ఓటీటీలోకి ఓ తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు డాటరాఫ్ ప్రసాదరావు: కనబడుటలేదు (D/O Prasadarao). ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్ సిరీస్ అని జీ5 ఓటీటీ వెల్లడించింది. తాజాగా మంగళవారం (అక్టోబర్ 7) ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేస్తూ.. ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో సిరీస్ లోని మూడు ప్రధాన పాత్రలను చూడొచ్చు.
తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన ఈ డాటరాఫ్ ప్రసాదరావు కనబడుటలేదును రెక్కీ, విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ వంటి సక్సెస్ఫుల్ సిరీస్లను అందించిన సౌతిండియన్ స్క్రీన్స్ దీన్ని రూపొందిస్తోంది. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇందులో ప్రసాద రావుగా నటించాడు. ఉదయ భాను ఓ ముఖ్య పాత్రను పోషించింది.
ఇక ఓటీటీ రైజింగ్ స్టార్స్ అయిన వసంతిక ఇందులో స్వాతి పాత్రలో నటించింది. ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్లో ఓ తండ్రి అయిన రాజీవ్ కనకాల తన కూతురు స్వాతి కనిపించటం లేదని వెతుకుతుంటాడు. ఈ క్రమంలో నిజానికి దగ్గరయ్యే కొద్దీ తనకు తెలిసే రహస్యాలు, మోసాలు, వాటి వెనుక దాగిన ఊహించని నిజాలు ఏంటి? బాధ, భావోద్వేగం కలగలిసిన ఈ ప్రయాణం ప్రేక్షకులను మెప్పిస్తుందని జీ5 ఓటీటీ తెలిపింది.
ఈ సరికొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనౌన్స్మెంట్ సందర్భంగా జీ5 ఓటీటీతోపాటు సిరీస్ లోని నటీనటులు కూడా మాట్లాడారు. తెలుగు జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ.. ‘‘మనలో ఉండే భావోద్వేగాల నుంచి శక్తివంతమైన కథలు వస్తాయని మా జీ5 నమ్మకం. అలాంటి కథే ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’.
ఇది తండ్రి మనసులోని ప్రేమ, బలమైన ఇంటెన్సిటీని, మనసులో తెలియని భయాలను ఆవిష్కరిస్తుంది. ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే కథాంశమిది. దీన్ని సస్పెన్స్తో దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్లో కూర్చోపెడుతుంది. రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక అద్భుతమైన నటనతో మెప్పించారు. పోలూరు కృష్ణ, సౌతిండియన్ స్క్రీన్స్ ఈ సిరీస్ను మనసుకి హత్తుకునేలా, ప్రభావవంతంగా రూపొందించారు’’ అని అన్నారు.
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ‘‘‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుటలేదు’లోని ఎమోషనల్ కంటెంట్ నాకు బాగా నచ్చింది. ఇది ఒక మిస్టీరియస్, సస్పెన్స్ఫుల్ నెరేషన్తో సాగేది మాత్రమే కాదు. తండ్రీ కూతురు మధ్య ఉండే విడదీయరాని ప్రేమానుబంధాన్ని తెలియజేస్తుంది. ప్రసాదరావుగా నటించేటప్పుడు నేను కూడా ఓ తండ్రిగా ఆ ఎమోషన్స్ను ఫీలయ్యాను. యూనివర్సల్ పాయింట్తో నడిచే కథతో రూపొందింది. కాబట్టి ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. కుటుంబంలోని బలమైన బంధాలు, ప్రేమను ఇది ఆవిష్కరిస్తుంది’’ అన్నాడు.
నటి ఉదయభాను మాట్లాడుతూ.. ‘‘‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుటలేదు’ కథ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గానే కాదు.. బలమైన ఎమోషన్స్తో కనెక్ట్ అవుతుంది. ఇంటెన్స్ స్టోరీ మనసులను తాకుతుంది. ఇద్దరమ్మాయిలకు తల్లిగా నేను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. అలాగే ఆసక్తికరమైన కథనంతో సిరీస్ బ్యాలెన్స్డ్గా మెప్పిస్తుంది. ఇదే యూనిక్ కంటెంట్గా మెప్పిస్తుంది’’ అని చెప్పింది.
సంబంధిత కథనం