తమిళ నటుడు జయం రవి విడాకుల కేసు మరో మలుపు తిరిగింది. అతని నుంచి మాజీ భార్య భారీగా డిమాండ్ చేస్తుండటం గమనార్హం. గత వారమే సోషల్ మీడియా ద్వారా ఈ మాజీ భార్యాభర్తలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఆర్తి తనను ఏళ్లపాటు వెన్నులో పొడిచిందని, ఇప్పుడు గుండెల్లో పొడుస్తోందని జయం రవి ఓ భారీ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
రవి మోహన్ అలియాస్ జయం రవి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. 15 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత గతేడాది ఈ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అప్పుడే తనకు విడాకులు కావాలంటే అతడు కోర్టుకెక్కాడు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో గతేడాది సెప్టెంబర్ నుంచి కేసు నడుస్తోంది.
తాజాగా జరిగిన విచారణలో రవి మోహన్ వేసిన పిటిషన్ ను జడ్జి తెన్మొళి చేపట్టారు. అసలు ఆర్తితో మళ్లీ కలిసుండే ప్రసక్తే లేదని, తనకు విడాకులు కావాల్సిందే అని తన పిటిషన్ లో రవి స్పష్టం చేశాడు. మరోవైపు ఆర్తి కూడా ఓ కౌంటర్ పిటిషన్ వేసింది. అందులో తనకు నెలకు రూ.40 లక్షలు మెయింటెనెన్స్ కింద ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు కేసును జూన్ 12కు వాయిదా వేసింది.
జయం రవి, ఆర్తి పెళ్లి తర్వాత 15 ఏళ్లు కలిసున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇక విడిపోవాలని నిర్ణయించుకున్నారు. గతేడాది నుంచి వీళ్లు విడివిడిగానే ఉంటున్నారు. తన పిల్లలను కూడా కలవనివ్వడం లేదని ఈ మధ్యే రవి ఆరోపించాడు. అంతేకాదు తన గర్ల్ఫ్రెండ్ గా భావిస్తున్న కెనీషా ఫ్రాన్సిస్ తో కలిసి అతడు బయట కనిపించడంతో ఆర్తి అతనిపై తీవ్రంగా మండిపడుతూ ఓ పోస్ట్ చేసింది.
దీనికి రవి కూడా ఘాటుగానే స్పందించాడు. తనకు ఎవరూ లేని సమయంలో కెనీషా అండగా నిలిచిందని చెప్పాడు. ఎన్నో ఏళ్లుగా ఆర్తి తనతో వ్యవహరించిన తీరును కూడా అందులో వివరించాడు. మొత్తానికి ఈ తమిళ నటుడి విడాకుల కేసు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. మరి ఇది ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.
సంబంధిత కథనం