Mutton Dum Biryani: కనుమ రోజు మటన్ దమ్ బిర్యానీ ఇలా సింపుల్ పద్ధతిలో చేసేయండి, రెసిపీ ఇదిగో
హోటల్ స్టైల్లో మటన్ దమ్ బిర్యాని ఇలా చేశారంటే అదిరిపోతుంది. చాలామందికి మటన్ దమ్ బిర్యాని చేయడం రాదు. ఇక్కడ మేము సింపుల్ గా ఎలా చేయాలో చెప్పాము.
మటన్ దమ్ బిర్యాని పేరు చెబితేనే నోరూరిపోతుంది. కానీ దీన్ని వండడం వచ్చింది చాలా తక్కువ మందికే. మటన్ వండడం కష్టమని ఎంతోమంది దమ్ బిర్యాని కూడా చేయడం మానేస్తారు. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో మటన్ దమ్ బిర్యాని చేసి చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. పైగా సులువుగా అయిపోతుంది. మటన్ దమ్ బిర్యాని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

మటన్ దమ్ బిర్యానీ రెసిపీకి కావలసిన పదార్థాలు
మటన్ - ఒక కిలో
బిర్యానీ ఆకులు - మూడు
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
పుదీనా తరుగు - నాలుగు స్పూన్లు
లవంగాలు - 15
యాలకులు - ఆరు
అనాస పువ్వులు - నాలుగు
మరాఠీ మొగ్గలు - రెండు
దాల్చిన చెక్క - పెద్ద ముక్క
జాజికాయ పొడి - పావు స్పూను
జాపత్రి - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - పావు కప్పు
ధనియాల పొడి - ఒక స్పూను
కారం - రెండు స్పూన్లు
జీలకర్ర పొడి - ఒక స్పూను
గరం మసాలా - ఒక స్పూను
పెరుగు - ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
నిమ్మకాయ రసం - రెండు స్పూన్లు
బాస్మతి బియ్యం - ఒక కిలో
నెయ్యి - నాలుగు స్పూన్లు
పచ్చిమిర్చి - నాలుగు
మటన్ దమ్ బిర్యాని రెసిపీ
1. మటన్ ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
2. ఇప్పుడు అదే గిన్నెలో మూడు లవంగాలు, ఒక అనాస పువ్వు, రెండు యాలకులు, బిర్యానీ ఆకులు, కొత్తిమీర తరగు, షాజీరా, పుదీనా తరుగు, మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి, ధనియాల పొడి, కారం, జీలకర్ర, ఉప్పు, జాపత్రి, పసుపు అన్ని వేసి ముక్కలను బాగా కలపాలి.
3. అలాగే అందులో నిమ్మకాయ రసం, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు దాన్ని ఐదారు గంటల పాటు మ్యారినేట్ చేయాలి.
5. బాస్మతి బియ్యం ముందుగానే నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యాని వండే గిన్నె పెట్టి నూనె వేయాలి.
6. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను రంగు మారేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు ఆ గిన్నెలోనే ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ మిశ్రమాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి.
8. ముక్కలు దాదాపు 70 శాతం ఉడికించాలి. అందులో వేడి నీటిని వేస్తే మటన్ త్వరగా ఉడుకుతుంది.
9. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర తరుగును కూడా చల్లుకొని మళ్ళీ ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
10. ఇప్పుడు అన్నం వండి ఎందుకు ఒక గిన్నెను తీసుకొని మూడున్నర లీటర్ల నీటిని వేయాలి.
11. అందులోనే బిర్యాని ఆకులు, అనాస పువ్వులు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, మరాఠీ మొగ్గలు ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి.
12. అది సలసలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని, పుదీనా, కొత్తిమీరను వేసి పెద్ద మంట మీద ఉడికించాలి.
13. ఉడికాక ఆ బియ్యాన్ని స్ట్రైనర్ తో తీసి మటన్ పై పొరలు పొరలుగా వేసుకోవాలి.
14. అలాగే మధ్య మధ్యలో గరం మసాలా, నెయ్యి, కొత్తిమీర తరుగు వేయించుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటూ ఉండాలి.
15. ఇప్పుడు పైన మూత పెట్టి ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద పావుగంట పాటూ ఉడికించుకోవాలి.
16. ఆవిరి బయటికి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
17. ఇప్పుడు 30 నిమిషాలు పాటు పైన మూత తీయకుండా అలా ఆవిరి మీదే ఉడికేలా ఉంచేయాలి.
18. తర్వాత మూత తీసి గరిటతో కలిపితే టేస్టీ మటన్ దమ్ బిర్యాని రెడీగా ఉంటుంది.
19. ఇది వండడానికి కాస్త ఓపిక అవసరం ఈ పద్ధతిలో వండితే మీకు దమ్ బిర్యాని అద్భుతంగా వస్తుంది.
దమ్ బిర్యాని పేరు వింటేనే నోరూరిపోతుంది. కానీ మటన్ దమ్ బిర్యాని వండడం కష్టం అనుకుంటారు. మేము చెప్పిన పద్ధతిలో వండి చూడండి. మీకు చాలా సులువుగా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ కనుమకు మీరు మటన్ దమ్ బిర్యాని మేము చెప్పిన రెసిపీని ఫాలో అవ్వండి.