Prawns Popcorn: రొయ్యల పాప్ కార్న్ ఇలా చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు
Prawns Popcorn: రొయ్యల పాప్ కార్న్... రెస్టారెంట్లలోనే దొరుకుతుంది అనుకుంటాం. నిజానికి దీన్ని ఇంట్లో కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
Prawns Popcorn: కొన్ని రకాల వంటకాలు రెస్టారెంట్లలో మాత్రమే వండగలరు అనుకుంటాం, కానీ ఇంట్లోను కూడా వీటిని చాలా సులువుగా చేసుకోవచ్చు. అలాంటి వాటిల్లో రొయ్యల పాప్ కార్న్ ఒకటి. రొయ్యలు తినని పిల్లలకు ఇలా పాప్ కార్న్ రూపంలో రొయ్యలను తినిపిస్తే వారు ఇష్టంగా తింటారు. రొయ్యల పాప్ కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలతో పాటు పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మీరే మళ్లీ మళ్లీ చేసుకుంటారు. ఇవి క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి. తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయి. 40 నిమిషాల్లో ఈ వంట పూర్తయిపోతుంది. ఈ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
రొయ్యల పాప్కార్న్ రెసిపీకి కావలసిన పదార్థాలు
రొయ్యలు - కిలో
జీలకర్ర పొడి - అర స్పూను
కారం - అర స్పూను
ఆమ్చూర్ పొడి - అర స్పూను
క్రీము - అరకప్పు
గుడ్లు - రెండు
నూనె - వేయించడానికి సరిపడా
మిరియాల పొడి - అర స్పూను
బ్రెడ్ పొడి - ఒక కప్పు
కార్న్ ఫ్లోర్ - ఒక కప్పు
రొయ్యల పాప్ కార్న్ రెసిపీ
1. రొయ్యలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. ఆ గిన్నెలోనే ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఆమ్చూర్ పొడి వేసి బాగా కలిపి పావుగంట సేపు ఫ్రిజ్లో పెట్టి మ్యారినేట్ చేయాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో క్రీమ్ను వేసి అందులోనే రెండు గుడ్లను కొట్టి బాగా కలుపుకోవాలి.
4. మరొక గిన్నెలో బ్రెడ్ పొడిని వేయాలి. మరొక గిన్నెలో కార్న్ ఫ్లోర్ పొడిని వేయాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి వేడి చేయాలి.
6. ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు ఒక్కొక్క దాన్ని తీసి గుడ్లు మిశ్రమంలో ముంచాలి.
7. తర్వాత బ్రెడ్ పొడిలో ఇటూ అటూ రోల్ చేయాలి.
8. తర్వాత కార్న్ ఫ్లోర్ పొడిలో మళ్లీ రోల్ చేసి వాటిని వేడి నూనెలో వేసి వేయించాలి.
9. ఇలా అన్ని రొయ్యలను వేయించుకుంటే అవి బంగారు రంగులోకి మారుతాయి.
10. అంతే రొయ్యల పాప్ కార్న్ రెడీ అయినట్టే.
11. ఇవి చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. తినే కొద్ది తినాలనిపించేలా ఉంటాయి. పిల్లలకి నచ్చడం ఖాయం.
12. ఒక్కసారి మీరు చేశారంటే పిల్లలు మళ్లీ మళ్లీ వీటిని అడుగుతారు.
రొయ్యలు అప్పుడప్పుడు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి12 మన శరీరంలో లోపిస్తే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డిప్రెషన్, అలసట, బలహీనత వంటివి కనిపిస్తాయి. రొయ్యలు పోషకాహార జాబితాలో ఒకే వస్తాయి. ఇవి ఎంత తిన్నా బరువు పెరగరు. వీటిలో కేలరీలు కూడా తక్కువే. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రొయ్యలను తరచూ తినడం మంచిది. ముఖ్యంగా రొయ్యల్లో సెలీనియం అనే ఒక మూలకం ఉంటుంది. ఇది మన శరీరానికి అత్యవసరమైనది. క్యాన్సర్ బారిన పడకుండా ఇది కాపాడుతుంది. కాబట్టి రొయ్యలను వారానికి కనీసం రెండు సార్లు తినడం అలవాటు చేసుకోవాలి.
రొయ్యలు తినడం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. చికెన్ కన్నా 22 రెట్లు అధికంగా విటమిన్ Eను కలిగి ఉంటాయి. కాబట్టి రొయ్యలు వారానికి రెండు సార్లు తినడం అలవాటు చేసుకోవాలి. రొయ్యలను మనుషులు తినడం ప్రారంభమైంది ఈనాడు కాదు. 1,60,000 ఏళ్ల నుంచి మనిషి ఆహారంలో ఇవి భాగం అయ్యాయి.