టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన మూవీ శుభం (Subham). ఈ సినిమా గత నెలలో థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది. మొత్తానికి ఇప్పుడు వచ్చే వారమే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని కొన్ని రోజుల కిందటే వెల్లడించిన జియోహాట్స్టార్ ఓటీటీ తాజాగా ఆదివారం (జూన్ 8) ట్రైలర్ రిలీజ్ చేసింది.
సమంత ప్రొడ్యూస్ చేసిన తెలుగు హారర్ కామెడీ మూవీ శుభం. ఏళ్లకు ఏళ్లుగా సాగే టీవీ సీరియల్స్ చూస్తూ దెయ్యాలుగా మారే భార్యల చుట్టూ సాగే ఫన్నీ మూవీ ఇది. ఈ సినిమా వచ్చే శుక్రవారం (జూన్ 13) నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇదే విషయాన్ని మరోసారి చెబుతూ ఆ ఓటీటీ ఓ ట్రైలర్ రిలీజ్ చేసింది. “మీరు నవ్వుతారు. మీరు భయపడతారు. మళ్లీ మళ్లీ అదే చేస్తారు. మీరు ఇప్పటి వరకూ చూడని హారర్ కామెడీ. జియోహాట్స్టార్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ పోస్ట్ చేసింది.
నిజానికి ఈ సినిమా మొదట జీ5 ఓటీటీలో వస్తుందని భావించారు. అయితే ఆ ఓటీటీ డీల్ రద్దు చేసుకోవడంతో జియోహాట్స్టార్ దక్కించుకుంది.
శుభం మూవీని సమంత ప్రొడ్యూస్ చేసింది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ సక్సెస్ సాధించింది. అంతేకాదు ఈ సినిమా డిజిటల్ హక్కులను కూడా జియోహాట్స్టార్ ఏకంగా రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఓ లోబడ్జెట్ సినిమాకు ఇది చాలా ఎక్కువే. హారర్ కామెడీ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ పెరి, శ్రియా కొంతం, షాలిని కొండెపూడి కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించాడు.
ఆడవాళ్లలో ఉండే సీరియల్ పిచ్చి ప్రధానంగా సాగే హారర్ కామెడీ మూవీ ఇది. సింపుల్ పాయింట్తో చివరి వరకు ఎంటర్టైన్ చేశాడు డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల. సీరియల్ అంటేనే ఏళ్లకు ఏళ్లు సాగడం కామన్. ఓ టీవీ సీరియల్ను రెగ్యులర్గా ఫాలో అవుతూ .. అది పూర్తికాకుండానే చనిపోయిన వాళ్లు ఆత్మలై తిరిగి వచ్చి సీరియల్ను చూస్తే ఏంటన్నదే శుభం సినిమా కథ. ఈ గమ్మత్తైన కథను మూడు యువ జంటల జీవితాలతో అంతే ఫన్నీగా తెరపై చూపించారు దర్శకుడు. టీవీ సీరియల్స్లో ఎక్కువగా కనిపించే స్త్రీల అణిచివేత, పురుషాధిక్యత లాంటి సున్నితమైన అంశాలను వివాదాలకు తావు లేకుండా వినోదాత్మకంగా డీల్ చేసిన విధానం బాగుంది.