దక్షిణాది అల్పాహారాల్లో దోశలే మొదటి ప్రాధాన్యత. ఏ ఇంట్లో అయినా వారంలో రెండు మూడు సార్లు దోశలే ఉంటాయి. దోశ పిండిని రెడీ చేయడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. రాత్రంతా పప్పులను, బియ్యాన్ని నానబెట్టి ఉదయాన రుబ్బుకొని ఆ తర్వాత దాన్ని పులిసేలా చేసి దోశెలు వేసుకోవాలి. ఒక్కోసారి మీకు అంత సమయం దొరకదు. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా దోశ మిక్స్ పౌడర్ను రెడీ చేసుకోండి. దీన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు కలిపి చక్కగా దోశలను వేసుకోవచ్చు. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇన్స్టెంట్ దోశ మిక్స్ పౌడర్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి.
బియ్యం - మూడు కప్పులు
మినప్పప్పు - ఒక కప్పు
ఉప్మా రవ్వ - రెండు స్పూన్లు
శెనగపప్పు - ఒక కప్పు
కందిపప్పు - ఒక కప్పు
అటుకులు - ఒక స్పూను
బేకింగ్ సోడా - అర స్పూను
మెంతులు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
1. స్టవ్ మీద కళాయి పెట్టి కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేయించుకోవాలి.
2. తర్వాత అటుకులు కూడా వేసి వేయించి చల్లార్చాలి.
3. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి బియ్యాన్ని కూడా వేసి కాసేపు వేయించి పక్కన పెట్టేయాలి.
4. వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
5. ఈ పొడిని ఒక డబ్బాలో వేసుకోవాలి.
6. అందులోనే బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
7. దీన్నే తడి లేని ప్రదేశంలో భద్రపరచుకుంటే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.
8. దోశెలు తినాలనిపించినప్పుడు ఈ పౌడర్ ను ఒక గిన్నెలో వేసి తగినంత నీళ్లు వేసి దోశలుగా వేసుకోవచ్చు.
9. ఇవి క్రిస్పీగా, టేస్టీగా కూడా వస్తాయి.
సాధారణ దోశల కన్నా ఇవి ఆరోగ్యకరం కూడా. ఎందుకంటే ఇందులో మనం కందిపప్పు, శనగపప్పును కూడా యాడ్ చేసాము. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.