నడుద్దాం పదా’ అని తీసుకెళ్లాడు. అలా నడుస్తున్నప్పుడు ఆశ్రమంలో ఉన్న మొక్కలకు వ్యాపారవేత్త చేతులు, కాళ్లు తగులుతూ ఉన్నాయి. ఒక మొక్క కొమ్మకు ఉన్న ముల్లు అతనికి గుచ్చుకుంది. దీంతో ఆయన నొప్పిగా ఉందని చెప్పాడు. వెంటనే సాధువు ఒక ఔషధ లేపనం పూస్తాడు.
ఆ తర్వాత సాధువు జీవిత సారాన్ని ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఈ ముల్లు నీ శరీరాన్ని గాయపరిచింది. అలాగే నీ మనసులో ఉన్న కోపం, అహంకారం, దురాశ, అసూయ వంటి ముళ్ళు అనేకం ఉన్నాయి. వాటిని నీకు నువ్వే తొలగించుకోవాలి. అప్పుడే నీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనసులో అశాంతి మొత్తం తొలగిపోతుంది. వీలైతే ధ్యానం చేయడానికి ముందు నువ్వు కోపం, అహంకారం, అసూయ, దురాశ వదిలేసేందుకు ప్రయత్నించు. అప్పుడు నువ్వు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. నీ మనసు ప్రశాంతంగానే ఉంటుంది’ అని చెప్పాడు.
అది విన్న వ్యాపారవేత్త అసలు విషయాన్ని గ్రహించాడు. మురికి తనలోనే ఉందని ఆ మురికిని తానే శుభ్రం చేసుకోవాలని అర్థం చేసుకున్నాడు. అప్పటినుంచి తన ఆలోచనలను జీవిత దిశలో మార్చుకున్నాడు. తనకున్న ఆశలు, దురాశలు మెల్లమెల్లగా వదులుకొని ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టాడు. సంపదను అతిగా కూడబెట్టాలన్న అత్యాశను వదిలి సేవ చేయడం మొదలుపెట్టాడు. దానధర్మాలు చేయడం ప్రారంభించాక అతనికి మనసులో ఆనందం ఉప్పొంగడం ప్రారంభమైంది. సేవా దాతృత్వంలోనే తన జీవితాన్ని గడిపాడు.
చాలామంది ఇలాగే మనసు ప్రశాంతంగా లేదని చెబుతూ ఉంటారు. ఆ ప్రశాంతతను పొందాల్సింది ఎవరికి వారే. ఏ విషయాలు ప్రశాంతతను భంగం చేస్తున్నాయో... వాటిని వదిలేస్తే చాలు. మీ మనసు శాంతిగా ఉంటుంది. డబ్బు పై మమకారాన్ని వదిలి పెట్టాలి. విలాసవంతమైన జీవితం పై ఉన్న మమకారమే మీకు అతిగా పనిచేసేలా చేస్తుంది. అతిగా చేసిన పని అలసటనే ఇస్తుంది. మనసుకు కూడా అల్లకల్లోలాన్ని అందిస్తుంది.