తిరుమలలో కొలువైన శ్రీవారికి సంబంధించిన గోవింద నామాలను భక్తులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పలుకుతారు. అలాంటి వాటిని ఓ అసభ్యకరమైన పాటలో చేర్చడంపై ఇప్పుడు టీటీడీతోపాటు శ్రీవారి భక్తులు కూడా మండిపడుతున్నారు. తమిళ నటుడు సంతానం మూవీ డీడీ నెక్ట్స్ లెవెల్ సాంగ్ కిస్సా 47లో శ్రీనివాస గోవిందా అనే పదాలను దారుణంగా చూపించడంతో చిక్కుల్లో పడ్డాడు.
డీడీ నెక్ట్స్ లెవెల్ మూవీలోని కిస్సా 47 సాంగ్ రెండు నెలల కిందటే రిలీజైంది. ఈ మూవీ మే 16న రిలీజ్ కాబోతోంది. ఈ సమయంలో ఈ పాటపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. గోవింద నామాలను ఇలా ఓ అసభ్యకరమైన పాటలో వాడటంపై బీజేపీ నేత, టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డితోపాటు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అలా చేయలేకపోతే రూ.100 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కిరణ్ రాయల్ ఇప్పటికే తమిళనాడు ప్రతిపక్ష నేత పళనిస్వామిని కలిసి ఈ వివాదాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
తమిళ నటుడు సంతానంకు టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి పరువు నష్టం నోటీసులను పంపించారు. అతనితోపాటు నిహారిక ఎంటర్టైన్మెంట్స్ కూ ఈ నోటీసులు జారీ అయ్యాయి. వెంటనే ఆ పాటను సినిమాతోపాటు సోషల్ మీడియా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే వెంటనే రూ.100 కోట్లు ఇవ్వాలని తేల్చి చెప్పారు. హిందువుల మనోభావాలని ఈ పాట దెబ్బ తీసేలా ఉందని ఆయన ఓ వీడియోలో అన్నారు.
వాళ్లకు దమ్ముంటే ఇతర మతాల వారిని కించపరిచేలా ఇలాంటి పాటలు తీసుకురావాలని సవాలు విసిరారు. కిస్సా 47 అనే ఈ పాట మొదట్లోనే శ్రీనివాస గోవిందా అనే గోవింద నామాలు వినిపిస్తాయి. ఈ పాట ఫిబ్రవరి 26నే యూట్యూబ్ లోకి వచ్చింది. ఇప్పటికే 93 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఈ వివాదంపై ఇప్పటి వరకూ అటు సంతానంగానీ, ఇటు ప్రొడ్యూసర్స్ గానీ స్పందించలేదు.
సంబంధిత కథనం