బెల్లం రుచికి చాలా మంది ప్రియులుంటారు. బెల్లంతో చేసే చాలా రకాల వంటకాలు తినడానికి ఇష్టపడతారు. వాటిలో ఒకటి బెల్లం రొట్టె. సాయంత్రం స్నాక్ లాగా కూడా దీన్ని తినొచ్చు. చల్ల బడ్డాక తింటే కాస్త బిస్కట్ల రుచీ వస్తుంది. వీటిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెల్సుకోండి.
2 కప్పుల గోధుమపిండి
సగం కప్పు బెల్లం తురుము
1 టీస్పూన్ సోంపు గింజలు
1 చెంచా నెయ్యి
1 చెంచా ఎండు కొబ్బరి తురుము
1. ముందుగా పెద్ద గిన్నె తీసుకుని అందులో సగం కప్పు బెల్లం, రెండు చెంచాల నీళ్లు పోసుకోవాలి. బెల్లం కరిగిపోయేదాకా కలపాలి. తర్వాత కనీసం అరగంట సేపు బెల్లం పూర్తిగా పక్కన పెట్టుకోవాలి.
2. ఆలోపు మరో గిన్నెలో గోధుమపిండి తీసుకోవాలి. అందులో సోంపు గింజలు, చెంచా నెయ్యి వేసుకోవాలి.
3. ఇప్పుడు బెల్లం కలిపిన నీళ్లను ఒకసారి వడగట్టుకొని గోదుమపిండి వేసుకున్న గిన్నెలో నేరుగా పోసేసుకోవాలి.
4. పిండి, బెల్లం నీళ్లతోనే బాగా కలుపుకోవాలి. ముందు అన్ని పదార్థాలు బాగా కలిసిపోయాక మరీ అవసరం అనుకుంటేనే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. దాదాపు నీళ్ల అవసరం ఉండదు.
5. చపాతీ పిండిలా బాగా మెత్తగా కలిపేసుకోవాలి. అందులో బెల్లం ఉండటం వల్ల పిండి కాస్త జిగురుగా ఉంటుంది. ఒకవేళ పిండితో చపాతీలు ఒత్తుకోలేనంత మెత్తగా అనిపిస్తే కొద్దిగా గోదుమపిండి కలుపుకోవచ్చు.
6. ఇప్పుడు ఒక బటర్ పేపర్ లేదా ప్లాస్టిక్ కవర్ తీసుకుని మీద కొద్దిగా నెయ్యి రాసుకోవాలి.
7. చిన్న సైజు పిండి ఉండను తీసుకుని పూరీ అంత సైజులో ఒత్తుకోవాలి. అయితే అరిసెల్లాగా కాస్త మందంగా ఉండాలని గుర్తుంచుకోండి.
8. ఒక పెనం పెట్టుకుని చపాతీని వేసుకుని కాల్చుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మరో వైపు కూడా కాల్చేసుకోవాలి. రెండు వైపులా రంగు మారాక మధ్యలో పిండి కూడా బాగా ఉడికిపోతుంది. లేదంటే మార్చుకుంటూ అటూ ఇటూ కాల్చుకోవాలి. వేడిగా సర్వ్ చేసుకుంటే సరి. బెల్లం రొట్టె రెడీ.
టాపిక్