Vikatakavi Despatch Screening In IFFI: అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో జీ5 ఓటీటీ ఒరిజినల్ సీరిస్లైన డిస్పాచ్, వికటకవి స్పెషల్ స్క్రీనింగ్ చేయనున్నారు. బాలీవుడ్ పాపులర్ నటుడు మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డిస్పాచ్’ సిరీస్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై నవంబర్ 21న స్ట్రీమింగ్ చేయనున్నారు.
కను బెహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కిన డిస్పాచ్ వెబ్ సిరీస్లో మనోజ్ బాజ్పేయి, షహానా గోస్వా, అర్చిత అగర్వాల్ ముఖ్య పాత్రలను పోషించారు. మనోజ్ బాజ్పేయి అనుభవజ్ఞుడైన క్రైమ్ జర్నలిస్ట్ పాత్ర (జాయ్) ను పోషించారు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ అధికారం, నైతికత, వ్యక్తిగత సంఘర్షణల వలయంలో చిక్కుకున్న జాయ్ ప్రయాణంగా ఈ కథ ఉంటుంది.
అలాగే తెలుగు డిటెక్టివ్ థ్రిల్లర్గా తెరకెక్కిన వికటకవి వెబ్ సిరీస్లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్స్గా నటించారు. ఈ వెబ్ సిరీస్కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మించారు. వికటకవి వెబ్ సిరీస్ను నవంబర్ 23న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేదికపై ప్రదర్శించనున్నారు.
వికటకవి : ది క్రానికల్స్ ఆఫ్ అమరగిరి అనేది ఒక రహస్య ప్రదేశమైన అమరగిరి నేపథ్యంలో సాగే గ్రిప్పింగ్ డిటెక్టివ్ థ్రిల్లర్. ఇక్కడ రామకృష్ణ అనే యువ పరిశోధకుడు ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక రహస్యమైన కేసులో చిక్కుకుంటాడు. నల్లమల అడవిలోకి ప్రవేశించిన తర్వాత గ్రామస్థులు రహస్యంగా తమ జ్ఞాపకాలను కోల్పోతుంటారు.
రామకృష్ణ ఇంకా లోతుగా పరిశోధించినప్పుడు కొన్ని రహస్యాలు బయటపడతాయి. 1970ల నాటి తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ తెలుగు ఒరిజినల్ సిరీస్ నాటి సాంస్కృతిక, ఆచార, సంప్రదాయాలను చాటి చెబుతుంది. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (International Film Festival Of India) కార్యక్రమం నవంబర్ 20 నుండి 28వ తేది వరకు గోవాలో జరుగనుంది.
ఈ క్రమంలో వికటకవి, డిస్పాచ్ వెబ్ సిరీస్లను అక్కడ ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా డిస్పాచ్ డైరెక్టర్ కను బెహ్ల్ మాట్లాడుతూ.. ‘మా సిరీస్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంత గొప్ప అనుభూతి మరొకటి లేదు. నేను మొదటిసారి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొంటున్నాను. చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పారు.
వికటకవి దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ.. "ఐఎఫ్ఎఫ్ఐలో వికటకవి ప్రీమియర్ను ప్రదర్శించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ప్రతిష్టాత్మక వేదికపై ఏ దర్శకుడికైనా తమ పనితనాన్ని ప్రదర్శించడం నిజంగా గొప్ప గౌరవం. వికటకవిలో సాంస్కృతిక మూలాలు, గ్రిప్పింగ్ మిస్టరీ ఉంటుంది. ప్రత్యేకించి అది తెలుస్తుంది" అని అన్నారు.
"తెలంగాణలోని స్థానిక చరిత్రను ప్రపంచ ప్రేక్షకులకు అందిస్తుంది. రైటర్ సాయితేజ దేశ్రాజ్గారు మంచి కథను అందించారు. జీ5తో ఈ సహకారంతో ఈ సిరీస్ను అద్భుతంగా తీశాం. ఈ ప్రత్యేక ప్రాజెక్ట్ని ఐఎఫ్ఎప్ఐలో ప్రదర్శించడానికి ఎదురుచూస్తున్నాను" అని డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి పేర్కొన్నారు. కాగా వికటకవి జీ5 ఓటీటీలో నవంబర్ 28న రిలీజ్ కానుంది.