Urvashi Rautela: నోరు జారి క్షమాపణ చెప్పిన బాలయ్య హీరోయిన్.. సైఫ్ అలీ ఖాన్పై దాడి, డాకు మహారాజ్ సక్సెస్కు ముడిపెడుతూ..
Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి ఘటనపై నోరు జారిన డాకు మహారాజ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా..ఇప్పుడు క్షమాపణ చెప్పింది. ఆ దాడి తీవ్రతను అర్థం చేసుకోలేక తాను నోరు జారినట్లు ఆమె చెప్పడం విశేషం.
Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన కత్తి దాడి ఘటనపై ఊర్వశి రౌతేలా స్పందించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంత తీవ్రమైన దాడి జరిగిన సమయంలో డాకు మహారాజ్ సక్సెస్ వల్ల తనకు వచ్చిన బహుమతుల లిస్ట్ చెబుతూ.. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమే అన్నట్లుగా ఆమె మాట్లాడింది. వీటిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడామె క్షమాపణలు చెప్పింది.
ఊర్వశి రౌతేలా క్షమాపణ
డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణ సరసన నటించిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా శుక్రవారం (జనవరి 17) ఇన్స్టాగ్రామ్ ద్వారా క్షమాపణ చెప్పింది. ఆ సమస్య తీవ్రతను తాను అర్థం చేసుకోలేకపోయినట్లు చెప్పింది. "డియర్ సైఫ్ అలీ ఖాన్ సర్.. మీకు క్షమాపణ చెబుతూ రాస్తున్న పోస్ట్ ఇది.
మీరు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రత గురించి నాకు ఇప్పుడే తెలిసింది. డాకు మహారాజ్ సక్సెస్, తర్వాత నేను అందుకున్న బహుమతుల ఉత్సాహంలో నన్ను నేను మరచిపోయి అలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుగా ఉంది. నా క్షమాపణను స్వీకరించండి. మీ దాడి తీవ్రత ఏంటో తెలిసింది. అలాంటి సమయంలో మీరు చూపించిన తెగువ చాలా గొప్పది" అని ఊర్వశి రాసింది.
అసలు ఊర్వశి ఏమన్నదంటే?
అంతకుముందు సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనపై ఊర్వశి రౌతేలా స్పందించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై మాట్లాడుతున్న సమయంలో ఆమె తన ఒంటిపై ఉన్న డైమండ్ రింగును చూపిస్తూ, డాకు మహారాజ్ సక్సెస్ కు ముడిపెడుతూ స్పందించింది.
"ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర రూ.105 కోట్ల మార్క్ దాటింది. నాకు మా అమ్మ డైమండ్లు పొదిగిన రోలెక్స్ ఇచ్చింది. మా నాన్న ఈ వేలికి ఈ మినీ వాచ్ ఇచ్చాడు. కానీ బహిరంగంగా వీటిని ధరించే పరిస్థితి లేదు. ఎవరైనా మనపై దాడి చేయొచ్చన్న అభద్రతాభావం ఉంది" అని ఊర్వశి అన్నది.
ఈ కామెంట్స్ చూసి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆమెతో ఆడుకున్నారు. తన దగ్గర ఓ ఖరీదైన వాచ్ ఉందని దొంగలకు ఆమే చెబుతోందని ఒకరు.. ఈ అమ్మాయికి ఏదో అయిందని మరొకరు కామెంట్స్ చేశారు. తనపై ట్రోలింగ్ పెరగడంతో ఊర్వశి రౌతేలా క్షమాపణ చెప్పింది.