ఈ మూడు డ్రింకులు కొంచెం తాగినా చాలు మీకు మతిమరుపు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది-even a small amount of these three drinks can increase your risk of dementia ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఈ మూడు డ్రింకులు కొంచెం తాగినా చాలు మీకు మతిమరుపు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది

ఈ మూడు డ్రింకులు కొంచెం తాగినా చాలు మీకు మతిమరుపు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది

Haritha Chappa HT Telugu

మతిమరుపు వయసు పెరిగే కొద్ది వచ్చే సమస్య. అల్జీమర్స్ సమస్య రావడానికి కొన్ని రకాల ఆహార పద్ధతులు కూడా కారణమే. ముఖ్యంగా ప్రతిరోజూ తాగే కొన్ని డ్రింకులు అల్జీమర్స్ వచ్చే అవకాశాలని పెంచుతాయి.

మతిమరుపును తెచ్చే పానీయాలు (pixabay)

అల్జీమర్స్ లేదా మతిమరుపు వ్యాధి అనేది వయసుతో ముడిపడి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఎంతోమందిలో ఈ సమస్య కనిపిస్తోంది. ఇప్పుడు ఒత్తిడి కారణంగా మానసిక సమస్యల కారణంగా ముందుగానే అల్సీమర్స్ వచ్చేస్తోంది.

చెడు జీవన శైలి కారణంగా కూడా అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ప్రతిరోజూ మూడు రకాల పానీయాలు తాగుతారో వారు అల్జీమర్స్ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చల్లటి డైట్ సోడా, చక్కెర నిండిన కాఫీ, వెన్న తీసిన పాలు... ఈ మూడూ ప్రతిరోజు కొంచెం తాగిన చాలు త్వరలోనే మీరు అల్జీమర్స్ వ్యాధిని బారిన పడే అవకాశం ఉందని సైన్సు చెబుతోంది.

న్యూరో సైంటిస్టులు చెబుతున్న ప్రకారం ఈ సాధారణ పానీయాలు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయని తెలుస్తోంది. వీటిని అప్పుడప్పుడు తీసుకోవడం కూడా దీర్ఘకాలిక హానిని కలిగిస్తాయి. ఇక రోజువారి అలవాటుగా తాగేవారు ఇతరులతో పోలిస్తే త్వరగానే అల్జీమర్స్ వ్యాధి బారిన పడతారని సైంటిస్టులు చెబుతున్నారు.

డైట్ సోడా

చాలామంది డైట్ సోడా తాగడం ఆరోగ్యానికి మంచిదిగా చెప్పుకుంటారు. రక్తంలో చక్కెర నియంత్రించడానికి, బరువు పెరగకుండా అడ్డుకోవడానికి ఇది ఆరోగ్యకరమైనదిగా అనుకుంటారు. ప్రతిరోజు డైట్ సోడా తాగే వారి సంఖ్య కూడా ఎక్కువే. కానీ మీరు ఈ పానీయం ప్రతిరోజూ తాగడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, అల్జీమర్స్ వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా పెరుగుతోందని పరిశోధన చెబుతోంది. వీటిలో అస్పర్టమే, సూక్రాలోజ్ వంటి కృత్రిమ తీపి పదార్థాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని చెడగొడతాయి. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మార్చేస్తాయి. దీనివల్ల మెదడులో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి అల్జీమర్స్ వ్యాధి వస్తుంది.దీనికి బదులుగా తాజా పుదీనాతో చేసే నీటిని తాగడం మంచిది. చల్లటి నీటిలో పుదీనా ఆకులను వేసి కాసేపు నానబెట్టి అందులో నిమ్మరసం పిండుకొని తాగితే డైట్ సోడా కన్నా చాలా రుచిగా ఉంటుంది.

చక్కెర నిండిన కాఫీ

కాఫీ రోజుకి ఒకటి తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అందులో చక్కెర అధికంగా వేసుకొని తాగితే మాత్రం ఎంతో ప్రమాదకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చక్కెర కలిపిన కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వివరిస్తోంది. చక్కెర ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుందని.. ఇది కాలక్రమేనా మెదడులో ఇన్సులిన్ నిరోధకతకు కారణం అవుతోందని న్యూరో సైంటిస్ట్ రాబర్ట్ లవ్ చెబుతున్నారు. మెదుడుకు గ్లూకోజ్ ను ప్రాసెస్ చేసేందుకు ఇన్సులిన్ అవసరం పడుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుందో మెదడు కణాలు పని చేయకుండా మరణించడం ప్రారంభిస్తాయి. దీనివల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం పెరుగుతుంది.

వెన్న తీసిన పాలు

వెన్న తీసిన పాలు తాగడం వల్ల బరువు పెరగమని చాలా మంది అనుకుంటారు. కానీ ఇలాంటి పాలు తాగడం వల్ల మెదడు ఆరోగ్యం చెడిపోతుంది. ఇందులో చాలా తక్కువగా కొవ్వు ఉంటుంది. అందుకే గుండెకు ఎంతో మంచిదని చెప్పుకుంటారు. నిజానికి పాల నుంచి కొవ్వును తొలగించడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కె... వంటి విటమిన్లు కూడా తొలగిపోతాయి. ఇవన్నీ కూడా కొవ్వులో కరిగే విటమిన్లు. మెదడు రక్షణకు అత్యవసరమైనవి. ఎప్పుడైతే మీరు వీటిని తొలగిస్తారో మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందవు. దీని వల్ల కూడా అల్జీమర్స్ వ్యాధి బారిన మెదడు పడే అవకాశం ఉంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.