17 ఏళ్ల వయసులో కేవల్ కాక్కా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్థిగా తన స్నేహితులతో కాలేజీ క్యాంటీన్లో టీ తాగుతుండగా, తాను చేస్తున్నదంతా తప్పని గ్రహించాడు. తాను ఈ దారిలో ఉండాల్సింది కాదని, ఒక పర్వతారోహకుడు కావాల్సిందని ఆయనకు అనిపించింది.
ముంబైకి చెందిన ఒక యువకుడికి ఇది అసాధారణమైన పిలుపు. కానీ తను, తన స్నేహితులు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో మాట్లాడుకుంటున్నప్పుడు, ఆయనకు మరో ఆలోచన రాలేదు. కొందరు ఒక ప్రముఖ కార్ కంపెనీలో పనిచేయాలని, మరికొందరు ఉన్నత విద్యను అభ్యసించాలని మాట్లాడుకున్నారు. వాళ్ళు తన వైపు తిరిగినప్పుడు, "నేను పర్వతాలలో ఉండాలనుకుంటున్నాను" అని చెప్పినట్లు ఆయనకు గుర్తుంది.
క్యాంటీన్లో ఆ రోజు తర్వాత, తాను చదువు మానేస్తున్నట్లు కుటుంబానికి చెప్పాడు. అంతులేని డెస్కుల మధ్య కూర్చోవడం అనే ఆలోచనను ఆయన భరించలేకపోయాడు.
"నేను డిగ్రీ పూర్తి చేసి ఉంటే, ఒక సాధారణ ఉద్యోగంలో చేరేవాడిని. అప్పటికే నేను పర్వతాలలో ఆనందాన్ని కనుగొన్నాను. నేను దానిని మరింత అన్వేషించాలనుకున్నాను" అని కాక్కా చెప్పారు. "ఇది సంప్రదాయబద్ధమైనది కాదు. దీన్ని వృత్తిగా మార్చుకున్నవారు నాకు ఎవరూ తెలియదు. కానీ మరింత తెలుసుకోవడానికి ఏకైక మార్గం, నేను కోరుకున్న దాని వైపు మొదటి అడుగు వేయడమే." అని చెప్పారు.
కాక్కా తన వేసవి సెలవులను హిమాలయాలలో గడిపాడు. ఆయన తండ్రి హిరెన్ కాక్కా, ఒక వ్యాపారవేత్త, చిన్న వయస్సులోనే ఆయనను ఎత్తైన ప్రాంతాలకు ట్రెక్కింగ్కు పరిచయం చేశారు. ఆ నడకలలో ప్రకృతితో తనకు కలిగిన లోతైన అనుబంధం, "శబ్దాలు, ఏకాంతం రెండూ" తన జీవితాన్ని చుట్టుముట్టేలా అనిపించాయి. 34 ఏళ్ల కాక్కా సరిగ్గా అదే చేశాడు. ఇటీవల, ఆయన ఒక రకమైన చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోని పద్నాలుగు 8,000 మీటర్లకు పైబడిన శిఖరాలలో ఎనిమిదింటిని అధిరోహించిన మొదటి భారతీయుడిగా ఆయన నిలిచారు. మరో ఇద్దరు భారతీయులు, అర్జున్ వాజ్పాయ్, భరత్ తమ్మినేని ఎనిమిది శిఖరాలను అధిరోహించి దగ్గరిగా వచ్చారు. అయితే వారి అధిరోహణలలో రెస్క్యూ ప్రయత్నాలు అవసరమయ్యాయి.
ప్రపంచంలో మూడవ ఎత్తైన పర్వతం కాంచన్జంగాను అధిరోహించడంతో కాక్కా తన మైలురాయిని చేరుకున్నాడు. ఈ శిఖరం గతంలో ఆయనను తీవ్రంగా పరీక్షించింది.
