టాలీవుడ్ లో పాపులర్ డైరెక్టర్లలో ఒకరు, హిట్ సినిమాలు అందించిన ఏఎస్ రవి కుమార్ చౌదరీ కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు రవి కుమార్ మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్న రవి కుమార్ గుండెపోటుతో మరణించారు. తెలుగు సినిమా రంగంపై ఆయన తనదైన ముద్ర వేశారు. హిట్ సినిమాలతో సత్తాచాటారు.
ఏఎస్ రవి కుమార్ చౌదరి హీరో గోపీచంద్ సినిమాతో డైరెక్టర్ గా డెబ్యూ చేశారు. ఆ సినిమా పేరు యజ్ఞం. యజ్ఞం మూవీతో తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్న రవి కుమార్.. తొలి మూవీతోనే హిట్ కొట్టారు. గోపీచంద్ కెరీర్ లోనే యజ్ఞం మూవీకి స్పెషల్ ప్లేస్ ఉంది. ఈ సినిమాతో హీరోగా గోపీచంద్ కెరీర్ ఊపందుకుంది.
ఏఎస్ రవి కుమార్ చౌదరి బాలకృష్ణతో వీరభద్ర సినిమా చేశారు. ‘సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం’ అనే ఫేమస్ మీమ్ డైలాగ్ ఈ సినిమాలోనిదే. ఈ మీమ్ బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్) తో పిల్ల నువ్వు లేని జీవితం మూవీ తీశారు రవి కుమార్. ఈ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెట్టారు సాయి ధరమ్ తేజ్. మెగా హీరోను రవి కుమార్ గ్రాండ్ గా లాంఛ్ చేశారు.
గోపీచంద్ కు యజ్ఞం లాంటి హిట్ ఇచ్చిన రవి కుమార్.. మరోసారి మాచో మాన్ తో సౌఖ్యం కోసం జతకట్టారు. ఆ తర్వాత నితిన్ తో ఆటాడిస్తా సినిమా తీశారు. రవి కుమార్ చివరగా డైరెక్ట్ చేసిన మూవీ తిరగబడరా సామి. ఇందులో రాజ్ తరుణ్ హీరో. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ కు రవి కుమార్ ముద్దు పెట్టడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్ రవి కుమార్ గుండెపోటుతో మంగళవారం (జూన్ 10) రాత్రి మరణించినట్లు చెబుతున్నారు. అయితే ఆయన మరణానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు రవి కుమార్ కు భార్య, పిల్లలున్నారు. కానీ కొంతకాలంగా ఫ్యామిలీకి దూరంగా, ఒంటరిగా రవి కుమార్ ఉంటున్నట్లు సమాచారం. ఏదేమైనా మంచి డైరెక్టర్ ను కోల్పోవడంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఆయన మృతికి సంతాపంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
సంబంధిత కథనం