రాత్రి భోజనం ఏడుగంటల్లోపే తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదే విషయాన్ని అనుష్క శర్మ ఆచరణీయంగా తెలుసుకుంది. రాత్రి త్వరగా తినడం, త్వరగా నిద్రపోవడం ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుందని వివరిస్తోంది అనుష్క శర్మ.
దాదాపు ఏడాది క్రితం అనుష్క తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి హాజరైన ప్యూమా నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గంది. ఆ ముఖాముఖిలో ఎన్నో విషయాలను ఈ జంట షేర్ చేసుకుంది. అందులో అనుష్క తాను సాయంత్రం ఆరు గంటలకే డిన్నర్ ముగిస్తానని చెప్పింది. తన కుమార్తె వామికా కారణంగా ఈ అలవాటు వచ్చిందని వివరించింది. తన కూతురు సాయంత్రం ఆరుగంటలకే తినేదని, ఆమె కోసం తాను కూడా అప్పుడు తినడం ప్రారంభించానని చెప్పింది.
రాత్రి భోజనం త్వరగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనుష్క శర్మకు ఆచరణలో తెలిశాయి. ఇది ఆమెకు ఎంతో ప్రశాంతతను, ఆరోగ్యాన్ని ఇచ్చింది. తాను సోషల్ మీడియా ఎక్కువ ఉపయోగించనని అందుకే తన కూతురుతో పాటూ త్వరగా నిద్రపోతున్నానని అనుష్క చెప్పింది.
అనుష్క మాట్లాడుతూ "నేను త్వరగా భోజనం చేస్తాను. ఇది నా ఆరోగ్యానికి అద్భుతమే చేసింది. 6 డిన్నర్ పూర్తయిపోతుంది. కూతురితో కలిసి తింటాను. ఇక లంచ్ నా కూతురు 11 లేదా 11:30 గంటలకు చేస్తుంది. అప్పుడే నేను కూడా భోజనం చేస్తాను. ఆ తరువాత చాలా సమయం మిగులుతుంది కాబట్టి బాగా విశ్రాంతి తీసుకుంటాను. బాగా నిద్రపోతాను. ఈ ఆహారపు అలవాట్లు వల్ల నా నిద్ర సమస్యలన్నీ పోయాయి. నిద్ర లేచాక ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఎక్కువ ఎనర్జీ వచ్చేది. ప్రతి విషయం స్పష్టంగా ఆలోచించగలుగుతాను. త్వరగా తినే అలవాటు వల్లే నాకు ఎంతో ఆరోగ్యం, ఆనందం దక్కింది. జీవితంలో నేను చేసిన ఏకైక మార్పు అదే."
డిన్నర్ త్వరగా తినడం వల్ల బ్రెయిన్ ఫాగ్ కూడా తగ్గిందని మరో ఇంటర్వ్యూలో అనుష్క వెల్లడించింది. ఈ అలవాటు తనకు మేలు చేయడంతో విరాట్ కూడా కలిసి తినాలని నిర్ణయించుకుంటున్నట్టు చెప్పారు. సాయంత్రం 6 తరువాత వంటగది క్లోజ్ చేసేస్తామని ఆమె తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) ప్రకారం, రోజులో ఆలస్యంగా భోజనం చేయడం జీవక్రియ రుగ్మతలు వచ్చే అవకాశం ముడిపడి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి భోజనం త్వరగా చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపడుతాయి. ఇది ఆక్సీకరణను పెంచుతుంది.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)