షుగర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్లకి చిగుళ్ల వ్యాధి, దంతాల సమస్య రావడం వాస్తవమేనా?-is it true that people with sugar problems are more likely to have gum disease and tooth problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  షుగర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్లకి చిగుళ్ల వ్యాధి, దంతాల సమస్య రావడం వాస్తవమేనా?

షుగర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్లకి చిగుళ్ల వ్యాధి, దంతాల సమస్య రావడం వాస్తవమేనా?

Ramya Sri Marka HT Telugu

షుగర్ ప్రాబ్లమ్ కారణంగా చాలా మందికి నోటి సమస్యలు రావడం సర్వసాధారణం. కొన్నిసార్లు ఇవి చిగుళ్ల వ్యాధి, దంతాల నష్టానికి కారణమవుతుంది. సమయానికి డయాబెటిస్‌ను పసిగట్టకపోతే ఈ సమస్యలు తప్పవు మరి.

చిగుళ్ల వ్యాధికి డయాబెటిస్ కి ఏంటి సంబంధం?

మధుమేహానికి, నోటి ఆరోగ్యానికి మధ్య సంబంధం చాలా ముఖ్యమైనది. చిగుళ్ల వ్యాధి, దంతాల నష్టం కలగకుండా ఉండేందుకు ఇది తప్పక తెలుసుకోవాలి. మధుమేహం ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు సరిగా మెయింటైన్ చేయలేని వారు, చిగుళ్ల వ్యాధి (చిగుళ్లవాపు,పిరియోడాంటైటిస్), దంత క్షయం, నోరు పొడిబారడం, శిలీంధ్ర సంక్రమణలు, నోటి కణజాలాల పేలవమైన వైద్యం వంటి వివిధ నోటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటారు.

డయాబెటిస్ సమస్య నోటి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.

మధుమేహం, నోటి ఆరోగ్య సమస్యల మధ్య సంబంధం:

హై బ్లడ్ షుగర్: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల లాలాజలంలో గ్లూకోజ్ శాతం పెరుగుతుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియాను పెంచడానికి అనువుగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా, ఆహార కణాలతో కలిసి, దంతాలపై జిగురుగా ఉండే పొరను ఏర్పరుస్తుంది. ఇది కేవిటీలు, చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది.

బలహీనమైన రోగనిరోధక శక్తి: డయాబెటిస్ సోకిన వారికి శరీరంలో తెల్ల రక్త కణాలను బలహీనపడతాయి. ఇవి నోటిలోని వాటితో సహా శరీరం ప్రాథమిక రక్షణలో వెనుక పడిపోతాయి. ఫలితంగా చిగుళ్లలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటం కష్టమైపోతుంది.

రక్త నాళాలు మందంగా మారడం: మధుమేహం రక్త నాళాలు మందంగా మారడానికి కారణమవుతుంది. అలా జరగడం వల్ల చిగుళ్ళకు, దంతాలకు మద్దతు ఇచ్చే ఎముకతో సహా శరీర కణజాలాలకు పోషకాల ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఈ బలహీనమైన రక్త ప్రవాహం చిగుళ్ళను బలహీనపరిచి ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. ఒకవేళ చిగుళ్లకు ఏదైనా గాయం కలిగితే అవి మానేందుకు ఎక్కువ సమయం పడుతుంది..

నోరు పొడిబారడం: మధుమేహం, దాని ట్రీట్మెంట్‌కు ఉపయోగించే కొన్ని మందులు లాలాజలం ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఆహారం నమిలేటప్పుడు ల్యూబ్రికెంట్‌గా, ఆమ్లాలను న్యూట్రల్ చేసేదిగా వ్యవహరించే లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో దంత క్షయం, చిగుళ్ల వ్యాధి ప్రమాదాలు పెరుగుతాయి.

పేలవమైన వైద్యం: మధుమేహం కంట్రోల్‌లో ఉండని వ్యక్తుల్లో దంత సమస్యలకు రికవరీ చాలా నెమ్మెదిగా ఉంటుంది. దీనికి కారణం చికిత్స చేసిన ప్రాంతాలకు రక్త ప్రవాహం తగ్గిపోవడమే.

చిగుళ్ల వ్యాధి, దంతాల నష్టం కలగకుండా ఉండాలంటే:

డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో నోటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.

రక్తంలో గ్లూకోజ్ కంట్రోల్‌లో ఉండాలి:

మీ రక్తంలో చక్కెర స్థాయిలను లిమిట్‌లో ఉంచుకోవడానికి తరచూ వైద్య పరీక్షలు లాంటివి రెగ్యూలర్గా చేయించుకుంటూ ఉండండి. మీ మధుమేహం సమస్యను ముందుగానే దంత వైద్యుడికి తెలియజేయాలి.

నోటి పరిశుభ్రతను పాటించండి:

ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రోజుకు కనీసం రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయండి. సాఫ్ట్ టూత్‌బ్రష్‌ను ఉపయోగించి, రెండు నిమిషాల పాటు సున్నితంగా బ్రష్ చేయండి. అన్ని దంతాలు శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి.

దంతాల మధ్య చిగుళ్ల దగ్గర ఆహార కణాలను తొలగించడం:

మనం తిన్న ఆహారం కారణంగా దంతాల మధ్య లేదా చిగుళ్ల మధ్య ఆహార కణాలు ఇరుక్కుపోతాయి. కొన్నిసార్లు ఈ ప్రదేశాల్లో బ్రష్ కూడా చేయలేం.అలాంటప్పుడు వ్యర్థాలను తొలగించుకునేందుకు ఫ్లాస్ చేయండి. మీ దంతవైద్యుడు సిఫార్సు చేస్తే, ఒక యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్‌ను ఉపయోగించడాన్ని పరిగణించండి.

రెగ్యులర్ డెంటల్ చెకప్‌లు:

సంవత్సరానికి కనీసం రెండుసార్లు లేదా మీ డెంటిస్ట్ చెప్పినట్లుగా చెకప్ చేయించుకోండి.

స్మోకింగ్ మానేయండి:

స్మోకిగ్ చేయడం వల్ల చిగుళ్ల వ్యాధి ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది, మధుమేహాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం