అధిక బరువు తగ్గాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ఉపవాసాలు చేస్తుంటారు. అయితే ఒక వ్యక్తి వాటర్ ఫాస్టింగ్ ద్వారా మూడు వారాల్లో 13 కిలోలు తగ్గాడు. ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారింది. ఆ వ్యక్తి అడిస్ మిల్లర్. ఇతను కోస్టారికాకు చెందిన వ్యక్తి. అతను తన యూట్యూబ్ ఛానెల్లో తాను బరువు తగ్గిన ప్రయాణం గురించి వివరించాడు. 21 రోజుల్లో బరువు తగ్గి అతను యూట్యూబ్ లో వైరల్ గా మారాడు. తాను నీటి ఉపవాసం ద్వారా బరువు తగ్గినట్టు చెప్పాడు అడిస్.
అడిస్ మిల్లర్ చెప్పిన ప్రకారం ఈ ఏడాది మొదల్లో అతను వాటర్ ఫాస్టింగ్ మొదలుపెట్టాడు. మూడు వారాల పాటూ అతను ఈ నీటి ఉపవాసం ప్రారంభించాడు. తాను ఈ ఉపవాసం ద్వారా మూడు వారాల్లో ఎలా బరువు తగ్గాడో వివరించాడు. ఆయన ఉపవాస షెడ్యూల్ గురించి నెటిజన్లకు తెలియజేశాడు.
21 రోజుల నీటి ఉపవాసంలో 13.1 కిలోలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. అలాగే శరీరంలో కోరుకున్న కొవ్వు కూడా 6% తగ్గింది. మరీ సన్నగా ఉన్న వ్యక్తులు ఈ నీటి ఉపవాసాన్ని చేయకూడదని చెబుతున్నాడు అడిస్ మిల్లర్. ఇతనను బరువు తగ్గడంతో పాటూ శరీర కొవ్వును కరిగించుకోవడం ఆనందంగా ఉన్నట్టు అడిస్ వివరిస్తున్నాడు.
గురుగ్రామ్లోని పరాస్ హెల్త్ ఇంటర్నల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ ఆర్ఆర్ దత్తా హెచ్టీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "నీటి ఉపవాసం వల్ల 24 గంటల నుండి కొన్నొ రోజులు లేదా వారాల వరకు నీరు మాత్రమే తీసుకుంటారు. ఇతర ద్రవాలు లేదా ఆహారాలు తీసుకోకూడదు. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు, విషాలు బయటికి పోతాయి. మెరుగైన జీర్ణక్రియకు ఇది మంచిది. మానసిక స్పష్టత కూడా బావుంటుంది. బరువు తగ్గడానికి , ఇన్సులిన్ సున్నితత్వానికి ఇది సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి’ అని చెప్పారు. అయినా కొన్ని ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయని వైద్యులు వివరిస్తున్నారు.
ఆహారం తినకుండా నీరు మాత్రమే తాగడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ వంటి ముఖ్యమైన పోషకాలలో లోపాలకు దారితీస్తుంది. ఇది మనిషిని బలహీనంగా మార్చేస్తుంది. మైకంగా అనిపిస్తుంది. మరిన్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
శరీరం తేమవంతంగా ఉండేందుకు నీరు అవసరం. అయితే నీరు మాత్రమే తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల కూడా డీ హైడ్రేషన్ సమస్య రావచ్చు.
దీర్ఘకాలిక ఉపవాసం జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. శరీరం శక్తిని ఆదా చేయడానికి సర్దుబాటు చేస్తుంది. ఉపవాసం ఆపేశాక హఠాత్తుగా బరువు పెరగడానికి దారితీస్తుంది.
డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, ఆహార రుగ్మతలు వంటివి సమస్యలు ఉన్న వారు వాటర్ ఫాస్టింగ్ చేయకూడదు.
ఉపవాసాన్ని ఆరోగ్యంగా చేయడానికి పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. పూర్తిగా నీటి ఉపవాసం చేయకుండా తేలికపాటి ఆహారం, పండ్లు తింటూ ఉపవాసం చేయడం మంచిది. అలాగే వ్యాయామం ద్వారా బరువును సులువుగా తగ్గవచ్చు.
టాపిక్