వంట అనేది కేవలం రుచి కోసం లేదా ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే కాదు. ఆహారం వండటం, తినడం అనేది మీ శారీరక, మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి వంట చేసే విధానంలోని సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఆహార పదార్థాన్ని తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని పాటించడం ద్వారా మాత్రమే ఆహారం రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా మారుతుంది. లేదంటే అనారోగ్యానికి దారితీస్తుంది.
ఉదాహరణకు కొన్ని ఆహార పదార్థాలను వంటకు లేదా తినడానికి ముందు కొంత సేపు నీటిలో నానబెట్టడం వల్ల వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఆయుర్వేదం కూడా నానబెట్టిన ఆహారం సులభంగా జీర్ణమవడమే కాకుండా, దానిలోని పోషకాలు శరీరానికి బాగా అందుతాయని చెబుతోంది. మరి వంటకు ముందు తప్పకుండా నానబెట్టాల్సిన ఆ ప్రత్యేకమైన ఆహార పదార్థాలేంటో చూసేద్దాం రండి.
పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు శరీరం ఈ కూరగాయలలోని కాల్షియం, ఖనిజాలు వంటి పోషకాలను సరిగ్గా గ్రహించలేకపోతుంది. అందువల్ల ఈ ఆకుకూరలను వండే ముందు 1-2 గంటలపాటు నీటిలో నానబెడితే, వాటిలోని ఆక్సాలిక్ యాసిడ్ స్ఫటికాలు తొలగిపోతాయి. పోషక విలువలు పెరుగుతాయి. శరీరం వీటిని సులభంగా శోషించుకుంటుంది.
ఎండు ద్రాక్ష, ఖర్జూరం, అంజీర్ వంటి ఎండిన ఫలాలను నానబెట్టడం వల్ల అవి తిరిగి తేమను పొంది మెత్తబడతాయి. దీనివల్ల వాటిని నమలడం, తిన్న తర్వాత అవి జీర్ణం అవడం రెండూ సులభమవుతాయి. అంతేకాకుండా ఎండు ఫలాల్లో కొన్నిసార్లు ఆరోగ్యానికి హాని చేసే ఉండే సల్ఫైట్స్ (Sulfites) వంటి సంరక్షణ కారకాలు ఉంటాయి. నానబెట్టడం వల్ల ఇవి కొంతవరకు తొలగిపోతాయి. కాబట్టి వీటిని నేరుగా తినే బదులు 2-4 గంటలు నానబెట్టడం చాలా మంచిది.
పెసర, మినప, కంది, శనగ, బఠానీ వంటి ఏ రకమైన పప్పుల్లోనైనా కొద్ది మొత్తంలో ఫైటిక్ యాసిడ్, లెక్టిన్లు ఉంటాయి. అందువల్ల ఏ పప్పును అయినా వండే ముందు కనీసం నాలుగు గంటలపాటు నీటిలో నానబెట్టాలి. నీటిలో నానబెట్టడం వల్ల పప్పులోని యాసిడ్ మొత్తం తగ్గి, దాని పోషక విలువలు పెరుగుతాయి. పప్పులు బరువైన ఆహారం కిందకు వస్తాయి కాబట్టి వాటిని నీటిలో నానబెట్టినప్పుడు జీర్ణం చేసుకోవడం సులభం అవుతుంది.
పప్పుల మాదిరిగానే రాజ్మా, చిక్కుళ్ళు లేదా లోబియా వంటి బీన్స్లో కూడా లెక్టిన్లు, ఫైటిక్ యాసిడ్ ఉంటాయి, వీటి కారణంగా జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. బీన్స్ను సులభంగా జీర్ణం చేసుకోవడానికి, వాటి పోషక విలువలను పెంచడానికి వాటిని వండే ముందు కనీసం 8 నుండి 12 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టడం వల్ల వాటిలోని విష పదార్థాలు తొలగిపోతాయి, అలాగే త్వరగా ఉడుకుతాయి.
బియ్యం, గోధుమలు, రాగులు వంటి అన్ని రకాల ధాన్యాలలో కూడా ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. అంతేకాదు పొలంలో ధాన్యాలను పండించినప్పుడు, దిగుబడిని పెంచడానికి ఎరువులు వాడతారు. ఈ ఎరువులు వేర్ల ద్వారా ధాన్యాలలోకి కూడా చేరుతాయి. అందుకే ఏదైనా ధాన్యాన్ని వండే ముందు కనీసం 2 నుండి 3 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల విష పదార్థాలు తొలగిపోవడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి.
బాదం, వాల్నట్స్, జీడిపప్పు వంటి గింజలలో ఎంజైమ్ ఇన్హిబిటర్లు ఉంటాయి. దీనివల్ల వాటిని జీర్ణం చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి గింజలను తినే ముందు కనీసం 6 గంటలపాటు నీటిలో నానబెట్టాలి, దీనివల్ల వాటిలోని ఎంజైమ్ ఇన్హిబిటర్లు తొలగిపోతాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. నానబెట్టిన గింజలను తినడం వల్ల శరీరానికి పూర్తి పోషణ లభిస్తుంది.