తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో చిత్రం రేపు (మే 1) థియేటర్లలో విడుదల కానుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీకి ఫుల్ క్రేజ్ ఉంది. తమిళనాడులో తొలి రోజు అదరగొట్టే ఛాన్స్ ఉంది. అయితే, రెట్రోకు పోటీగా తమిళంలో ఓ తక్కువ బడ్జెట్ వస్తోంది. అదే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. ఈ చిత్రం కూడా మే 1న విడుదలవుతోంది. రెట్రో లాంటి భారీ సినిమాకు పోటీగా దిగుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటి సిమ్రన్, శశికుమార్ లీడ్ రోల్స్ చేశారు.
రెట్రోతో తమ టూరిస్ట్ ఫ్యామిలీని ఎందుకు పోటీకి దింపాల్సి వస్తుందో కారణం చెప్పారు నిర్మాత యువరాజ్ గణేశన్. ఈ సినిమా కోసం నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ విషయం గురించి మాట్లాడారు.
ఓటీటీ డీల్ వల్లే తాము థియేటర్లలో రెట్రోతో పోటీ పడాల్సి వస్తుందని నిర్మాత యువరాజ్ తెలిపారు. ఓటీటీతో ఒప్పందం కారణంగా విడుదల తేదీని మార్చలేకపోతున్నామని, సూర్య సినిమాతో పోటీ పడాలని తమకు అసలు లేదని చెప్పారు. “సినిమా థియేట్రికల్ రిలీజ్లను ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లు డిసైడ్ చేస్తున్నాయి. మేం చేసుకున్న ఓటీటీ స్లాట్ ప్రకారం.. మే మొదట్లోనే థియేటర్లలో ఈ చిత్రాన్ని విదుదల చేయాలి. అందుకే మే1న విడుదల చేస్తున్నాం. రెట్రోతో పోటీ పడాలనేది మా ఉద్దేశం కాదు” అని గణేశన్ తెలిపారు.
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్స్టార్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో కూడా థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే గణేశన్ చెప్పేశారు. మే చివర్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ స్లాట్ ఉందని తెలిపారు. అంటే థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకే టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ జియోహాట్స్టార్ ఓటీటీలోకి వస్తుంది.
టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రానికి అభిషన్ జీవినాథ్ దర్శకత్వం వహించారు. శ్రీలంక ఆర్థిక పరిస్థితి కుదేలవడంతో భవిష్యత్తు కోసం ఇండియాకు శరణార్థిగా వచ్చే కుటుంబం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఫీల్ గుడ్ ఎమోషన్లతో ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. ఈ చిత్రంలో శశికుమార్, సిమ్రన్తో పాటు యోగిబాబు, మిథున్ జైశంకర్, కమలేశ్, భాస్కర్, రమేశ్ తిలక్ కీరోల్స్ చేశారు. సీన్ రోల్డన్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం