ప్రపంచ శాంతి సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో హాలీవుడ్లో డైరెక్ట్గా నిర్మిస్తున్న సినిమా 'కింగ్ బుద్ధ'. తాజాగా కింగ్ బుద్ధ పోస్టర్ లాంచ్ ఈవెంట్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గ్రాండ్గా జరిగింది.
మూవీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ సత్యారెడ్డి అభిమానులు, చిత్ర యూనిట్ సభ్యులు, ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ ఈవెంట్కు మూడుసార్లు కెడర్ పార్క్ మేయర్గా పనిచేసిన మ్యాట్ పోవెల్ చీఫ్ గెస్ట్గా హాజరై 'కింగ్ బుద్ధ' పోస్టర్ను అధికారికంగా లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మ్యాట్ పోవెల్.. "గౌతమ బుద్ధుడు ప్రపంచ శాంతి కోసం అమితమైన కృషి చేశారు. ఒక టాలీవుడ్ డైరెక్టర్, నా స్నేహితుడైన సత్యారెడ్డి ఈ సినిమాను టాలీవుడ్ లేదా బాలీవుడ్లో తీసి హాలీవుడ్లో డబ్బింగ్ చేయకుండా, డైరెక్ట్గా హాలీవుడ్లోనే నిర్మించడం చాలా సంతోషకరం" అని అన్నారు.
"తెలుగు సంతతికి చెందిన వ్యక్తిగా భారీ బడ్జెట్తో హాలీవుడ్లో సినిమా తీస్తున్న సత్యారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. చిత్ర నిర్మాణానికి నావంతు సహాయ సహకారాలు అందిస్తామని, అవసరమైతే షూటింగ్ కోసం మా బంగ్లాలు, ప్రాపర్టీలను ఉపయోగించుకోవచ్చు" అని మ్యాట్ పోవెల్ పేర్కొన్నారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన శైలర్ మాట్లాడుతూ.. "ప్రపంచ శాంతి కోసం హాలీవుడ్లో డైరెక్టర్ సత్యారెడ్డి నిర్మించే 'కింగ్ బుద్ధ' సినిమాకు అన్లిమిటెడ్ బడ్జెట్తో, ఎక్కడా కాంప్రమైజ్ చేయకుండా అన్ని హై-లెవెల్ టెక్నికల్ అసెట్స్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తాము" అని తెలిపారు.
కాగా, గతంలో సత్యారెడ్డి డైరెక్షన్లో 'ఉక్కు సత్యాగ్రహం' సినిమాలో గద్దర్ నటించారు. ఈ సినిమాలోని అనేక సన్నివేశాల్లో బుద్ధిజీవి శాంతి ప్రవచనాలు చూసి ఆకర్షితులైనట్లు శైలర్ పేర్కొన్నారు.
"ఆ సినిమాను చూసినప్పుడే సత్యారెడ్డి డైరెక్షన్లో ప్రపంచ శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో 'కింగ్ బుద్ధ'ను పూర్తిస్థాయిలో హాలీవుడ్లో నిర్మించాలని నిర్ణయించుకున్నాము. డైరెక్టర్ సత్యారెడ్డి చెప్పిన స్టోరీతో ఇప్పుడు ఆ కల నెరవేరబోతోంది" అని నిర్మాత శైలర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యారెడ్డి మాట్లాడుతూ.. "నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా, రచయితగా, గాయకుడుగా 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నేను, ప్రపంచ శాంతి కోసం 'కింగ్ బుద్ధ' కాన్సెప్ట్ను నా నిర్మాతలకు చెప్పగానే వారు భారీ బడ్జెట్తో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు" అని తెలిపారు.
ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్మాతలతో పాటు, అమెరికాలోని అనేక రాష్ట్రాల నుంచి విచ్చేసిన అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు.
"అతి త్వరలో ప్రపంచంలోని ప్రముఖ బౌద్ధమత పెద్దలు, గురువులు, మంక్స్లు, బౌద్ధమతంపై రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్లు, బౌద్ధమత అన్వేషకుల సమక్షంలో ఇండియాలోని ఒక ప్రముఖ బౌద్ధారామంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాము" అని సత్యారెడ్డి ప్రకటించారు.
కాగా ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్స్, పారిశ్రామికవేత్తలు పుల్లారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, ప్రవర్ధన్, సాయి గణేష్ రెడ్డి, శివ జోష్నా రెడ్డి తో పాటు అనేక మంది ఎన్నారైలు, ప్రముఖులు పాల్గొన్నారు.
సంబంధిత కథనం