2022లో తన మొదటి ప్రయత్నంలో, తీవ్రమైన ఫ్రాస్ట్బైట్, కాలి బొటనవేలు పగిలిపోవడం వల్ల శిఖరానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కిందకు వచ్చిన తర్వాత, ఆయన కాలి వేలికి పాక్షిక కోత అవసరమైంది. ఈ ప్రక్రియ నుండి కోలుకోవడానికి ఆయనకు నాలుగు నెలలు పట్టింది.
"పర్వతాలు నా పాఠశాల. అవి నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దే ప్రదేశం. ప్రతిసారి నేను వాటి వద్దకు వెళ్ళినప్పుడు, నేను ఏదో కొత్తదాన్ని నేర్చుకుంటాను. సిలబస్ చాలా విస్తృతమైనది. మీకు సౌకర్యంగా ఉండే వేగంతో మీరు ముందుకు సాగవచ్చు" అని ఆయన చెబుతున్నారు. ఒక తప్పు చేస్తే పర్వతాలు మిమ్మల్ని విఫలం చేస్తాయి, మిమ్మల్ని తిరిగి కిందకు దింపుతాయి అని నవ్వుతూ చెప్పారు. తాను నేర్చుకున్న గొప్ప పాఠం ఆశయం వినయంతో కలిసి ఉండాలనేదేనని చెప్పారు.
"పర్వతం ఒకరి అహంకారాన్ని సంతృప్తి పరచడానికి స్థలం కాదు" అని ఆయన హెచ్చరించారు. ఒకరు ప్రణాళిక వేసుకోవచ్చు, సిద్ధం కావచ్చు, శిక్షణ పొందవచ్చు. కానీ చివరికి, జీవితంలో చాలా విషయాల మాదిరిగానే, మార్గం ఎలా సాగుతుందో అది ఎల్లప్పుడూ ఒకరి నియంత్రణకు మించినది.
ప్రస్తుతం ఆయనకు అందించే మోటివేషనల్ ఉపన్యాసాలు, TEDx టాక్లలో, ఆయన ఈ సూత్రాన్ని తన ప్రధాన నమ్మకానికి ఆధారంగా ఉపయోగిస్తారు. పర్వతారోహణ అనేది జీవితాన్ని దాని పరాకాష్టకు తీసుకువెళ్లడమేనని అంటారు.
ప్రతి ఒక్కరికీ అధిరోహించాలనుకునే ఒక పర్వతం ఉంటుందని, ఆ పెద్ద కలను వెంబడించకుండా వారిని ఆపగల భయం, ఆత్మసందేహం, అనిశ్చితిని ప్రతి ఒక్కరూ అనుభవిస్తారని ఆయన చెబుతున్నారు.
మనం ప్రమాదానికి, మరణానికి, అసౌకర్యానికి చాలా భయపడతాము అని కాక్కా చెబుతున్నారు. "నిజం ఏమిటంటే, ఏదైనా కొత్త శిఖరాన్ని అధిరోహించాలంటే, ఎలా విఫలమవ్వాలో మీకు తెలియాలి." అని చెప్పారు.
‘పరిశోధన చేయండి. ప్రమాదాలను గుర్తించండి. భయాన్ని అనుభవించండి. దానిని స్వాధీనం చేసుకోనివ్వవద్దు.’ అని వివరించారు.
ఉదాహరణకు, తాను 8000 మీటర్ల శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించిన ప్రతిసారి మరణం ప్రమాదంలో ఉందని ఆయనకు తెలుసు. ఈ శిఖరాలపై ఎదుర్కొనే తుఫానులు చాలా మంది మానవులకు ఎన్నడూ తెలియనివి అని ఆయనకు తెలుసు. కానీ అలాంటి తుఫానును ఎదుర్కోవడానికి చాలా భయపడటం... అది ఆయనకు మరింత భయంకరమని ఆయన చెబుతున్నారు.
"మరణం అనివార్యం. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏమి చేయాలనుకుంటున్నారు? మీరు ఏ భయాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? మీరు ఏమి కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు?"
అయితే, కోల్పోవడం లక్ష్యం కాదు. నేర్చుకోవడమే.
