Paneer Gravy: ఉల్లిపాయ వేయకుండానే పనీర్ గ్రేవీ కూర ఇలా చేసేయండి, రుచి కూడా అదిరిపోతుంది
Paneer Gravy: శ్రావణ మాసం త్వరలో ప్రారంభమవుతుంది. ఆ కాలంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేని పనీర్ కూరను ఎలా వండాలో… రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఆ రెండూ వేయకపోయినా కూడా పనీర్ గ్రేవీ వచ్చేలా ఇలా వండేయండి.
శ్రావణమాసం వచ్చిందంటే ఎంతో మంది ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలు వేయకుండా కూరలు వండి తినేందుకు ఇష్టపడతారు. ఈ శ్రావణ మాసంలో శివుడిని, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆ అధిదేవతల కరుణా కటాక్షం పొందేందుకు వెల్లుల్లి-ఉల్లిపాయ తినడం మానుకుంటారు. అయితే ఆ రెండూ వేయకపోతే రుచి సరిగా రాదని, గ్రేవీ కూడా తక్కువగా వస్తుందని అనుకుంటారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం చెఫ్ వికాస్ ఖన్నా చెబుతున్నారు. వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా సులభంగా పనీర్ గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు. ఇది టేస్టీగా ఉండడమే కాదు, గ్రేవీ కూడా వస్తుంది.
ఉల్లిపాయ లేకుండా పనీర్ గ్రేవీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పనీర్ - 200 గ్రాములు
కారం - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
జీడిపప్పులు - పది
నూనె - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పెరుగు - ఒక కప్పు
కసూరి మేతి - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
ఉల్లిపాయ లేకుండా పనీర్ గ్రేవీ రెసిపీ
- ముందుగా జీడిపప్పును వేడినీటిలో నానబెట్టి ఉడకబెట్టాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. పనీర్ ను చిన్న ముక్కులుగా కట్ చేసుకోవాలి.
3. ఒక గిన్నెలో పనీర్ ముక్కలను వేసి కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి. వాటిని పక్కన పెట్టుకోవాలి.
4. వేడినీటిలో మరిగించిన జీడిపప్పును బయటకు తీసి గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. మందంగా పేస్ట్లా చేసుకోవాలి.
5. ఇప్పుడు గడ్డ పెరుగును ఒక గిన్నెలో తీసుకోండి.
6. కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి.
7. పెరుగు పుల్లగా ఉంటే కొద్దిగా పంచదార వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెరుగులో… జీడిపప్పుపేస్ట్ వేసి బాగా కలపాలి.
8. బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
9. ఆ నూనెలో ముందుగా మ్యారినేట్ చేసుకున్న పనీర్ ను వేసి బంగారు రంగులోకి వేసి వేయించాలి.
10. అందులో పెరుగు, జీడిపప్పు పేస్ట్ వేయాలి. రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి.
11. చివరగా కసూరిమేథీని పొడిలా చేసి వేయాలి. ఈ మొత్తం మిశ్రామాన్ని ఇగురులా ఉడికేదాకా ఉంచాలి. అంతే టేస్టీ పనీర్ గ్రేవీ రెడీ అయినట్టే.
ఈ పనీర్ గ్రేవీని అన్నంలో కలుపుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రోటీలోకి ఇది రుచిగా ఉంటుంది. పనీర్ తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. పనీర్ తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. పనీర్ లో విటమిన్ డి, కాల్ఫియం అధికంగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు పనీర్ వంటకాలు తినిపించడం చాలా ముఖ్యం.