‘ది రాజా సాబ్’ సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఏకంగా ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీకి వాయిదా పడింది. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై హైప్ ఓ రేంజ్లో ఉంది. టీజర్ డేట్ కూడా ఇటీవలే రివీల్ అయింది. కాగా, ది రాజా సాబ్ సినిమాపై డైరెక్టర్ మారుతి తాజాగా అదిరిపోయే కామెంట్స్ చేశారు.
ది రాజా సాబ్ విషయంలో తన నుంచి, ప్రభాస్ నుంచి అభిమానులు ఏం వస్తుందని అంచనా వేస్తున్నారో.. అంత కంటే ఒకశాతం ఎక్కువే ఇస్తానని మారుతి అన్నారు. జూన్ 16న టీజర్ వస్తుందని, కచ్చితంగా అదిరిపోతుందనేలా మీరే చూస్తారంటూ చెప్పారు. టీజర్ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా.. హైప్ను మరింత పెంచేశారు మారుతి.
మచిలీపట్నంలో జరిగిన బీచ్ ఫెస్టివల్ కార్యక్రమంలో మారుతి మాట్లాడారు. రాజా సాబ్ చిత్రం గురించి చెప్పారు. “ఈ సినిమా గురించి ఇంత వరకు ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకంటే నేను కాదు.. పని మాట్లాడాలని అనుకున్నా. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా. ఫ్యాన్స్ ఆయన నుంచి, నా నుంచి ఏం ఆశిస్తున్నారో అంతకంటే ఒక శాతం ఎక్కువే ఇస్తా. మీరు ఆయనపై చూపించే ప్రేమ.. నా ప్రేమ ఏంటో కూడా జూన్ 16న చూస్తారు” అని మారుతి అన్నారు.
“జూన్ 16న టీజర్ తీసుకొస్తున్నాం. కచ్చితంగా.. రాజులకే రాజు ప్రభాస్ రాజు. మీరు చూస్తారు” అని మారుతి అన్నారు. “జై రెబల్ స్టార్. రెండేళ్ల నుంచి నా బాడీలో అదే పేరు మోగుతోంది” అని చెప్పారు. ఈ వీడియోను రాజా సాబ్ మూవీ టీమ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మారుతి కామెంట్లతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. జూన్ 16 కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.
ది రాజా సాబ్ సినిమాకు గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉండడంతో ఆలస్యమవుతోంది. ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ మూవీని డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు మూవీ టీమ్ ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యుయల్ రోల్లో కనిపించనుండగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ది రాజా సాబ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూజ్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.
సంబంధిత కథనం