అమర్నాథ్ యాత్రను పూర్తి చేయాలని, ఆ గుహలోని శివలింగాన్ని చూడాలని ప్రతి శివ భక్తుడి కోరిక. అమర్నాథ్ ప్రయాణం చేయడం ఎంతో కష్టం. ఆ ప్రయాణం చేసి మంచు రూపంలో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుని వచ్చేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలి వెళతారు.
అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని చూస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని జీవితంలో కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు. మొదటిసారి అమర్నాథ్ గుహను ఎవరు చూశారో తెలుసా? ఆ మొదటి భక్తుడు గురించి తెలుసుకోండి.
మత విశ్వాసాలు చెబుతున్న ప్రకారం అమర్నాథ్ గుహను మొదట భృగు మహర్షి సందర్శించాడని అంటారు. కాశ్మీర్ లోయలో వరదల వల్ల మునిగిపోయినప్పుడు కశ్యప మహర్షి నదులు, కాలువలు ద్వారా ఆ నీటిని బయటికి తరలిపోయేలా చేశాడని అంటారు. అదే సమయంలో భృగు మహర్షి హిమాలయాలకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మార్గమధ్యంలో తపస్సు చేసుకోవడానికి ఒక ఏకాంత ప్రదేశం కోసం వెతక సాగాడు. అలా వెతుకుతున్నప్పుడే అతనికి అమర్నాథ్ గుహ కనిపించింది. ఆ అమర్నాథ్ గుహలో మంచుతో ఉన్న శివలింగాన్ని చూశారు. గుహ పైకప్పు నుండి కారుతున్న నీటి బిందువుల వల్ల ఆ శివలింగం ఏర్పడిందని ఆయనకు అర్థమైంది. మంచుతో చేసిన శివలింగం కావడం వల్లే దీన్ని బాబా బర్ఫానీ అని పిలుస్తారు. అలా భృగు మహర్షి ద్వారానే అమర్నాథ్ శివలింగం గురించి అందరికీ తెలిసిందని... అమర్నాథ్ యాత్రలు కూడా అప్పుడే మొదలయ్యాయని అంటారు.
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 25, 2025 నుండి ప్రారంభమవుతుంది. ఆగస్టు 19 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఏప్రిల్ 14 నుండి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అయితే ఈ యాత్ర చేయడానికి అందరూ అర్హులు కాదు. గర్భిణీ స్త్రీలు 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు 13 ఏళ్ల లోపు పిల్లలు అమర్నాథ్ యాత్రకు చేసేందుకు అర్హత ఉండదు.
అమర్నాథ్ యాత్రను హిందువులు పరమ పవిత్రమైన పర్యటనగా చెప్పుకుంటారు. జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాలలో ఉంది ఈ గుహ. ఈ యాత్రను చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. పహాల్గామ్ ద్వారా ఒక మార్గం సాగితే, మరొకటి బాల్టాల్ ద్వారా సాగుతుంది. అయితే అమర్నాథ్ యాత్రలో భద్రత ఎంతో ముఖ్యమైనది. ఈ ప్రాంతంలోనే ఉగ్ర సంఘటనలు అధికంగా జరుగుతూ ఉంటాయి.
అమర్నాథ్ యాత్ర చేయాలనుకునేవారు ముందుగా ఢిల్లీ లేదా శ్రీనగర్ కి చేరుకోవాలి. అక్కడ నుంచే బస్సు రైలు లేదా విమానం ద్వారా అమర్నాథ్ యాత్రకు వెళ్ళవచ్చు.