ప్రస్తుతం వసంత కాలం కొనసాగుతోంది మధ్యాహ్నం వేళలో వేడిగా, సాయంత్రం నుంచి చల్లగా ఉంటోంది. ఇలాంటి సమయంలో వెచ్చని భోజనం చేస్తే వచ్చే సంతృప్తి మరొకటి ఉండదు. మరి సంతృప్తికరంగా, ఆనందంగా తినాలనిపించే భోజనం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ. ఆదివారమైనా, సోమవారమైనా, వారమేదైనా, లంచ్ అయినా, డిన్నర్ అయినా.. అన్ని సమయాల్లో బిర్యానీని కాదనగలిగే వారుంటారా? అందుకే మీకు ఒక అద్భుతమైన బిర్యానీ రెసిపీని ఇప్పుడు పరిచయం చేస్తున్నాం.
చికెన్, మటన్ రెండూ కలగలిపి చేసే చికెన్ మటన్ బిర్యానీని ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారా? తిన్నా, తినకపోయినా ఇక్కడ అందిస్తున్న బిర్యానీ రెసిపీ మీకు మళ్లీ మళ్లీ తినాలనే కోరికను కలిగిస్తుంది. ఎక్కువ శ్రమ లేకుండా అన్నీ పదార్థాలను ఒక కుక్కర్లో వేసి సన్నని సెగ మీద వండుకొని తింటే ఆ రుచే వేరు. చికెన్ మటన్ బిర్యానీ రెసిపీ ఈ కింద ఉంది చూడండి.
1. ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి.
2. ఒక పెద్ద కుక్కర్ లో, మీడియం మంట మీద కొంత నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయండి. ఆపై ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
3. అనంతరం అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
4. ఇప్పుడు చికెన్, మటన్ ముక్కలు వేసి, రంగు మారే వరకు వేయించాలి.
5. అనంతరం మసాలా దినుసులు, టొమాటో ప్యూరీ, పెరుగు, ఉప్పు, అలాగే కొన్ని నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించండి, ఆపై మంటను కనిష్టంగా తగ్గించి సుమారు 30 నిమిషాలు మాంసం మృదువుగా ఉడికేంతవరకు ఉడికించండి.
6. అనంతరం నానబెట్టిన బియ్యం వేయండి మెల్లిగా కలపండి, ఈ దశలో గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వు వేసి కలపవచ్చు.
7. ఇప్పుడు కుక్కర్ మూతపెట్టి, తక్కువ మంట మీద సుమారు 15 నిమిషాలు అన్నం ఉడికినంత వరకు ఉడికించాలి.
చివరగా మూత తీసి కొద్దిగా నిమ్మరసం పిండి, తరిగిన కొత్తిమీర లేదా పుదీనా ఆకులతో చల్లుకుంటే ఘుమఘుమలాడే చికెన్ మటన్ బిర్యానీ రెడీ.
రైతా లేదా మిర్చి సలాన్ లేదా గ్రీన్ చట్నీతో వేడిగా చికెన్ మటన్ బిర్యానీని ఆరగించండి.