VV Vinayak Pan India Movie: 500 కోట్ల బడ్జెట్తో వీవీ వినాయక్ పాన్ ఇండియా మూవీ
VV Vinayak Pan India Movie: 500 కోట్ల బడ్జెట్తో డైరెక్టర్ వీవీ వినాయక్ ఓ పాన్ ఇండియా మూవీ తీయబోతున్నాడన్న వార్త సంచలనంగా మారింది. అసలేంటీ మూవీ? ఎప్పుడు ప్రారంభం కాబోతోంది?
VV Vinayak Pan India Movie: టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వీవీ వినాయక్. ఆది, ఠాగూర్, లక్ష్మి, నాయక్, బన్నీ, ఖైదీ నంబర్ 150లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు వినాయక్ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. తానే హీరోగా ఓ సినిమా రాబోతుందన్న వార్త ఒకటి కాగా.. ఇప్పుడు అతని డైరెక్షన్లో రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీ రాబోతోందన్నది మరో వార్త.
ప్రస్తుతం వినాయక్ తెలుగులో సూపర్ హిట్ అయిన ఛత్రపతి మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ లీడ్ రోల్లో కనిపించనున్నాడు. మరోవైపు వినాయక్ డైరెక్షన్లో వచ్చిన చెన్నకేశవరెడ్డి మూవీ కూడా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే చెన్నకేశవరెడ్డి కూడా రీరిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 24, 25వ తేదీల్లో ఈ మూవీ 300 స్క్రీన్లలో రిలీజ కానుండటం విశేషం.
ఈ సందర్భంగా వినాయక్తోపాటు బెల్లంకొండ సురేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే వినాయక్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీ తీయబోతున్నట్లు సురేశ్ వెల్లడించాడు. ఛత్రపతి రీమేక్ చూసిన పెన్ స్టూడియోస్ వినాయక్ పనితీరు నచ్చడంతో ఈ మూవీ తీయబోతున్నట్లు కూడా సురేశ్ చెప్పాడు.
"ఛత్రపతి రీమేక్ ఎలా ఉందో పెన్ స్టూడియోస్ చూసింది. అది నచ్చే వీవీ వినాయక్కు ఓ సినిమా ఆఫర్ చేసింది. ఈ పాన్ ఇండియా మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం" అని సురేశ్ తెలిపాడు. అటు చెన్నకేశవరెడ్డి సీక్వెల్ను డైరెక్ట్ చేయడంపై వినాయక్ స్పందించాడు. బాలకృష్ణ ఇమేజ్కు సరిపడా స్క్రిప్ట్ దొరికితే ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తామని చెప్పాడు.
మరోవైపు వినాయకే హీరోగా మూవీ వస్తున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఆ మధ్య శీనయ్య అనే మూవీతో హీరోగా రానున్నట్లు వినాయక్ చెప్పినా.. ఆ మూవీ ఎందుకో గానీ పూర్తి కాలేదు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్తో అతడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనిలో అతడు బిజీగా ఉన్నాడు.