Maida Flour: మైదాపిండితో చేసిన ఆహార పదార్థాలు తింటే నిజంగానే పేగులకు అతుక్కుపోతాయా..? ఫిట్‌నెస్ కోచ్‌లు ఏమంటున్నారు?-do foods made with maida flour really cause constipation what do fitness coaches say ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Maida Flour: మైదాపిండితో చేసిన ఆహార పదార్థాలు తింటే నిజంగానే పేగులకు అతుక్కుపోతాయా..? ఫిట్‌నెస్ కోచ్‌లు ఏమంటున్నారు?

Maida Flour: మైదాపిండితో చేసిన ఆహార పదార్థాలు తింటే నిజంగానే పేగులకు అతుక్కుపోతాయా..? ఫిట్‌నెస్ కోచ్‌లు ఏమంటున్నారు?

Ramya Sri Marka HT Telugu
Jan 13, 2025 08:30 AM IST

‘మైదా పిండి మంచిది కాదు. అస్సలు తినొద్దు’.' మైదాతోనే అసలు సమస్య మొత్తం'. ‘మైదా పిండితో చేసిన ఫుడ్ తింటే పేగులకు అతుక్కుపోయి మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి’. ఇవన్నీ వింటూనే ఉన్నాం కదా. ఇది కేవలం అపోహేనా, వాస్తవం కూడానా.. అని ఎప్పుడైనా ఆలోచించారా.. రండి మనం తేల్చేద్దాం.

మైదాపిండితో చేసిన ఆహార పదార్థాలు తింటే నిజంగానే పేగులకు అతుక్కుపోతాయా..
మైదాపిండితో చేసిన ఆహార పదార్థాలు తింటే నిజంగానే పేగులకు అతుక్కుపోతాయా..

మన చుట్టూ ఉండే సమాజం మారుతున్నప్పుడు మన ఆహార అలవాట్లు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు తెలియని వస్తువును కూడా వండుకుని తినాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం ఎంతో రుచిగా ఉందనుకుని చాలా ఏళ్లుగా తిన్నవాటిని కూడా పక్కకుపెట్టేస్తాం. అలాంటిదే ఈ మైదా పిండి కూడా. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగానో, అపోహల ఫలితంగానో మైదా పిండి అంటే ప్రమాదకరమైనదని, ప్రయోజనం లేని ఆహార పదార్థమని భావిస్తున్నాం. మరి అందులో వాస్తవాలేంటి? ప్రముఖ ఫిట్ నెస్ కోచ్ రాల్ట్సన్ డిసౌజ్ దీని గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం.

yearly horoscope entry point

ఇంగ్లీషులో All Purpose Flour, తెలుగులో మైదాపిండిగా చెప్పుకునే ఈ మైదాపిండి మనం ఆహారం తిన్న తర్వాత కడుపులో ఇబ్బంది గురి చేస్తుందా.. ? నిజంగానే పేగులకు అతుక్కుపోయి జీర్ణ సమస్యలకు కారణమవుతుందా ? అనే అంశాలపై వివరణ ఇచ్చారు.

"మైదాపిండి అనేది మీరు తిన్న తర్వాత కడుపులోని పేగులకు అంటుకుంటుందనేది పూర్తిగా అవాస్తవం. మైదాపిండిలో కార్బొహైడ్రేట్, ఫైబర్ లేకపోవడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. అందుకే మైదా తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. ఒకవేళ ఇది నిజంగా మీ పేగులకు అతుక్కునేదే అయితే మీ చక్కెరస్థాయిలలో ఒకేసారి అంత మార్పు కనిపించదు" అని పేర్కొన్నారు.

వాస్తవానికి మైదాపిండిని తినే విధానం తెలుసుకోవాలి

మైదా పిండిని తీసుకునే విధానం తెలుసుకుంటే, ఈ షుగర్ లెవల్స్ త్వరగా పెరిగే ప్రమాదం నుంచి తప్పించుకోవ్చు. దాని కోసం ముందుగా మైదా పిండితో చేసే పదార్థాలతో పాటు ఫైబర్ తో ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవచ్చు. మైదా తిన్న వెంటనే శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయంటే, అది త్వరగానే జీర్ణమైపోతుందని అర్థమైపోయినట్లే. ఒకవేళ అదే విషయం వేరెవరైనా చెప్పి మైదా తింటే పేగులకు అతుక్కుపోతుందని అంటే వాళ్లకు నమ్మకంగా ఒక మాట చెప్పండి. కాదు అని.

మైదా పిండి వల్ల ఉపయోగాలు:

తక్షణ శక్తిని అందించే ఇందనంగా మైదా పిండి ఉపయోగపడుతుంది. దీనిని అనేక బేకరీ పదార్థాలలో వాడుతుంటారు. మైదా పిండి లేకుండా ఏ ఒక్క బేకరీ ఐటెం కూడా రెడీ అవదు. మైదాపిండిని ఆయిల్ లేదా వెన్నతో కలిపి చేసిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి.

మైదా మాత్రమే కాదు, ఏ ఆహార పదార్థం అయినా తినాలనిపించినప్పుడు అపోహలు నమ్మకండి. అవి చేసే ప్రయోజనాలను, నష్టాలను బేరీజు వేసుకోండి. ఒకవేళ దానిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటే పక్కకుపెట్టేయండి. అలా కాకుండా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటే, అనుమానాలను పక్కకుపెట్టేసి కచ్చితంగా తినేయండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం