Rasabali: పూరీ జగన్నాథుడికి ఇష్టమైన పన్నీర్ రసబలి.. రుచిగా ఇలా చేసేయండి..
Rasabali: పూరీ జగన్నాథునికి నివేదించే రసబలి తయారీ చాలా సులభం. ఈ పన్నీర్ వంటకాన్ని ఎలా తయారు చేయాలో వివరంగా తెల్సుకోండి.
రసబలి
పూరీ క్షేత్రంలో జగన్నాథునికి నివేదించే ప్రసాదాల్లో రసబలి ఒకటి. ఈ మిఠాయి ప్రత్యేక రుచితో ఉంటుంది. స్పాంజీగా, తియ్యగా ఉండే ఈ రసబలిని పన్నీర్ తో తయారు చేస్తారు. పన్నీర్ ను టిక్కీల్లాగా చేసుకుని రబ్డీలో నానబెట్టి సర్వ్ చేస్తారు. దీన్ని సాయంత్రం పూట స్నాక్ లాగా, ప్రత్యేక రోజుల్లో స్వీట్ లాగా సర్వ్ చేసుకుంటే ఎవరైనా ఎన్నయినా తినేస్తారు. వాటి తయారీ ఎలాగో చూసేయండి.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
రసబలి తయారీకి కావాల్సిన పదార్థాలు:
200 గ్రాముల పన్నీర్
1 చెంచా గోధుమపిండి లేదా మైదాపిండి
1 చెంచా పంచదార పొడి
చిటికెడు వంటసోడా
5 కప్పుల పాలు
1 టీస్పూన్ యాలకుల పొడి
సగం కప్పు పంచదార
తరిగిన డ్రై ఫ్రూట్స్
చిటికెడు కుంకుమపువ్వు
రసబలి తయారీ విధానం:
- రసబలిలో పన్నీర్ తో చేసిన వడలను యాలకుల ఫ్లేవర్ ఉన్న పాలలో నానబెడతారు. దానికోసం ముందుగా పన్నీర్ టిక్కీలు తయారు చేసుకోవాలి.
- ఒక పెద్ద గిన్నెలో పన్నీర్ తీసుకోవాలి. అందులో ఏమీ కలపకుండా పన్నీర్ నే బాగా చపాతీ పిండి కలిపినట్లు బలం పెడుతూ కలపాలి.
- అయిదు నిమిషాలు కలిపాక అందులో మైదా లేదా గోధుమపిండి కలుపుకోవాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, సోడా కూడా కలుపుకుని మరోసారి అన్నీ కలిసేలా గట్టిగా కలుపుకోవాలి.
- పన్నీర్ లో ఎలాంటి ఉండలు లేకుండా మృదువుగా, మెత్తగా అయిపోవాలి. చేతులకు పిండి అంటుకోకూడదు. అయితేనే పిండి రెడీ అయినట్లు.
- ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న ఉండ తీసుకుని గుండ్రంగా చేసి చేతుల మధ్యలో ఒత్తుకోవాలి. టిక్కీ లాగా అయిపోవాలి దాని ఆకారం.
- ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. నెయ్యి దీని రుచిని మరింత పెంచుతుంది.
- నెయ్యి వేడెక్కాక పన్నీర్ టిక్కీల్ని వేసుకొని బంగారు వర్ణంలోకి వచ్చేలా వేయించుకోవాలి. రెండు వైపులా రంగు మారాక వాటిని బయటకు తీసేసుకోవాలి.
- ఈ పన్నీర్ టిక్కీల్ని రబ్డీలో నానబెట్టి సర్వ్ చేసుకోవాలి. దానికోసం పాలు చిక్కగా చేసి రబ్డీ తయారు చేసుకోవాలి. దాన్నెలా తయారు చేయాలో చూడండి.
- ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని పాలు పోసుకోవాలి. ఒక ఉడుకువచ్చాక సన్నం మంట మీద పెట్టి మరిగించాలు. పాలు చిక్కగా అయిపోతాయి.
- ఈలోపు గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వు వేసుకుని కలుపుకోవాలి.దీనివల్ల మిఠాయికి మంచి రంగు వస్తుంది.
- ఇప్పుడు అందులో పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు కలుపుకున్న పాలు వేసుకుని మరిగించుకోవాలి. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ టిక్కీల్ని వేసుకోవాలి.
- సన్నం మంట మీద స్టవ్ పెట్టుకుని కనీసం పది నిమిషాల పాటూ చిక్కగా చేసి పెట్టుకున్న రబ్డీలో వాటిని ఉడకనివ్వాలి. స్టవ్ కట్టేసి వేరే బౌల్ లోకి రబ్డీతో సహా వీటిని తీసుకోవాలి. మీద సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. రసబలి రెడీ అయినట్లే.