రోజంతా ఏసీలో ఉంటే బరువు పెరుగుతారా? నిపుణులు చెబుతున్న వాస్తవాలేంటి?-does ac lead to weight gain expert recommendations inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రోజంతా ఏసీలో ఉంటే బరువు పెరుగుతారా? నిపుణులు చెబుతున్న వాస్తవాలేంటి?

రోజంతా ఏసీలో ఉంటే బరువు పెరుగుతారా? నిపుణులు చెబుతున్న వాస్తవాలేంటి?

Ramya Sri Marka HT Telugu

ఎండల నుంచి తప్పించుకునేందుకు ఏసిలోనే ఎక్కువ సేపు గడుపుతున్నారా? రోజంతా ఇలా ఏసీ గదుల్లోనే ఉండటం వల్ల శరీర బరువు పెరుగుతుందా? ఏసీ వాడకానికి ఊబకాయానికి మధ్య సంబంధం గురించి నిపుణులు చెబుతున్న ఆసక్తికరమైన విషయాలు, సూచనల గురించి తెలుసుకుందాం రండి.

ఏసీ చల్లదనానికి హాయిగా సేదతీరుతున్న మహిళ (shutterstock)

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువ మంది ఎంచుకుంటున్న ఏకైక మార్గం ఏసీ. ఇళ్లల్లో, కార్యాలయాల్లో అంతటా ఎయిర్ కండిషనర్‌లను ఏర్పాటు చేసుకుని ఎక్కువ సమయాన్ని అక్కడే గడుపుతున్నారు. అవును బయట ఎండలకు ఏసీ ఉంటే చల్లగా, హాయిగా ఉంటుంది. కానీ రోజంగా ఇలా ఏసీ గదుల్లోనే గడపడం ఆరోగ్యానికి మంచిదేనా? అందరూ అంటున్నట్లు నిత్యం ఏసీలోనే ఉంటే శరీర బరువు పెరుగుతుందా? ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉందా? దీని గురించి నిపుణులు చెబుతున్న వాస్తవాలేంటో ఇక్కడ తెలుసుకోండి.

ఏసీలో ఉంటే బరువు పెరుగుతారన్న దాంట్లో నిజమెంత?

నిపుణులు, అధ్యయనాల ప్రకారం.. ఏసీ వాడకానికి, బరువు పెరగడానికి మధ్య స్పష్టమైన సంబంధం లేనప్పటికీ, మనం గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన పరోక్ష కారణాలు ఉన్నాయి. జీవక్రియలో మార్పులు, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పులు వంటి పలు అంశాలు ఏసీ వినియోగంతో ముడిపడి ఉంటాయట. ఇవి క్రమంగా బరువు పెరగడానికి లేదా ఊబకాయానికి దారితీయవచ్చు. ఎలాగో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

ఏసీ వాడకం ఊబకాయానికి ఎలా దారి తీస్తుంది:

1. శరీర ఉష్ణోగ్రత, జీవక్రియ:

మన శరీరం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను (సుమారు 37°C లేదా 98.6°F)తో పనిచేస్తుంది. చల్లని వాతావరణంలో, శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ఈ ప్రక్రియలో కేలరీలు బర్న్ అవుతాయి. అయితే మనం ఎక్కువ సమయం ఏసీలో ఉన్నప్పుడు, శరీరం తన ఉష్ణోగ్రతను నిర్వహించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాదు. దీనివల్ల శక్తి వినియోగం తగ్గుతుంది, అంటే తక్కువ కేలరీలు ఖర్చవుతాయి.

కొన్ని పరిశోధనల ప్రకారం, చల్లని ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉండటం వల్ల థైరాయిడ్ హార్మోన్ల పనితీరు కూడా కొంతవరకు మందగించవచ్చు. థైరాయిడ్ హార్మోన్లు జీవక్రియను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి పనితీరు మందగిస్తే, కేలరీలు ఖర్చయ్యే వేగం కూడా తగ్గుతుంది. ఇవి బరువు పెరుగుదలకు దారి తీస్తాయి.

2. ఆహారపు అలవాట్లలో మార్పులు:

చల్లని వాతావరణం కొన్నిసార్లు మన ఆహారపు అలవాట్లను కూడా ప్రభావితం చేస్తుంది. చాలామందికి చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా, ఎక్కువ కేలరీలు ఉండే ఆహారాలు తీసుకోవాలని అనిపిస్తుంది. ఉదాహరణకు, సూప్‌లు, టీలు, వేయించిన ఆహారాలు తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఏసీ గదుల్లో ఎక్కువ సమయం గడిపే వారు కూడా తెలియకుండానే ఇలాంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవచ్చు. దీనివల్ల శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు అందుతాయి. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.

3. శారీరక శ్రమ, చలనశీలత:

వేడి వాతావరణం ఉన్నప్పుడు చాలామంది బయటకు వెళ్లడానికి లేదా శారీరక శ్రమతో కూడిన పనులు చేయడానికి విముఖత చూపుతారు. ఏసీ అందుబాటులో ఉండటం వల్ల, ఇంట్లోనే లేదా ఆఫీసులోనే ఎక్కువ సమయం గడుపుతారు. దీనివల్ల వారి రోజువారీ శరీర కదలికలు, వ్యాయామం గణనీయంగా తగ్గుతాయి. తక్కువ శారీరక శ్రమ అంటే తక్కువ కేలరీలు ఖర్చు చేయడం, ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి.

4. నిద్ర విధానంలో మార్పులు:

కొన్ని అధ్యయనాలు చల్లని వాతావరణం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని సూచిస్తున్నాయి. అయితే, రోజంతా ఏసీలో ఉండటం వల్ల శరీర సహజ థర్మోరెగ్యులేషన్ ప్రక్రియకు అంతరాయం కలగవచ్చు. నిద్ర సరిగా లేకపోతే, ఆకలిని నియంత్రించే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడవచ్చు, దీనివల్ల ఎక్కువ ఆహారం తీసుకోవాలని అనిపించవచ్చు.అధిక బరువు పెరగచ్చు.

5. డీహైడ్రేషన్ ప్రభావం:

ఏసీ గదుల్లోని పొడి గాలి వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు, దాహంగా ఉన్నప్పుడు మనకు ఆకలిగా అనిపించవచ్చు, దీనివల్ల మనం అనవసరంగా ఎక్కువ ఆహారం తీసుకుంటాము. తగినంత నీరు తాగకపోవడం వల్ల జీవక్రియ కూడా మందగించవచ్చు.

మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

ఏసీ వినియోగాన్ని తగ్గించండి:

అవసరమైనప్పుడు మాత్రమే ఏసీని ఉపయోగించండి, గది ఉష్ణోగ్రతను మరీ చల్లగా ఉంచకండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి:

ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు లేదా బయటకు వెళ్లి నడవడానికి ప్రయత్నించండి.

సమతుల్య ఆహారం తీసుకోండి:

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉండే ప్రోటీన్‌లను మీ ఆహారంలో చేర్చండి.

తగినంత నీరు త్రాగాలి:

రోజంతా తగినంత నీరు త్రాగడం వల్ల డీహైడ్రేషన్ నివారించవచ్చు, జీవక్రియను మెరుగుపరచవచ్చు.

నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి:

ప్రతిరోజూ కనీసం 7-8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి.

కేవలం ఏసీలో ఉండటం వల్ల మాత్రమే ఊబకాయం రాదు. కాకపోతే పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే బరువు పెరిగే అవకాశం కచ్చితంగా ఉంది. మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం