శెనగపిండితో వండే టేస్టీ కూర ఇది. శెనగపిండి ముక్కల కూర వండడం చాలా అరుదుగా కొంతమందికి మాత్రమే వచ్చు. ఇక్కడ మేము ఆ కూర రెసిపీ ఇచ్చాము. దీన్ని వండుకున్నారంటే మీరు వదల్లేరు. వేడివేడి అన్నంలో ఈ శెనగపిండి ముక్కల కూర వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. చపాతీ రోటీ పూరీతో కూడా దీన్ని తినవచ్చు దీని రెసిపీ చాలా సులువు ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే దీన్ని ఇగురులా ఉండొచ్చు ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి
శెనగపిండి - 100 గ్రాములు
పెరుగు - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
వాము - అర స్పూను
బేకింగ్ సోడా - పావు స్పూను
కారం - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
టమోటోలు - మూడు
పచ్చిమిర్చి - రెండు
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - అర స్పూను
కసూరి మేథి - రెండు స్పూన్లు
నూనె - రెండు స్పూన్లు
ధనియాల పొడి - ఒక స్పూను
1.శెనగపిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి.
2. అందులో వాము, అర స్పూను ఉప్పు, అర స్పూను కారం, పసుపు, నాలుగు స్పూన్ల పెరుగు వేసి వేయాలి.
3. ఈ మొత్తం మిశ్రమాన్ని చేత్తో కలుపుకోవాలి.
4. ఇది ముద్దలా అయ్యే వరకు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుని పూరీ ముద్దను కలుపుకున్నట్టు కలుపుకోవాలి.
5. కాస్త ఆయిల్ కూడా వేసి చేతికి అంటుకోకుండా ఈ ముద్దను కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి.
6. ఇప్పుడు మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, టమోటో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
7. ఇప్పుడు శెనగపిండిని తీసుకొని చిన్న ముద్దను చేత్తో వేరు చేయాలి.
8. దాన్ని నిలువుగా దొండకాయ ఆకారంలో చేత్తోనే చుట్టుకోవాలి.
9. ఇలా పిండి మొత్తం దొండకాయల్లాగా చుట్టుకొని పక్కన పెట్టాలి.
10. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం నీళ్లు వేయాలి.
11. దానిపై ఇడ్లీ స్టాండ్ లోని ఒక ప్లేట్ ని పెట్టి ఆ ప్లేటులో ఈ చుట్టుకున్న శెనగపిండి ముద్దలను వేయాలి.
12. పైన మూత పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. అవి ఉడికిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి.
13. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
14. ఆ నూనెలో జీలకర్ర వేసి వేయించాలి.
15. తర్వాత కసూరి మేతి కూడా వేసి వేయించుకోవాలి.
16. అలాగే అర స్పూను కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.
17. ముందుగా రుబ్బి పెట్టుకున్న టమోటో పేస్ట్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
18. పైన మూత పెట్టి దాన్ని ఇగురు లాగా ఉడకనివ్వాలి.
19. ఇప్పుడు ఆవిరి మీద ఉడికిన శెనగపిండి ముక్కలను తీసి మీల్ మేకర్ సైజులో చిన్న చిన్నగా కోసుకోవాలి.
20. మరొక పక్క ఇగురు ఉడుకుతూ ఉంటుంది. ఆ ఇగురులో మిగిలిన పెరుగును కూడా వేసి బాగా కలపాలి.
21.రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. పావు గ్లాసు నీళ్లు కూడా వేసి పైన మూత పెట్టి ఉడకనివ్వాలి.
22. అది బాగా ఉడుకుతున్నప్పుడు కోసి పెట్టుకున్న శెనగపిండి ముక్కలను అందులో వేసి బాగా కలుపుకోవాలి.
23.చిన్న మంట మీద ఒక 20 నిమిషాలు ఉడికించాలి.
24. నూనె పైకి తేలుతుంటే ఇగురు రెడీ అయినట్టే. చివర్లో కసూరి మేతిని మళ్లీ చల్లుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి.
అంతే టేస్టీ శెనగపిండి ముక్కల కూర రెడీ అయినట్టే. ఇది చాలా వెరైటీగా స్పెషల్ గా ఉంటుంది.
ఎప్పుడూ ఒకేలాంటి కూర కన్నా ఇలా కాస్త డిఫరెంట్ గా శెనగపిండి ముక్కల కూర వండి చూడండి. ఎంతో రుచిగా ఉంటుంది. దీనిలో ఉల్లిపాయలు వాడాల్సిన అవసరం లేదు. అలాగే వెల్లుల్లిని కూడా వాడలేదు. కాబట్టి మీరు శాఖాహారం తినే రోజుల్లో ఈ శెనగపిండి ముక్కలకూర ప్రయత్నించండి. ఎంతో రుచిగా ఉంటుంది.
సంబంధిత కథనం