Cool Tour in Summer । వేసవిలో చల్లని విహారానికి భారతదేశంలోని ఐదు అద్భుత ప్రదేశాలు!
Cool Tour in Summer: ఎండాకాలంలో చల్లని విహారయాత్ర చేయాలనుకుంటున్నారా? భారతదేశంలోని కొన్ని అద్భుత ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Cool Tour in Summer: భారతదేశంలో ఎండాకాలంలో భరించలేని వేడి ఉంటుంది. మండే ఎండలకు తాళలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఈ సమయంలో చల్లని ప్రదేశాలకు విహారయాత్ర ఎంతో హాయినిస్తుంది. తీవ్రమైన ఎండల నుంచి కొంతకాలం ఉపశమనం పొందడానికి ఈ విహారయాత్రలు అవకాశం కల్పిస్తాయి. అయితే ఇందుకోసం దేశం విడిచి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. భారతదేశంలోనే కొన్ని ప్రాంతాలు వేసవిలోనూ చల్లదనాన్ని పంచుతాయి. ఇక్కడ కూడా వేసవిలో విహరించడానికి అనువైన చల్లని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఉత్తరాన హిమాలయాలలోని శీతల మంచు పర్వతాలు మొదలుకొని, దక్షిణాన చల్లని హిల్ స్టేషన్ల వరకు ఆహ్లాదకరమైన ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఐదు ఆకర్షణీయ ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
షిమ్లా
హిమాలయా పర్వత శ్రేణుల మధ్య ఉన్న షిమ్లా నగరం, అద్భుతమైన ప్రకృతి అందాలకు నిలయం. ఇది వేసవిలోనూ చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ప్రముఖ హిల్ స్టేషన్. ఇక్కడి మాల్ రోడ్ లో కలియ తిరుగుతూ స్థానిక మార్కెట్లను అన్వేషించండి, బొమ్మ రైలులో ప్రయాణించండి, ప్రఖ్యాత జఖూ ఆలయాన్ని సందర్శించండి. వేసవి మే నెలల్లోనూ షిమ్లాలో పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కు మించవు.
ఊటీ
దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్, ఊటీని 'క్వీన్ ఆఫ్ ది హిల్స్' అని కూడా పిలుస్తారు. చుట్టూ నీలగిరి పర్వత శ్రేణులు, పచ్చదనంతో నిండిన ఈ హిల్ స్టేషన్ ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఊటీలో చూడదగిన ప్రదేశాలలో నీలగిరి పర్వత రైలు, బొటానికల్ గార్డెన్, పైకార సరస్సు, దొడ్డబెట్ట శిఖరం ఉన్నాయి. మే నెలలో పగటివేళ ఊటీలో సగటు ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.
కొడైకెనాల్
దక్షిణాదిలోని మరొక ప్రసిద్ధ వేసవి పర్యాటక ప్రాంతం కొడైకెనాల్. చుట్టూ పచ్చదనం, మంత్రముగ్ధులను చేసే కొండలు, లోయలతో ప్రకృతి సౌందర్యం నిండి ఉంది. ఇది జంటలకు హనీమూన్ గమ్యస్థానంగా కూడా ఉంటుంది. వేసవిలో కొడైకెనాల్ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వీచే చల్లని గాలులను ఆస్వాదించడం కోసం నలుమూల నుండి పర్యాటకులు వస్తారు. మే నెలలో ఇక్కడ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కొడైకెనాల్లోని ప్రధాన సందర్శనా స్థలాలలో గ్రీన్ వ్యాలీ వ్యూపాయింట్, బేర్ షోలా జలపాతం, కోకర్స్ వాక్ ఉన్నాయి.
చిరపుంజి
దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి, చిరపుంజి ఏడాదిలో అత్యధిక వార్షిక వర్షపాతం పొందప్రాంతం. చల్లగా మబ్బులతో కూడిన వాతావరణం ఆకాశంలో భారీ మేఘాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. మీరు వర్షాలను ఇష్టపడితే తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ఆకుపచ్చని అడవులు, విభిన్న జంతుజాలం, గంభీరమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందిన చిరపుంజి వేసవిలో తప్పక సందర్శించాలి. మే నెలలో పగటి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ నుండి 23 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.
అండమాన్ - నికోబార్ దీవులు
చాలా వేడి కాకుండా, చల్లగా కాకుండా వెచ్చని వాతావరణంను అనుభవించాలంటే బంగాళాఖాతంలోని అండమాన్- నికోబార్ దీవులను సందర్శించండి. మే నెలల్లో ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఈ దీవులు ఎంతో అద్భుత దృశ్యాలను, ఆహ్లాదకరమైన వాటర్ స్పోర్ట్స్ ను మీకు అందిస్తాయి. అద్భుతమైన పగడపు దిబ్బలను అన్వేషించండి, సహజమైన బీచ్లలో విశ్రాంతి తీసుకోండి, స్నార్కెలింగ్ , స్కూబా డైవింగ్ వంటి సంతోషకరమైన నీటి కార్యకలాపాలలో పాల్గొనండి.
సంబంధిత కథనం