Tiger Safari: పులులను దగ్గరనుంచి చూడాలా? మన దేశంలో బెస్ట్ టైగర్ సఫారీలు ఇవే..-on international tiger day know the best tiger safari places in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tiger Safari: పులులను దగ్గరనుంచి చూడాలా? మన దేశంలో బెస్ట్ టైగర్ సఫారీలు ఇవే..

Tiger Safari: పులులను దగ్గరనుంచి చూడాలా? మన దేశంలో బెస్ట్ టైగర్ సఫారీలు ఇవే..

International Tiger Day 2024: ఇంటర్నేషనల్ టైగర్ డే సందర్భంగా తప్పకుండా చూడాల్సిన టైగర్ సఫారీలెక్కడున్నాయో తెల్సుకోండి.

టైగర్ సఫారీ

పులులు రాజసం ఉన్న జీవులు. నడకలో ఠీవి, పంజాలో శక్తిని ప్రతిబింబిస్తాయి. ఈ గంభీరమైన వేటాడే జంతువులను వాటి సహజ ఆవాసాలలో చూడటం అద్భుతమైన అనుభవం. వన్యప్రాణుల అభయారణ్యాల్లోని పచ్చని చెట్లలో వాటి విలక్షణమైన చారలు, మెల్లని కదలికలు అందంగా కనిపిస్తాయి. అదృష్టవంతులు మాత్రమే అడవిలో ఈ జీవులను చూడగలరు. వాటిని చూసేందుకు గంటల తరబడి జనం క్యూ కడుతుంటారు.

ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దశాబ్దం క్రితం పులుల సంఖ్య ఎంత తక్కువగా ఉండేదో తెల్సుకోవాలి. వేటగాళ్ల బారిన పడి ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోయింది. ఈ క్రూరత్వానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా గళం వినిపిస్తున్న నేపథ్యంలో, అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఆకర్షణీయమైన జంతువులను వాటి ఆవాసాలలో సంరక్షించడం, వాటిని అంతరించిపోకుండా రక్షించాల్సిన ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన కొన్ని టైగర్ సఫారీలు ఉన్నాయి. అవేంటో చూడండి.

బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్:

ఈ వన్యప్రాణి అభయారణ్యంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉంది. మధ్యప్రదేశ్ లోని ఉమారియా జిల్లాలోని వింధ్య పర్వతాలకు సమీపంలో ఉన్న బాంధవ్ గఢ్ నేషనల్ పార్క్ లో అనేక రకాల అడవి పందులు, జింకలు, చిరుతలు ఉన్నాయి. పులులను ఇక్కడ చూడ్డానికి ఉత్తమ సమయం ఏప్రిల్ నుండి జూన్ వరకు.

రణథంబోర్ నేషనల్ పార్క్:

భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ టైగర్ రిజర్వ్ లలో ఒకటి. ఇది రాజస్థాన్ లో ఉంది. ఇది గొప్ప చరిత్ర, వైవిధ్యమైన వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. అక్కడ కనిపించే అనేక రకాల జంతు జాతుల కారణంగా ఇది వన్యప్రాణి ఫోటోగ్రాఫర్లకు మంచి డెస్టినేషన్ గా మారింది. ఈ పార్కులో నీరు నిల్వ ఉండే చాలా ప్రదేశాలున్నాయి. సాధారణంగా, పులులు వాది దగ్గర కనిపిస్తాయి. రణతంబోర్ సందర్శనకు ఉత్తమ సమయం శీతాకాలం. అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో తప్పకుండా దీన్ని చూడాల్సిందే.

కన్హా నేషనల్ పార్క్:

పచ్చిక బయళ్లు, దట్టమైన అడవులతో కన్హా జాతీయ ఉద్యానవనం వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది. ఈ జాతీయ ఉద్యానవనం రుడ్యార్డ్ కిప్లింగ్ యొక్క 'జంగిల్ బుక్'కు ప్రేరణగా నిలిచింది. మధ్యప్రదేశ్ లో ఉన్న కన్హా నేషనల్ పార్క్ లో బారసింఘ (స్వాంప్ జింకలు) సంఖ్య గణనీయంగా ఉంది. సందర్శనకు అనువైన సమయం శీతాకాలం. అప్పటి చల్లని వాతావరణం వివిధ అడవి జంతువులను గుర్తించడానికి అనుకూలిస్తుంది.

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్:

ఉత్తరాఖండ్ లో ఉన్న ఇది భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక జాతీయ ఉద్యానవనాలలో ఒకటి. హిమాలయాల దిగువన ఉన్న ఈ ఉద్యానవనం అనేక రకాల వన్యప్రాణులకు ఆవాసంగా నిలిచే అందమైన ప్రకృతి దృశ్యం కలిగి ఉంటుంది. పులులతో పాటు, స్లోత్ ఎలుగుబంట్లు, గోరల్స్ చిరుతపులులు, జింకలు వంటి ఇతర జంతువులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. పులులను చూడ్డానికి ఉత్తమ అవకాశం కోసం, పార్కు యొక్క తూర్పు భాగానికి, ముఖ్యంగా బిజ్రానీకి వెళ్ళండి. పార్కులో ధికాలాలోని వాచ్ టవర్స్ కు వెళ్లి ఆడుకునే పులులను చూసే అవకాశం ఉంది.

పన్నా నేషనల్ పార్క్:

ఈ ప్రాంతం ప్రధానంగా పులులు, ఇతర క్షీరదాలను పరిశీలించడానికి అద్భుతమైన చోటు. ఈ ఉద్యానవనంలో పందిరి లాగా అల్లుకున్న చెట్లు, చిన్నగా ఎదిగిన గడ్డి భూములు, చెట్ల పొదలు చాలా ఉంటాయి. పన్నా టైగర్ రిజర్వ్ లో పులులు మాత్రమే కాకుండా, చిరుతపులులు, ఘరియల్స్, చీతాలు, చింకర లాంటి మనకు తెలియన మరెన్నో ఇతర జంతు జాతులకు కూడా ఇది ఆవాసంగా ఉంది. ఈ ఉద్యానవనం 200 జాతుల వలస, నివాస పక్షులకు ఆతిధ్యం ఇస్తుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో వచ్చే పక్షి గుంపులను కూడా చూడొచ్చు ఇక్కడ. పన్నా నేషనల్ పార్క్ సందర్శనకు అక్టోబర్ నుంచి జూన్ వరకు అనువైన సమయం.