ప్రతీ రోజు యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. శారీరకంగా, మానసికంగా దృఢంగా చేస్తాయి. యోగాలో కొన్ని ఆసనాలు మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను కలిగించగలవు. అలాంటిదే మయూరాసనం (నెమలి ఆసనం). శరీరంలోని చాలా అవయాలపై ఆ ఆసనం మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. వేసేందుకు కాస్త కష్టమే అయినా సాధన చేస్తే అలవాటు అవుతుంది. మయూరాసనం ఎలా వేయాలో.. ప్రయోజనాలు.. జాగ్రత్తలు ఏవో ఇక్కడ చూడండి.
ఈ మయూరాసనం వేసేందుకు కష్టమైనదే. కానీ ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అవుతుంది. యోగా ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత దీన్ని ట్రై చేయాలి.
మయూరాసనం రెగ్యులర్గా వేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. శరీరంతో పాటు మానసిక లాభాలు కూడా ఉంటాయి.
పేగుల ఆరోగ్యం, జీర్ణక్రియ: మయూరాసనం వల్ల జీర్ణవ్యవస్తపై ఒత్తిడి పడుతుంది. పేగుల కదలికను మెరుగుపరచడమే కాకుండా వాటి ఆరోగ్యాన్ని ఈ ఆసనం పెంచగలదు. దీంతో జీర్ణక్రియ మెరుగవుతుంది.
మణికట్టు, చేతులకు బలం: మయూరాసనంలో శరీర భారం చేతులు, మణికట్టుపైనే ఉంటుంది. అందుకే ఈ ఆసనం వేయడం వల్ల ముంజేతులతో పాటు మణికట్టు దృఢత్వం కూడా పెరుగుతుంది. మోచేతులు, నడుము, తొడలు సహా చాలా భాగాలకు ఈ ఆసనం మేలు చేస్తుంది.
వ్యర్థాలు బయటికి పోయేలా: శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లేందుకు కూడా ఈ ఆసనం ఉపకరిస్తుంది.
రక్తప్రసరణ: మయూరాసనం వేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. శరీరంలోని అవయవాలకు రక్తం బాగా చేరుతుంది. దీంతో అవయవాల పనితీరు బాగుంటుంది.
లైంగిక ఆరోగ్యం: సంతానోత్పత్తి సమస్యలు తగ్గేందుకు మయూరాసనం తోడ్పడుతుంది. శృంగార జీవితంపై ఆసక్తి పెరిగేలా చేయగలదు.
మానసిక ఆరోగ్యం: మయారాసనం మెదడును, శరీరాన్ని రిలాక్స్ చేయగలదు. ఆ ఆసనం వల్ల ప్రశాంతంగా అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గేందుకు ఈ ఆసనం తోడ్పడుతుంది.
కొన్ని సమస్యలు ఉన్న వారు మయూరాసనం వేయకూడదు. పొట్టకు సంబంధించిన సర్జరీలు చేయించుకున్న వారు ఈ ఆసనం అసలు చేయకూడదు. మణికట్టు, చేతులకు గాయలైన వారు కూడా ట్రై చేయకూడదు. గర్భిణి స్త్రీలు కూడా ఈ ఆసనం వేయకూడదు. హై బ్లడ్ ప్రెజర్, గుండె జబ్బులు ఉన్న వారు కూడా ఈ మయూరాసనం వేయకూడదు. అలాగే, యోగా ఆరంభించి కొన్ని రోజులయ్యాకే ఈ ఆసనం సాధన చేయాలి.
టాపిక్