Summer drinks: ఈ పానీయాలు పరిగడుపున తీసుకుంటే.. ఎండ నుంచి రక్షిస్తాయి..
Summer drinks: మల విసర్జనలో సమస్యలు, డీహైడ్రేషన్, వడదెబ్బ వీటన్నింటినుంచి కాపాడుకోడానికి మనకు సాయపడే కొన్ని పానీయాల గురించి తెలుసుకోండి.
వేసవి వేడి వల్ల ఆకలి తగ్గడం, సరిగ్గా అరగక పోవడం లాంటి సమస్యలొస్తుంటాయి. దాదాపు ఈ సమస్యలన్నింటికీ వీలైనన్ని ఎక్కువ పానీయాలు తీసుకుని, హైడ్రేటెడ్ గా ఉండటమే మంచి పరిష్కారం. వేసవిలో కొన్ని పానీయాలు ఉదయాన్నే పరిగడుపున తీసుకుంటే హైడ్రేటెడ్ గా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. అవేంటో చూసేయండి.
1. నిమ్మరసం, చియా గింజలు:
ఒక చెంచా చియా గింజల్ని పావు గ్లాసు నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే దాంట్లో ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఒక 150 మి.లీ నీరు కూడా పోసుకుని తాగేయాలి. వీటికి చలువ చేసే గుణం ఉంది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. ఆహారం జీర్ణమయ్యేలా చేస్తాయి. మల విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తాయి.
2. కీరదోసం రసం:
కీరదోసం రసంలో, నాలుగైదు పుదీనా ఆకులు, చిటికెడు చాట్ మసాలా లేదా నల్ల ఉప్పు, 1 చెంచా పచ్చి మామిడి కాయ తురుము వేసుకొని తాగాలి. ఇది శరీరానికి చలువ చేస్తుంది. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
3. నీళ్లు:
ఇది చాలా ముఖ్యం. ఉదయం పరిగడుపున రెండు గ్లాసుల నీళ్లు తాగి మీ రోజును మొదలుపెట్టండి. నీళ్లు ఎక్కువగా తాగలేకపోతే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చేసుకోండి.
4. పెరుగు:
సగం కప్పు పెరుగులో చిన్న అల్లం ముక్క తరుగు, చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకుని కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోండి. ఉదయాన్నే పరిగడుపున దీన్ని తీసుకోండి. ఇది వేసవిలో శరీరానికి కావాల్సిన ల్యాక్టోబాసిల్లి అందుతుంది.
ఇవన్నీ ఉదయాన్నే పరిగడుపున తీసుకోగల పానీయాలు. వీటితో పాటూ రోజు మొత్తం ఏం తీసుకోవచ్చో చూడండి.
- కొబ్బరినీళ్లు లేదా పుచ్చకాయ రసం, లేదా నారింజ పండు రసం లో చెంచా చియాగింజలు నానబెట్టుకుని రోజు మొత్తం తీసుకోవచ్చు
- కీరదోస తురుము, పెరుగు మంచి స్నాక్. 100 మి.లీ కీరదోస రసంలో, 100 మి.లీ మజ్జిగ కలుపుకోవాలి. ఇది వేసవిలో ఉత్తమ పానీయం అవుతుంది.
- తప్పకుండా 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగండి. బయట తిరగాల్సి వస్తే అది ఎక్కువే.
- మజ్జిగ అలాగే తాగలేకపోతే రుచి పెంచడానికి కరివేపాకు, పుదీనా, అల్లంతో వేసిన తాలింపు కలుపుకోవచ్చు.
- మామిడిపండ్లను ఫ్రీజర్ లో ఉంచి ఒక చెంచా పీనట్ బటర్ కలిపి స్మూతీ లా చేసుకుని తాగొచ్చు.
టాపిక్