"మంచి పరిశీలకుడిగా ఉండండి, ఎందుకంటే చుట్టూ పాఠాలు ఉన్నాయి" అని కాక్కా చెబుతున్నారు.
2008లో ఆ క్యాంటీన్ రోజు తర్వాత, ఆయన సహ్యాద్రిలలో శిక్షణ ప్రారంభించాడు. క్రమంగా కఠినమైన అధిరోహణల ద్వారా తన శరీరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో నేర్చుకున్నాడు. 2016 వరకు ఆయన తన మొదటి హిమాలయ అధిరోహణ చేయలేదు. ఆ సంవత్సరం ఆయనకు 25 ఏళ్లు, అప్పుడు లడఖ్లోని కున్ పర్వతంపై 6,200 మీటర్ల వద్ద మూడు రోజుల పాటు ప్రతికూల వాతావరణం వల్ల చిక్కుకుపోయాడు.
ఇది ఎదురుదెబ్బలు, సహనం, మనుగడకు సంబంధించిన తన మొదటి పాఠం అని ఆయన చెబుతున్నారు.
తరువాతి సంవత్సరం, ఆయన తన మొదటి 8,000 మీటర్ల శిఖరాన్ని, నేపాల్లోని మనాస్లును అధిరోహించాడు. ఆ తర్వాత సంవత్సరం, ప్రపంచంలో ఆరవ ఎత్తైన పర్వతం, నేపాల్-టిబెట్ సరిహద్దులోని చో ఓయును అధిరోహించాడు. హై-ఆల్టిట్యూడ్ గైడ్ సహాయం లేకుండానే ఆయన దీనిని అధిరోహించాడు.
ఈ అధిరోహణలలో ఎత్తైన ప్రదేశాలలో ఆయనకు నమ్మశక్యం కాని సూర్యోదయాలు, అద్భుతమైన మంచు దృశ్యాలు ఆనందాన్ని ఇచ్చాయి.
ఒక పర్వతారోహకుడిగా అభివృద్ధి చెందడం కొనసాగించడానికి, 2019లో, ఆయన ఎవరెస్ట్, దాని పొరుగున ఉన్న లోత్సేలను ఆరు రోజులలో రెండుసార్లు అధిరోహించాడు. ఆ ఘనత తర్వాత ఆయనకు రాష్ట్రపతి చేతుల మీదుగా తెన్సింగ్ నార్గే అవార్డు లభించింది.
తరువాత అన్నపూర్ణ I, ధౌలగిరి, మకాలు 2021, 2023 మధ్య అధిరోహించారు.
ప్రతి అధిరోహణను ప్రారంభించినప్పుడు తనకు మొదట భయం కలుగుతుందని ఆయన చెబుతున్నారు. తరువాత ఆనందం కూడా కలుగుతుందని చెప్పారు. ముంబైలో తన అవుట్డోర్-ఎక్విప్మెంట్ దుకాణాన్ని నడుపుతూ, సహ్యాద్రిలలో ట్రెక్కింగ్ బృందాలకు నాయకత్వం వహిస్తూ, తన రోజువారీ దినచర్యను కొనసాగిస్తున్నప్పుడు ఒక కొత్త శిఖరం యొక్క వాగ్దానం ఆయన ముందు కనబడుతుంది.
తాను ప్రమాదాన్ని చిన్నదిగా చూపడానికి ప్రయత్నించడం లేదని ఆయన వివరించారు. లక్ష్యం తిరిగి కిందకు రావడం; క్లైంబింగ్ సాధ్యమయ్యే వయస్సు దాటి బాగా జీవించేలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం, సిద్ధం కావడం, ముందుకు సాగడమే.. అని చెప్పుకొచ్చారు.
"ఇది మీరు మీ సర్వస్వాన్ని ఇవ్వాల్సిన యుద్ధభూమి కాదు" అని కాక్కా చెబుతున్నారు. "లక్ష్యం ఏమిటంటే, బేస్ క్యాంప్కు తిరిగి నడిచేంత రిజర్వ్లతో శిఖరాన్ని చేరుకోవడం. అదే విజయం." అని చెప్పారు.