కైలాస్ మానస్ సరోవర యాత్ర ఈ ఏడాది జూన్ 30 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఎంతోమంది కైలాస మానసరోవర యాత్రకు సిద్ధమవుతున్నవారు.
చైనాతో ఉద్రిక్తతల కారణంగా ఈ యాత్రను 2020లో ఆపేవారు. తర్వాత ఈ సంవత్సరమే ఈ యాత్ర ప్రారంభమవుతోంది. దీని వల్ల పెద్ద సంఖ్యలోనే శివ భక్తులు ఈ యాత్ర చేసేందుకు వస్తారు. అయితే ఈ యాత్రలో ఒక మనిషి ఎన్ని కిలోమీటర్లు నడవాలి? అతనికి ఎంత ఫిట్ నెస్ అవసరమో తెలుసుకోవాలి.
కైలాస మానస సరోవర యాత్రలో కైలాస పర్వతాన్ని ప్రదక్షిణ చేయాలి. అలా చేసేటప్పుడు దాదాపు 52 నుంచి 55 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించాల్సి వస్తుంది. ఈ ప్రయాణం పూర్తి చేయడానికి మీకు మూడు రోజుల సమయం పడుతుంది. ఇది 4600 మీటర్ల ఎత్తైన లోయ నుండి ప్రారంభమవుతుంది. కైలాస మానస సరోవర యాత్రలో 320 చదరపు కిలోమీటర్ల విస్తరణలో ఉన్న మానస సరోవరం చుట్టూ ప్రదక్షిణ కూడా ఉంటుంది.
కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లే ముందు అనేక వైద్య పరీక్షలను చేస్తారు. ఈ యాత్రకు ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ యాత్రకు దరఖాస్తు చేసుకునే వారికి ఢిల్లీ హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు పరీక్షలను నిర్వహిస్తారు. పర్యాటకులకు హిమోగ్లోబిన్, కొలెస్ట్రాల్, ఇన్సులిన్ మొదలైన పరీక్షలు చేస్తారు.
అలాగే బాడీ మాస్ ఇండెక్స్ పరీక్ష కూడా చేస్తారు. ఈ మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే వారి బాడీ మాస్ ఇండెక్స్ 27 కన్నా తక్కువ ఉండాలి. ఈ పరీక్షల్లో ఏమాత్రం తేడా ఫలితాలు వచ్చినా ఆ ప్రయాణికుడిని అనర్హుడిగా తేల్చి ప్రయాణాన్ని రద్దు చేస్తారు.
మానస సరోవరం అనేది చాలా ఎత్తయిన పర్వతం వైపుగా సాగే యాత్ర. అక్కడికి వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఎత్తయిన పర్వతాలు ఎక్కాల్సి వస్తుంది. అలా హైపోక్సియా లేదా ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఏ మాత్రం అనారోగ్య సమస్యలు ఉన్న వారిని ఆపేస్తూ ఉంటారు.
మానస సరోవర యాత్రకు వెళ్ళడానికి ముందే రెండు మూడు నెలల నుంచి ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎక్కువ సమయం వాకింగ్ చేయాలి. ప్రయాణ సమయంలో అలసిపోకుండా ఉండేందుకు ముందుగానే నడకను అలవాటు చేసుకుంటే ఉత్తమం. అప్పుడే మీరు ఈ యాత్ర ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించగలరు. ప్రయాణించేటప్పుడు ఎత్తు పల్లాలు, చెడు వాతావరణం ఉండవచ్చు. వాటిని తట్టుకోవాలంటే ఒక మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండాలి.
ఎవరైతే కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకుంటున్నారో వారు ప్రతి రోజు నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు దాదాపు గంట నుంచి గంటన్నర చేయడం మంచిది. అలాగే యోగా ప్రాణాయామం కూడా ప్రతిరోజు ఒక అరగంట పాటు చేయాలి. ప్రయాణానికి ముందు మీరు ఎత్తు ప్రదేశాలు అలవాటు పడటానికి దగ్గరలో ఉన్న కొండలు ఎక్కి దిగడం వంటివి చేస్తూ ఉండాలి. లేకుంటే అంతవరకు చేరాక వైద్య పరీక్షల్లో అనర్హుడుగా తేలి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.