తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగు రాష్ట్రాల్లోనూ అమితమైన అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు తెలుగులో సైతం రిలీజ్ అవుతుంటాయి. కోలీవుడ్ అగ్ర కథానాయుకుడు సూర్య నటించిన లేటెస్ట్ మూవీనే రెట్రో. బుట్టబొమ్మ పూజా హెగ్డే రెట్రోలో హీరోయిన్గా చేసింది.
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో మూవీని సూర్య, జ్యోతిక సొంత బ్యానర్ అయిన 2డీ ఎంటర్టైన్మెంట్పై నిర్మించారు. మే 1న రెట్రో మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏప్రిల్ 26న హైదరాబాద్లో గ్రాండ్గా రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హీరో సూర్య మాట్లాడుతూ, "ముందుగా పహల్గామ్ బాధితులకు నివాళులు. రెట్రో వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు నాపై కురిపిస్తున్న ప్రేమ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ గారి సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది" అని అన్నాడు.
"రెట్రో ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సంతోష్ నారాయణన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. అలాగే తెలుగులో శ్యామ్ గారు బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ప్రకాష్ రాజ్ గారు, జోజు జార్జ్ గారు, జయరామ్ గారు, నాజర్ గారు లాంటి సీనియర్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది" అని సూర్య చెప్పాడు.
"పూజా హెగ్డే నాకంటే ఎక్కువగా సినిమాని ప్రమోట్ చేస్తోంది. మీరు రెట్రో ట్రైలర్లో చూసినట్టుగానే.. లవ్, కామెడీ, యాక్షన్, ఇంటెన్సిటీ అన్నీ సినిమాలో ఉంటాయి. మే 1న విడుదలవుతున్న రెట్రో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను" అని సూర్య ఆశాభావం వ్యక్తం చేశాడు.
"నాగవంశీ గారిది లక్కీ హ్యాండ్ అంటుంటారు. ఆయనతో చేతులు కలపడం సంతోషంగా ఉంది. నా తదుపరి చిత్రాన్ని నాగవంశీ గారి నిర్మాణంలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది" అని సూర్య పేర్కొన్నాడు.
"మే 1న విడుదలవుతున్న నాని 'హిట్-3' కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. విజయ్ నా సోదరుడు లాంటివాడు. విజయ్ జర్నీ చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. 'కింగ్ డమ్' సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని సూర్య ఆకాంక్షించాడు.
"విజయ్ దేవరకొండ అగరం ఫౌండేషన్ గురించి మాట్లాడాడు. అయితే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మా అగరం ఫౌండేషన్కి ఎందరో తెలుగు వారు అండగా ఉన్నారు. నాకు ఇన్నేళ్లుగా సపోర్ట్గా నిలుస్తూ వస్తున్న నా అభిమాన సోదరులకు, సోదరీమణులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు" అని సూర్య తన స్పీచ్ ముగించాడు.
సంబంధిత కథనం