దట్టమైన అడవి అది. ఆ అడవిలో ఒక పెద్ద ఏనుగు నివసిస్తోంది. ఆ అడవిలోనే చీమల గుంపు కూడా నివసిస్తోంది. చీమలన్నీ కష్టపడి ఆహారాన్ని తెచ్చుకుని తింటూ తమ గూడులో బతుకుతూ ఉండేవి. కానీ ఏనుగకు చీమలను చూస్తే చాలా చిన్నచూపు.
ఏనుగు ఎప్పుడు చిన్న చీమలను చూసినా వెటకారంగా నవ్వుతుంది. వాటి ముందు తన పరిమాణం, గొప్పతనం గురించి మాట్లాడుతుంది. అయితే ఇవేవీ పట్టించుకోని చీమలు తమ పని తాము చేసుకుని పోతుంటాయి.
చీమలపుట్ట దగ్గరకు కావాలనే ప్రతిరోజూ ఏనుగు వస్తుండేది. తన కాలుతో గూడును ఆ పుట్టను తొక్కేస్తానంటూ బెదిరించేది. చీమలు భయపడుతుంటే నవ్వుకునేది. చాలదన్నట్లు తన తొండంతో చీమలను ఊదడం, కొట్టడం వంటి పనులు కూడా చేసేది. ఒకసారి తొండం నిండా నీళ్లు నింపి చీమలపై చల్లేసింది. పాపం చీమలు అన్నీ తడిసిపోయి ఎంతో ఇబ్బంది పడ్డాయి. ఏనుగు దూకుడుకు చీమలు బాగా అలసిపోయాయి. అవి బాధపడుతుంటే ఏనుగు ఆనందపడేది.
చీమలు బాధతో కేకలు వేస్తే ఏనుగు ‘మీ అందరినీ నా కాళ్ల కింద తొక్కేస్తాను’ అంటూ బెదిరించేది. చీమలు చాలా ఓపిక పట్టాయి. ఏనుగుకు దూరంగా వెళ్లి కొత్త పుట్ట కట్టుకోవాలని అనుకున్నాయి. కానీ చీమలు ఎక్కడికి వెళ్లినా అక్కడికి ఏనుగు వచ్చేసేది. ఏనుగు సరస్సులోకి వెళ్లి తొండం నుంచి నీటిని తెచ్చి చీమలపై విసిరేసేది.
ఇక చీమల సహనం నశించింది. తాము మౌనంగా ఉంటే ఏనుగు తమ ప్రాణాలు తీస్తుందని భావించాయి. కాబట్టి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాయి. మరుసటి రోజు ఏనుగు వచ్చినప్పుడు ఏనుగు తొండం లోపలికి వెళ్లి కూర్చొన్నాయి. ఏనుగు తొండం లోపల కొరకడం ప్రారంభించాయి. ఆ బాధను ఏనుగు తట్టుకోలేకపోయింది.
తన తొండం నుంచి బయటికి రావాలని చీమలను వేడుకుంది. చీమలు ‘ మా పుట్టను కూల్చేసి మాకు ఇల్లు లేకుండా చేస్తున్నావు. అందుకే మేము ఇకపై నీ తొండంలోనే కూర్చుంటాము’ అని చెప్పాయి. అప్పుడు ఏనుగు తన తప్పు తెలుసుకుంది.
తాను తప్పు చేశానని క్షమాపణలు కోరింది. ఇంకెప్పుడూ ఇలా చేయనని వేడుకుంది. చీమలు వెంటనే తొండంలోంచి బయటికి వచ్చాయి. ‘నువ్వు మమ్మల్ని ఏడిపించడం మొదలుపెట్టిన రోజే.. మేము నీ తొండంలో ప్రవేశించి నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, కానీ నువ్వు మారతావని కొంత సమయం ఇచ్చి సహనంగా ఉన్నాము’ అని చెప్పుకొచ్చాయి. అప్పట్నించి ఏనుగు ఎప్పుడూ చీమల జోలికి వెళ్ల లేదు.
చీమలు అనుకుంటే ఏనుగును ఎంతో ఇబ్బంది పెట్టేవి. కానీ అవి సాటి జీవిగా ఏనుగును గౌరవించాయి. ఆ గౌరవాన్ని ఏనుగు నిలబెట్టుకోలేదు. అందుకే చివరికి బుద్ధి చెప్పాయి.
మనుషులు కూడా తమ చుట్టూ ఉన్న వారికి గౌరవాన్ని ఇవ్వాలి. పేదలు, ధనవంతులు, వృద్ధులు, యువకులను అనే తేడా లేకుండా సమానంగా, గౌరవంగా చూడాలి. లేకపోతే భవిష్యత్తులో వారికి కూడా ఇలాంటి గుణపాఠాలు ఎదురయ్యే అవకాశం ఉంది.