NNS 15th July Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సోమవారం (జులై 15) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అరుంధతి అస్థికలు ఇంకా పుణ్యనదుల్లో కలపకపోవడం వల్లే ఇంట్లో అన్ని సమస్యలు వస్తున్నాయంటుంది మనోహరి. ఈ దోషాలన్నీ పోయి అరుంధతి ఆత్మ శాంతించాలంటే వెంటనే అస్థికల్ని పుణ్యనదుల్లో కలపడం మంచిది అంటుంది.
అమర్ తల్లిదండ్రులు మాత్రం ఏం చేద్దామని మిస్సమ్మను అడుగుతారు. ఒకసారి ఆయనతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామంటుంది మిస్సమ్మ. మంచి మాట చెప్పావమ్మా.. అలాగే చేద్దామంటాడు శివరామ్.
ఇంతకీ అస్థికలు ఎక్కడున్నాయ్ అంకుల్ అంటుంది మనోహరి. అవి నీకు, నాకు అస్థికలేమోగానీ అమర్కి అరుంధతి జ్ఞాపకాలు.. అందుకే వాటిని తన దగ్గరే ఉంచుకున్నాడు అంటాడు శివరామ్. అది కాదు అంకుల్.. అస్థికలు ఎక్కడున్నాయో తెలిస్తే.. అంటూ ఏదో చెప్పబోతుంది మనోహరి. అవి అమర్ మనసుకి దగ్గరగా ఉన్నాయంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది నిర్మల.
లోపలకు వెళ్లబోతున్న మనోహరిని ఆపి ఏంటి మను.. నీ నోటి నుంచి ఇంత మంచి మాటలు రావడం ఏంటి? ఏదో చేస్తున్నావని అర్థమవుతుంది.. ఏదో ప్లాన్ చేస్తున్నావు? ఏంటది అంటుంది మిస్సమ్మ. దీనికి నామీద అనుమానం వచ్చింది.. ఎలాగైనా దీన్ని నమ్మించాలి అనుకుంటూ అదేం లేదు మిస్సమ్మ.. ఈ ఇంటికి ఏదో సాయం చేయాలని అలా చెప్పాను. నా మాట కటువేమోగాని మనసు కాదు అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది మనోహరి. దీన్ని నమ్మకూడదు అనుకుంటుంది మిస్సమ్మ.
మనోహరి తన అస్థికల గురించి ఎందుకు ఆరా తీస్తుంది అని ఆలోచిస్తుంది అరుంధతి. కొడైకెనాల్ నుంచి అమర్, పిల్లలను చూడటానికి అరుంధతికి పరిచయం ఉన్న పూజారి వస్తాడు. అమర్కి ఫోన్ చేసి తాను హైదరాబాద్ వచ్చానని, ఒకసారి చూసి వెళ్దామని వచ్చానని చెబుతాడు. మీరు లోపలకు వెళ్లండి పూజారిగారు అంటాడు అమర్.
ఆయన్ని చూసి ఎలా ఉన్నారు పూజారిగారు. మీరు నా కల గురించి చెబితే ఏం జరగదు అన్నారు. నీ ప్రాణానికి హామీ ఇచ్చారు కానీ నేను ఎందుకు చనిపోయాను. నేనేమైనా తప్పు చేశానా? అని అడుగుతుంది అరుంధతి. పూజారికి ఆత్మ ఉనికి తెలిసి బయటే ఆగిపోతాడు. అమర్ తల్లిదండ్రులు వచ్చి ఆయన్ని లోపలకు పిలుస్తారు. అరుంధతి ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుందని ఆయన చెప్పడంతో వాళ్లు బాధపడతారు. పూజారి మిస్సమ్మను కలిసి నిజం చెప్పకముందే ఇంటికి వెళ్లాలనుకుంటూ బయల్దేరతాడు అమర్. రాథోడ్ని కార్ త్వరగా పోనిమ్మని అంటాడు.
ఘోరాను కలుస్తుంది మనోహరి. అమర్ అస్థికలు ఎక్కడ పెట్టాడో తెలియడం లేదు. ఎలాగైనా అస్థికలు తెచ్చి ఇస్తానని చెప్పా కదా.. మళ్లీ ఎందుకు కలవాలన్నావు అని అడుగుతుంది. ఆ ఆత్మను బంధించడానికి దీన్ని ఇంటి గుమ్మానికి కట్టమని ఒక తాయత్తుని ఇస్తాడు ఘోరా. దాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఇంట్లోకి తీసుకెళ్లకుండా గుమ్మానికి కట్టమని హెచ్చరిస్తాడు. సరే అని అది తీసుకుని అక్కడనుంచి వెళ్తుంది మనోహరి.
పూజారి ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. శివరామ్ మిస్సమ్మను కాఫీ తీసుకుని రమ్మంటాడు. అదేంటీ.. అమర్ పెళ్లి అరుంధతి స్నేహితురాలితో అన్నారు కదా.. మళ్లీ ఈ మిస్సమ్మ ఎవరు? అని అడుగుతాడు పూజారి. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు కదా పూజారిగారు. అలాగే మా అరుంధతి స్థానంలో మిస్సమ్మ మా ఇంటి కోడలయ్యింది.
అత్తగా చెప్పకూడదుగానీ నా ఇద్దరు కోడళ్లు చాలా మంచి వాళ్లు మమ్మల్ని చాలా బాగా చూసుకునే కోడళ్లు దొరకడం మా అదృష్టం అంటుంది నిర్మల. అవును పూజారి గారు మా అరుంధతే మిస్సమ్మ రూపంలో మళ్లీ మా ఇంటికి వచ్చినట్లుంది ఏ సంబంధం లేని ఇద్దరు ఒకేలా మాట్లాడటం, ప్రవర్తించడం ఏంటో అర్థం కావట్లేదు అంటాడు శివరామ్. ఏదో జన్మలో రక్తసంబంధం ఉండి ఉంటుంది అంటాడు పూజారి. మిస్సమ్మకు అసలు నిజం తెలుస్తుందా? మనోహరి తాయత్తుని గుమ్మానికి కడుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జులై 15న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్