గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు త్యాగానికి జ్ఞాపకంగా నిర్వహించుకునే ప్రత్యేక దినోత్సవం. క్రైస్తవ మత ప్రజలకు ఇది ఎంతో ముఖ్యమైన రోజు. అలాగని వారు ఈ రోజున సంతోషంగా ఉండరు. చర్చిల్లో ప్రార్థనలు చేసి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఒకరినొకరు ఓదార్చుకుంటారు. తమ ప్రభువైన యేసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు.
ప్రతి ఏడాది గుడ్ ఫ్రైడే రోజు బాధాతప్త హృదయాలతో ఉంటారు క్రైస్తవ సోదరులు. దీని వెనుక ముఖ్యమైన కారణం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే వచ్చింది. దీని ప్రాముఖ్యత చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
బైబిల్ చెబుతున్న ప్రకారం రోమన్ గవర్నర్ పొంటియస్ పిలాతు ఆదేశం మేరకు యేసుక్రీస్తును శిలువ వేశారు. అతనిపై రాజ ద్రోహం, దైవ దూషణ వంటి అభియోగాలను మోపారు. అతనికి శిలువ వేసిన రోజు శుక్రవారం. దీన్నే గుడ్ ఫ్రైడే అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. తమ ప్రభువైన యేసు ప్రజల పాపాలను కడగడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన రోజుగా చెప్పుకుంటారు.
క్రైస్తవ మతం ప్రకారం గుడ్ ఫ్రైడే రోజే యేసు మానవాళి సంక్షేమం కోసం తనను తాను త్యాగం చేసుకున్నాడు. అందుకే ఈ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అని పిలుచుకోవడం మొదలుపెట్టారు.
గుడ్ ఫ్రైడే చరిత్ర మొదటి శతాబ్దంలో జెరూసలేంలో జరిగిన సంఘటనలతో ముడిపడి ఉంటుంది. యేసుక్రీస్తు ఆ కాలంలోనే ప్రేమ, కరుణ, క్షమాపణ గొప్పతనాన్ని చెబుతూ ప్రజల్లో సందేశాలు ఇచ్చేవారు. దీన్ని అప్పటి రాజకీయ నాయకులు తమకు ముప్పుగా భావించేవారు. అందుకే అతడిని అరెస్టు చేసే శిలువ వేయమని శిక్ష విధించారు.
యేసుకు శిక్ష వేసిన రోజే గుడ్ ఫ్రైడే గా మారింది. గుడ్ ఫ్రైడేను సంతాప దినంగా చెప్పుకుంటారు. అయితే గుడ్ ఫ్రైడే జరిగిన మూడోరోజు అంటే ఆదివారం మాత్రం అందరూ ఆనందంగా ఉంటారు. అదే ఈస్టర్ పండుగ. ఆరోజు అసలైన పండుగను సంతోషంగా నిర్వహించుకుంటారు. దానికి కారణం అంటే యేసు మరలా ప్రాణాన్ని తెచ్చుకొని ప్రజల్లోకి వచ్చిన రావడమే.
గుడ్ ఫ్రైడే రోజు వివిధ దేశాల్లో ప్రత్యేక ప్రార్థనలు, సమావేశాలు నిర్వహించుకుంటారు. క్రైస్తవ మత సోదరులు యేసు కథను చదివి వినిపిస్తారు. కీర్తనలు పాడుతారు. యేసు గొప్పతనం గురించి ప్రసంగాలు ఇస్తారు. అలాగే యేసుకు శిలువ వేసిన కథను నాటికల రూపంలో ప్రదర్శిస్తారు. ఊరేగింపులు చేస్తారు. ఈ రోజున ఎంతోమంది ఉపవాసం ఉంటారు. మాంసాహారాన్ని ముట్టుకోరు.
గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు నల్లని దుస్తులు ధరించి తాము చేసిన పాపాలకు తమ యేసును క్షమాపణ అడుగుతారు. ఈరోజున ఎప్పటిలాగా చర్చిల్లో కొవ్వొత్తులు వెలిగించరు. గంటలు మోగించరు. సాత్విక ఆహారాన్ని తిని శిలువను ముద్దు పెట్టుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తును పదేపదే తలుచుకుంటారు. తాము చేసిన పాపాలకు క్షమాపణ అడుగుతారు. విపరీతంగా కన్నీళ్లు పెట్టుకొని ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉంటారు.
అందుకే గుడ్ ఫ్రైడే నాడు క్రైస్తవ మత సోదరులు ఒకరికొకరు ఎలాంటి శుభాకాంక్షలు చెప్పుకోరు. అలాగే ఇతరులు కూడా క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే రోజు ఎలాంటి విషెస్ చెప్పకూడదు. అది ఆరోజు వారు బాధపడే సంతాపదినం. కాబట్టే గుడ్ ఫ్రైడే రోజు ఎలాంటి విషెస్ చెప్పుకునే పద్ధతి ఉండదు.
సంబంధిత కథనం