Thandai: మహాశివరాత్రి ఉపవాస సమయంలో ఈ ప్రత్యేక పానీయం తీసుకోండి, పొట్ట నిండుతుంది, శక్తి కూడా లభిస్తుంది!-during mahashivratri fasting have a thandai drink it gives energy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thandai: మహాశివరాత్రి ఉపవాస సమయంలో ఈ ప్రత్యేక పానీయం తీసుకోండి, పొట్ట నిండుతుంది, శక్తి కూడా లభిస్తుంది!

Thandai: మహాశివరాత్రి ఉపవాస సమయంలో ఈ ప్రత్యేక పానీయం తీసుకోండి, పొట్ట నిండుతుంది, శక్తి కూడా లభిస్తుంది!

Haritha Chappa HT Telugu

Thandai: మహాశివరాత్రి రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. అలాంటి సమయంలో ఎవరికైనా ఆకలిగా ఉంటే లేదా శక్తి లేకపోతే వారు పండ్లను, కొన్ని రకాల పానీయాలను తీసుకోవచ్చు. ఈ ఉపవాసంలో మీరు ఒక ప్రత్యేక పానీయం తాగవచ్చు. దీన్ని నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. అదే తాండై పానీయం.

తాండై రెసిపీ

మహాశివరాత్రికి ఎంతో మంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం చేసే సమయంలో కొన్ని రకాల పండ్లు, పానీయాలు తాగవచ్చు. రోజంతా ఏమీ తినకుండా ఉంటే శక్తి స్థాయిలు సన్నగిల్లుతాయి. ఉసవాసం చేసేటప్పుడు తాండై పానీయం తాగితే శక్తి వస్తుంది. అన్నట్టు దీన్ని శివరాత్రికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు.

హిందూ మతంలో మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పండుగ శివ పార్వతులకు అంకితం చేశారు. భోళేనాథుడు… పార్వతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రోజు ఇదేనని చెబుతారు. ఈ రోజున శివ భక్తులు పూజ చేసి, భక్తితో ఉపవాసం కూడా ఉంటారు. శివలింగానికి అభిషేకం చేస్తారు.

ఈ ఉపవాస సమయంలో ఫలహార పదార్థాలను తీసుకోవచ్చు. అంతేకాకుండా, మీకు అనారోగ్యంగా ఉన్నా, చాలా బలహీనంగా అనిపించినా సాత్విక ఆహారం తీసుకోవచ్చు. శివరాత్రి ఉపవాసాన్ని పిల్లల నుండి పెద్దలు వరకు అందరూ ఉంటారు. ఉపవాసం ఉండి ఆకలిగా ఉంటే, మీరు తాండై పానీయం తీసుకోండి. దీన్ని తీసుకోవడం వల్ల మీకు శక్తి కూడా లభిస్తుంది. పొట్ట కూడా ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీన్ని మీరు సులభంగా తయారు చేసుకోవచ్చు. తాండై రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

తాండై రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బాదంపప్పులు - పది

పిస్తాలు పప్పులు - 10

జీడిపప్పులు - ఐదు

ఆకుపచ్చ యాలకులు - నాలుగు

సోంపు గింజలు - ఒక స్పూను

గసగసాలు - ఒక స్పూను

రోజ్ వాటర్ - రెండు స్పూన్లు

కేవ్రా ఎసెన్స్ - ఒక టేబుల్ స్పూను

పూర్తిగా కొవ్వు ఉన్న పాలు - ఒక లీటరు

చక్కెర - అరకప్పు

కుంకుమ పువ్వు రేకులు - ఏడు

మిరియాలు - అయిదు

తాండై రెసిపీ

  1. స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు పోసి బాగా మరిగించండి. వాటిని చల్లబరచండి.
  2. ఆ పాలల్లో చక్కెర, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి ఫ్రిజ్లో పెట్టండి.
  3. అలాగే బాదం పప్పులను విడిగా ఒక గిన్నెలో వేసి నీళ్లు వేసి ఏడు గంటల పాటు నానబెట్టండి.
  4. మరొక గిన్నెలో పిస్తాలు, గసగసాలు, జీడిపప్పులు, సోంపు గింజలు, మిరియాలు, యాలకులు వేసి నానబెట్టండి.
  5. ఇప్పుడు మిక్సీ జార్లో బాదంపప్పులతో పాటు మిగతా నానబెట్టిన పదార్థాలను వేసి మెత్తగా పేస్ట్ చేయండి.
  6. ఇప్పుడు ఆ పేస్టులో రోజ్ వాటర్, కేవ్రా ఎసెన్సు వేసి బాగా కలపండి.
  7. ఆ మొత్తం మిశ్రమాన్ని పాలలో వెయ్యండి.
  8. వీటిని రెండు గ్లాసుల్లో వేసి ఐస్ క్యూబ్స్ వేయండి. అంతే తాండై రెడీ అయినట్టే.
  9. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. శరీరానికి శక్తినిస్తుంది. దీన్ని మహా శివునికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు.

ఎన్నో రకాల నట్స్ వేసాము. కాబట్టి ఆరోగ్యానికి మంచిదే. బాదంపప్పులు, జీడిపప్పులు, మిరియాలు, సోంపు గింజలు, పిస్తాలు వంటివన్నీ కూడా ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి ఇవన్నీ మేలు చేస్తాయి శక్తిని అందిస్తాయి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం