Multigrain Laddu: మల్టీ గ్రెయిన్ చపాతీ పిండి మార్కెట్లో లభిస్తోంది. వాటితో చేసిన చపాతీలు తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయని చెబుతారు. అలాగే మల్టీ గ్రెయిన్ లడ్డూలను కూడా ఇంట్లో చేసి పెట్టుకుంటే మంచిది. వీటిని చేయడం చాలా సులువు. ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ సమయంలో పిల్లలకు ఒక లడ్డు తినిపించండి చాలు. ఆ రోజంతా వారు శక్తివంతంగా ఉంటారు. మల్టీ గ్రెయిన్ అంటే అందులో గోధుమలు, రాగులు, ఓట్స్, శనగపప్పు, మొక్కజొన్న వంటివి ఉంటాయి. కావాలనుకుంటే మీరు డ్రైఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు. వీటన్నింటితో చేసేదే మల్టీ గ్రెయిన్ లడ్డు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
గోధుమలు - అరకప్పు
ఓట్స్ - అరకప్పు
మొక్కజొన్న- అరకప్పు
రాగులు - అరకప్పు
శనగపప్పు - అరకప్పు
బెల్లం - మూడు కప్పులు
నెయ్యి - అర కప్పు
యాలకుల పొడి - ఒక స్పూను
డ్రై ఫ్రూట్స్ - అరకప్పు
1. స్టవ్ మీద కళాయి పెట్టి గోధుమలు, రాగులు, ఓట్స్, మొక్కజొన్న, శనగపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
2. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోండి.
3. ఆ పొడిని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి బెల్లం వేసి గ్లాసుడు నీరు పోయండి.
4. ఆ బెల్లం పాకంగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.
5. ఆ బెల్లం పాకాన్ని మల్టీ గ్రెయిన్ పొడిలో వేయండి.
6. అలాగే యాలకుల పొడి వేసి బాగా కలపండి. నెయ్యిని కూడా వేసి బాగా కలపండి.
7. డ్రై ఫ్రూట్స్ మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోండి.
8. ఆ మిశ్రమాన్ని కూడా మల్టీ గ్రెయిన్ పొడిలో వేసి చేత్తోనే కలుపుకోండి.
9. ఈ మొత్తం మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకుని గాలి చొరబడని డబ్బాల్లో వేసి దాచుకోండి.
10. ప్రతిరోజూ పిల్లలకు ఒక మల్టీ గ్రెయిన్ లడ్డూ ఇవ్వడం అలవాటు చేసుకోండి.
11. ఈ లడ్డూ తినడం వల్ల ఆ రోజంతా వారు ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు.
12. మల్టీ గ్రెయిన్ ఆహారాన్ని తినమని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
పోషకాహార నిపుణులు రాగులు, ఓట్స్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోమంటున్నారు. కాబట్టి పిల్లలకు ఇలా బెల్లంతో చేసిన మల్టీ గ్రెయిన్ లడ్డూని ఇవ్వడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు రావు. అలాగే శరీరానికి అత్యవసరమైన పోషకాలు అందుతాయి.
టాపిక్