సమయం తక్కువ ఉన్నప్పుడు పెరుగు కర్రీ లేదా దహి కర్రీని రెండు నిమిషాల్లోనే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆఫీసుకి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్లే వారికి సమయం తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా దహి కర్రీ చేసుకుంటే సమయం ఎక్కువ ఆదా అవుతుంది. పైగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగులో చేసిన కర్రీ కదా ... చప్పగా ఉంటుందేమో అనుకోకండి. స్పైసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. దీన్ని చపాతీ, రోటీతో కూడా తినవచ్చు. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
పెరుగు - ఒక కప్పు
కారం - ఒక స్పూను
ఎండుమిర్చి - మూడు
పసుపు - అర స్పూను
ఉల్లిపాయలు - ఒకటి
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - అరకప్పు
నూనె - రెండు స్పూన్లు
గరం స్పూను - అర స్పూను
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
1. పెరుగు కర్రీ చేసేందుకు ముందుగా పెరుగును ఒక కప్పులో వేసి పెట్టుకోండి.
2. దాంట్లో అరకప్పు నీళ్లు పోసి మరీ చిక్కగా కాకుండా అలానే పలుచగా కాకుండా ఇగురులాగా చేసుకోండి.
3. ఇప్పుడు అందులో పచ్చి ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపండి.
4. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి నూనె వేయండి.
5. ఆ నూనెలో ఎండుమిర్చిని ఆవాలు జీలకర్ర వేసి వేయించండి.
6. అందులోనే కారం, పసుపు కూడా వేసి కలుపుకోండి.
7. అర స్పూన్ గరం మసాలా కూడా వేసి వేయించండి.
8. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ నూనె తాలింపును మొత్తం తీసుకొచ్చి పెరుగులో వేయండి.
9. అంతే టేస్టీ దహి కర్రీ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.
10. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.
11. కేవలం రెండు నిమిషాల్లోనే అయిపోతుంది. కాబట్టి డిన్నర్ లోనూ, లంచ్ లోను ఓపిక లేనప్పుడు దీన్ని వండి వెంటనే అన్నం తినవచ్చు.
దహీ కర్రీ స్పైసీగా ఉంటుంది కాబట్టి పెద్దలకు ఇది బాగా నచ్చుతుంది. కారం తగ్గిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో దహి కర్రీ చేసి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.
సంబంధిత కథనం