మూత్రం తాగితే గాయాలు నయమవుతాయా? నొప్పులు తగ్గుతాయా? ఆధునిక శాస్త్రం ఏం చెబుతోంది?-the controversial urine therapy parash rawals facts health experts opinions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మూత్రం తాగితే గాయాలు నయమవుతాయా? నొప్పులు తగ్గుతాయా? ఆధునిక శాస్త్రం ఏం చెబుతోంది?

మూత్రం తాగితే గాయాలు నయమవుతాయా? నొప్పులు తగ్గుతాయా? ఆధునిక శాస్త్రం ఏం చెబుతోంది?

Ramya Sri Marka HT Telugu

మూత్రం తాగితే గాయాలు మాయమవుతాయా? నొప్పులు తగ్గుతాయా? అంటే అవుననే చెబుతున్నారు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్. మోకాలి గాయం తగ్గడానికి ఆయనకు యూరిన్ థెరపీ ఎంతగానో సహయపడిందంటున్నారు. నిజంగా ఇలా జరుగుతుందా? యూరిన్ థెరపీ గురించి పురాతన, ఆధునిక శాస్త్రాలు చెబుతున్న ఆసక్తికరమైన విషయాలేంటి? తెలుసుకుందాం రండి.

మోకాలి గాయం మానడానికి మూత్రం సేవించిన నటుడు పరేష్ రావల్

బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మోకాలి గాయం గురించి చెప్పిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 'ఘటక్' సినిమా షూటింగ్ సమయంలో ఆయన కాలికి గాయమైందని, దాన్ని నయం చేసుకోవడానికి మూత్రం తాగడం ప్రారంభించానని ఆయన వెల్లడించారు. రెండున్నర నెలలు నయం కావాల్సిన గాయం కేవలం పదిహేను రోజుల్లోనే నయం కావడంతో వైద్యులే ఆశ్చర్యపోయారని కూడా పరేష్ చెప్పారు. అయితే, ఈ 'యూరిన్ థెరపీ' వెనుక అసలు నిజాలేమిటి? ఇది నిజంగా పనిచేస్తుందా? ఆధునిక వైద్య శాస్త్రం దీనిని ఎలా పరిగణిస్తుంది? తెలుసుకుందాం రండి..

పరేష్ రావల్ అనుభవం వెనుక కథ ఏమిటి?

పరేష్ రావల్ చెప్పినదాని ప్రకారం, ఆయన గాయానికి నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే, యాక్షన్ డైరెక్టర్ వీరూ దేవగణ్ ఆయనను పరామర్శించడానికి వచ్చినప్పుడు, మూత్రం తాగడం వల్ల గాయం త్వరగా నయమవుతుందని సలహా ఇచ్చారు. దీంతో, పరేష్ రావల్ ప్రతిరోజూ ఉదయం మూత్రం తాగడం ప్రారంభించారు. పదిహేను రోజుల తర్వాత, ఆయన గాయం వేగంగా నయం కావడాన్ని చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు.

యూరిన్ థెరపీ అంటే ఏమిటి?

మూత్రాన్ని తాగడం లేదా శరీరానికి పూయడం ద్వారా ఆరోగ్య సమస్యలను నయం చేయవచ్చని చెప్పే పద్ధతిని యూరిన్ థెరపీ అంటారు. ఇది పురాతన ఆయుర్వేదం, చైనీస్ వైద్యంలో కూడా ఉంది. మూత్రంలో యాంటీబాడీలు, హార్మోన్లు, ఖనిజాలు ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని కొందరు నమ్ముతారు. ఈజిప్టు వైద్యంలో కూడా ప్రస్తావించబడింది. కొన్ని మత గ్రంథాలలో కూడా మూత్రం వైద్య లక్షణాలు కలిగి ఉంటాయనే ప్రస్తావనలు ఉన్నాయి.

యూరిన్ థెరపీ గురించిన వాదనలు:

1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

మూత్రంలో యాంటీబాడీలు, హార్మోన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని కొందరు వాదిస్తారు. అయితే, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

2. శరీరాన్ని శుద్ధి చేస్తుంది:

మూత్రం శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుందని, ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుందని కొందరు నమ్ముతారు. కానీ, మూత్రం తాగడం వల్ల వ్యర్థ పదార్థాలు తిరిగి శరీరంలోకి ప్రవేశిస్తాయి.

3. గాయాలను నయం చేస్తుంది:

మూత్రంలోని యూరియా, ఇతర పదార్థాలు గాయాలను నయం చేయడానికి సహాయపడతాయని కొందరు చెబుతారు. దీనికి కూడా శాస్త్రీయ ఆధారాలేమీ లేవు.

4. వ్యాధులను నయం చేస్తుంది:

క్యాన్సర్, మధుమేహం, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నయం చేయడానికి యూరిన్ థెరపీ ఉపయోగపడుతుందని కొందరు వాదిస్తారు. కానీ, ఇది పూర్తిగా అవాస్తవం.

ఆధునిక వైద్య శాస్త్రం దీన్ని ఎంతవరకు సమర్థిస్తుంది? వాస్తవాలేంటి?

ఆధునిక వైద్య శాస్త్రం యూరిన్ థెరపీ గురించిన వాదనలను పూర్తిగా ఖండిస్తోంది. డాక్టర్ల ప్రకారం, మూత్రంలో ప్రధానంగా యూరియా, క్రియేటినిన్, ఉప్పు వంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరం నుండి బయటకు పంపాల్సినవి. వాటిని మళ్ళీ తాగడం వల్ల ఎలాంటి లాభం ఉండదని చెబుతోంది. ఆధునిక శాస్త్రం ప్రకారం మూత్రాన్ని తాగడం వల్ల ఏం జరుగుతుందంటే..

  • హానికరమైన బ్యాక్టీరియా: మూత్రంలో హానికరమైన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఉంటాయి, ఇవి కడుపులోకి వెళ్లితే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది.
  • మూత్రపిండాలపై ఒత్తిడి: మూత్రాన్ని తిరిగి తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.
  • ప్లేసిబో ప్రభావం: కొన్ని సందర్భాల్లో, ప్రజలు ఒక చికిత్సను నమ్మినప్పుడు, అది ప్రయోజనకరంగా అనిపించవచ్చు. ఇది ప్లేసిబో ప్రభావం అయి ఉండచ్చు. ఇది అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు.

పరేష్ రావాల్ విషయంలో జరిగింది ఏంటి?

పరేష్ రావల్ అనుభవం పూర్తిగా వ్యక్తిగతమైనది, ఇది శాస్త్రీయంగా నిరూపించబడలేదు. యూరిన్ థెరపీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో అయినా వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.